హైదరాబాద్ : ఇటు బుల్లి తెరపై క్రేజీ యాంకర్గానూ, అటు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రలకు మంచి ఆప్షన్గా మారింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం అనూ ఖాతాలో చాలా సినిమాలున్నాయి. అల్లూ అర్జున్ ‘పుష్ప’ లోనూ, రవితేజ ‘ఖిలాడీ’ చిత్రాల్లో చెప్పుకోతగ్గ పాత్రలు పోషిస్తోన్న అనసూయ.. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమాల్లో సైతం ప్రత్యేకంగా అలరించబోతోంది. వీటితో పాటు విజయ్ సేతుపతి నటిస్తోన్న ఓ తమిళ మూవీలోనూ, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న ‘భీష్మపర్వం’లోనూ, మోహన్లాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీలోనూ నటిస్తోంది అనసూయ. ఇదిలా ఉంటే.. అనసూయ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి అనసూయ ఇదివరకే ‘కథనం, థాంక్యూ బ్రదర్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో నటించింది. అయితే ఆ సినిమాలతో ఆశించిన రీతిలో మెప్పించలేకపోయింది. అందుకే ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సంపత్ నంది సొంత నిర్మాణ సంస్థపై ఈ సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరపుకుంటోంది. మరి ఈ సినిమాతోనైనా అనసూయ లీడ్ రోల్ లో హిట్ కొడుతుందేమో చూడాలి.