జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం – 2013 పోస్టర్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే అంతర్గత కమిటీలు ప్రతిచోట ఉండాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోమ్ లు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, హాస్పిటల్స్, సహకార సంస్థలు, విద్యా సంస్థలు, కార్పొరేషన్, స్వయం ఉపాధులు, బ్యాంకులు మరే ఇతర చోటనైనా 10 మందికన్నా తక్కువగా ఉన్నా సరే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినవారందిరిపట్ల ఈ చట్టం వర్తిస్తుందన్నారు. భౌతికంగా శరీరాన్ని తాకడం, శారీరకంగా కలవాలని అభ్యర్థించడం లేదా బలవంత పెట్టడం, శృంగారపరమైన చేష్టలు- సంభాషణలు, కామెంట్స్ అసభ్యకరమైన సైగలు, వర్ణనలు, మానసికంగా బాధకలిగించేలా మాట్లాడటం, అవాంఛనీయంగా – అనైతికంగా బలవంతం చేయడం, ఆక్రమించుకోవాలని చూడడం, ద్వంద్వార్థాలుగా మాట్లాడటం, దుఃఖం, కోపం తెప్పించేలా, ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం తదితర అంశాలన్ని లైంగిక వేధింపులలోకి వస్తాయన్నారు. ఏ స్థాయికి చెందిన మహిళా సిబ్బందిపట్ల సముచిత గౌరవం లేకుండా ప్రవర్తించకూడదని, ఆడవారి రూపాన్ని, వేషభాషల్ని, దుస్తులను గురించి కామెంట్స్ చేయడం, ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించడం, సలహాలివ్వడం, కుళ్ళు జోకులేయడం, బూతు బొమ్మలు, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్, ఇ-మెయిల్స్, భయపెట్టేలా బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేయరాదన్నారు. ప్రతీ కార్యాలయం, బ్యాంకులు, పోస్టాఫీసులు, రైల్స్, ఆర్.టి.సి సంస్థలైనా వచ్చే కస్టమర్ల పట్ల, క్యూలో వ్యక్తులపట్ల ఎక్కడా అవమానాలు, వేధింపులు జరగకుండా చూడటానికి 2 కమిటీలు ఉన్నాయన్నారు.
సంఘటనలు జరిగిన నెలలోపు బాధితులు అంతర్గత కమిటీ – లోకల్ కమిటీకి ఫిర్యాదు చెయ్యాలి. అంతర్గత కమిటీ (ఐ.సి) ఛైర్పర్సన్, ముగ్గురు సభ్యులు (ఉద్యోగి చట్టాలపై, న్యాయశాస్త్రం పై అవగాహన కల్గినవారు ఎన్.జి.ఓ), లోకల్ కమిటీ (ఎల్.సి), స్థానిక ఫిర్యాదుల కమిటీ జిల్లా స్థాయిలో ఏర్పాటుచేస్తారు. 1. చైర్ పర్సన్ నామినేటెడ్ ఉద్యోగి, 2. నామినేటెడ్ ఉద్యోగిని, 3. ఇద్దరు నామినేటెడ్ సభ్యులు (ఎల్.సి), స్వచ్ఛంద సంస్థలలో- అసోసియేషన్స్ మహిళల కొరకు పనిచేసేవారు ఒకరు మహిళ అయి ఉండాలి. కమిటీలలో కనీసం 50 శాతం మహిళలు ఉండాలన్నారు. కమిటీలు బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వాలి. ఐ.సి.సి సభ్యులు సమావేశమై ఫైలు చేసిన అంశాలు నమోదు చేసుకుని విచారణ చేపట్టాలని, విశ్లేషించే అంశాలతో, రికమండ్ చేసే అంశాలతో నివేదిక తయారు చెయ్యాలన్నారు. శిక్షలకు సంబంధించి తీవ్రతను అనుసరించి బదిలీచేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం అనే హెచ్చరిక చేయడం, ప్రమోషన్ నిలుపుదల, అవసరాన్ని బట్టి అపరాధ రుసుం సమాలు చేసి బాధితురాలికి ఇవ్వడం, వైద్య ఖర్చులు భరించడం, ఉద్యోగం నుండి తొలిగించడం వంటివి ఉంటాయి. జరిమానాలు కూడా విధించడం జరుగుతుందన్నారు. ఈ అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులు ఉమెన్ హెల్ప్లైన్ 181, ఎమర్జెన్సీ 112, పోలీస్ 100 కి డయల్ చేయవచ్చని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోష్ చట్టం మీతోడుగా, హ్యాండ్ బుక్ ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు.