మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి అపరిమితమైన మెజారిటీ ఉన్నప్పుడూ ప్రతిపక్షాలను పార్లమెంటులో గొంతెత్తనివ్వలేదు. ఇప్పుడు బీజేపీకి మెజార్టీకి కావలసిన దానికన్నా 33 సీట్లు తక్కువ వచ్చిన గతవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశంలో మునుపటి పద్ధతిలోనే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గత శుక్రవారం పార్లమెంటు అర్థాంతరంగా వాయిదాపడిరది. సోమవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లోనూ బీజేపీ అదే ఆధిపత్య ధోరణి ప్రదర్శించింది. పదహారవ, పదిహేడవ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడంటూ ఎవరూలేరు. ఈసారి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కినా ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి బీజేపీ సిద్ధంగా లేదని ఈ పార్లమెంట్ సమావేశాలు రుజువు చేస్తున్నాయి. ఇదివరకటిలాగే ప్రతిపక్ష నాయకుల ప్రసంగాల్లోని కొన్నిభాగాలను రికార్డుల నుంచి తొలగించడానికి రాజ్యసభ అధ్యక్షుడు ధన్కర్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ఎంతమాత్రం వెనుకాడడంలేదు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన మాటలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ మోదీ అకృత్యాలను, విద్వేష రాజకీయాలను, సమాజాన్ని మతాల వారీగా చీల్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిపక్షం ఎండగడ్తే దాన్ని కూడా ఉభయ సభల అధిపతులు సహించలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతల ఉపన్యాసాల్లోని భాగాలను వెనక ముందు చూడకుండా రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. అధికారపక్ష సభ్యుల మాటల్లో అభ్యంతరకరమైనవి, రికార్డుల నుంచి తొలగించవలసినవి సభాధిపతులకు వినిపించకపోవడం వారు ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడానికి ఆ స్థానంలో ఉన్నారో అర్థం అవుతూనే ఉంది. సోవతువారం నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించాలనీ, గత ఏడు సంవత్సరాలలో కనీసం 70 సార్లు పరీక్షా పత్రాలు లీక్ అయినాయన్న కఠిన సత్యాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం ఎటూ సిద్ధంగా లేదు. కానీ సభాధిపతులు కూడా ఈ అంశం చర్చకు రాకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ముందు పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేసే తీర్మానంపై చర్చ జరగాలని కుంటి సాకు చూపుతున్నారు. నీట్ మీద చర్చకు అవకాశం ఇస్తామని మాత్రం హామీ ఇవ్వడం లేదు. ఈ ధోరణి చూస్తుంటే నీటు మీద ఎలాంటి చర్చ జరగకుండా ఏదో ఒక సాకు చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి సభాపతులు మార్గం సుగమం చేస్తున్నారు. సభలో మాట్లాడడానికి ఆటంకాలు ఎదురవుతున్నందువల్ల ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేయవలసిన పరిస్థితి బొటాబొటి మెజారిటీ కూడా లేనీ బీజేపీ హయాంలో తప్పేట్లు లేదు. ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఆపాలని ‘‘ఇండియా’’ ఐక్యసంఘటనకు చెందిన నాయకులు నిరసన సందర్భంగా కోరారు. ఈ నిరసనలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. నిరసన తెలియజేసిన కొందరు ప్రతిపక్ష నాయకుల చేతుల్లో ‘‘బీజేపీలో చేరండి, అవినీతికి లైసెన్స్ పొందండి’’ అని రాసి ఉన్న ప్లకార్డులు కనిపించాయి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, అరెస్టుకు ముందు దాకా జార్ఖండ్ ముఖ్యంత్రిగా ఉన్న హేమంత్ సొరేన్ మీద నిరాధారమైన ఆరోపణలు మోపి సరిగ్గా ఎన్నికలకు ముందు అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వానికి ఈ నిరసనలు చెవికెక్కుతాయనుకోవడం భ్రమే. మెజార్టీతో నిమిత్తం లేకుండా అదే నిరంకుశత్వం కొనసాగించడానికి మోదీ సిద్ధపడ్డారని పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కే విధానాలు దివ్యంగా కొనసాగుతున్నాయి.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖడ్గే ఎన్.సి.ఇ.ఆర్.టి.తో సహా అన్ని వ్యవస్థలలోనూ ఆర్.ఎస్.ఎస్. వారిని నింపేస్తున్నారని ఆరోపించడానికి బీజేపీ సభ్యులే కాదు రాజ్యసభ అధ్యక్షుడు ధన్ కర్ కూడా సిద్ధంగా లేరని సోమవారం నాటి సభా కార్యకలాపాలు రుజువు చేశాయి. ‘‘ఏ సంస్థలోనైనా సభ్యుడిగా ఉండడం నేరమా?’’ అని ధన్కర్ ఆర్.ఎస్.ఎస్.ను వెనకేసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఆ సంస్థ దేశం కోసం కృషి చేస్తోందని ఓ సర్టిఫికెట్ కూడా పారేశారు. దీని ద్వారా ధన్ కర్ రెండు అంశాలను నిరూపించారు. ఒకటి: సకల వ్యవస్థలను ఆర్.ఎస్.ఎస్. వారితో నింపేయడం. రెండు: ఆ సంస్థను బాహాటంగా సమర్థించడం. ఆ సమయంలోనే ఖడ్గే వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తామని ధన్ కర్ చెప్పేశారు. అప్పుడు ఖడ్గే మాటలు భవిష్యత్తులో రికార్డుల్లో కనిపించకపోవచ్చు కానీ సభాధ్యక్షుడి మాటలు రికార్డులలో పదిలంగానే ఉంటాయి. ఆర్.ఎస్.ఎస్. భావజాలం దేశానికి ప్రమాదకరం అన్న ఖడ్గే మాటను ధన్కర్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో వక్రీకరించిన వైనాన్ని ఖడ్గే ఎత్తి చూపారు. అలాగే పార్లమెంటు ఆవరణలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. వాటిని మునుపున్న చోటికి చేర్చాలని కోరారు. రాష్ట్రపతి నోట సహకారం ఆవశ్యకత అన్న మాటను మోదీ ప్రభుత్వం పలికించింది. కానీ తాను మాత్రం సహకరించడానికి సంసిద్ధంగా లేదు. పార్లమెంటులో జరిగే ప్రతి విషయం ప్రజల దాకా వెళ్తుందని, అందువల్ల నీట్ అవకతవకలపై చర్చించి ఆ పరీక్షలు రాసేవారికి భరోసా కలిగిద్దామన్న రాహుల్ గాంధీ సూచనను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నంత సేపు అధికార పక్ష సభ్యులు అడుగడుగునా అవరోధాలు కల్పించారు. ఆయన ఉచ్చరించిన ప్రతి వాక్యానికి వక్ర భాష్యాలు చెప్పారు. హిందువుల మని, హిందువుల పరిరక్షకులమని చెప్పుకునే బీజేపీ వారు అసలు హిందువులే కారు అనీ, ఏ మతమూ విద్వేషాన్ని పెంచి పోషించమని చెప్పదు అనడం అధికార పక్ష సభ్యులకు బొత్తిగా గొంతు దిగలేదు. ఆయన మాటలను వక్రీకరించి హిందువులను హింసకు పాల్పడే వారిగా చిత్రీకరిస్తున్నారని నానాయాగీ చేశారు. రాహుల్ గాంధీ హిందువులను అవమానిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెడార్థాలు తీయడానికి వెనుకాడలేదు. రాహుల్ గాంధీ ప్రసంగానికి యథా విధిగా కేంద్ర హోం మంత్రి అడ్డు తగిలారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రతిపక్ష నాయకుడి ప్రసంగానికి అడ్డు తగిలి తప్పుడు సంప్రదాయం సృష్టించారు. హిందూ సమాజం అంతటినీ హింసాత్మకమైందనడం చాలా తీవ్రమైన విషయం అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడం తనకు రాజ్యాంగం నేర్పింది అని మోదీ అన్నప్పుడు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్ష నాయకుడిని చిన్న చూపు చూడడంతో పాటు ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని కూడా మోదీ కాపాడలేకపోయారు. ఇవన్నీ గమనిస్తే మోదీ వ్యవహారసరళి మారే సూచనే కనిపించడం లేదు. నిరంకుశత్వం మోదీ నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రజా తీర్పును అర్థం చేసుకునే తత్వం ఆయనలో ఏ కోశానా కనిపించడం లేదు.