గుజరాత్లో 2002లో జరిగిన మారణ హోమం సందర్భంగా గర్భవతి అయిన బిల్కిస్ బానో మీద అత్యాచారం చేసిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ‘‘జైలులో సత్ప్రవర్తన’’ మిషతో విడుదల చేయడం చెల్లదని సోమవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ దోషులందరూ 15 రోజుల్లోగా మళ్లీ జైలుకు వెళ్లాలని కూడా న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భూయాన్ తమ తీర్పులో పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగస్టు పదిహేనున గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బిల్కిస్ బానో మీద అత్యాచారం కేసులో దోషులుగా తేలి, శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసింది. వీరు అందరూ సంస్కారవంతులైన బ్రాహ్మణులని కూడా గుజరాత్ ప్రభుత్వం అప్పుడు వ్యాఖ్యానించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే కలిగే మేలు గురించి పదే పదే చెప్తుంటారు. చివరకు జరిగిన నిర్వాకం ఏమిటంటే డబుల్ ఇంజిన్ సర్కారు గర్భిణీ అయిన ఒక నిరాధార మహిళపై అత్యాచారం చేసిన వారిని విడుదల చేయడం. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అని సోమవారం వెలువడిన తీర్పు రాసిన న్యాయమూర్తి బీవీ నాగరత్న అరమరికలకు తావులేకుండా కుండబద్దలు కొట్టినట్టు తేల్చేశారు. అంతకు ముందు ఈ 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిరది. జైలులో వీరి ప్రవర్తన బాగుందన్న నెపంతో గుజరాత్ ప్రభుత్వం నియమించిన అయిదుగురు సభ్యుల కమిటీ సిఫార్సు చేయడం గుజరాత్ ప్రభుత్వం వీరిపై హడావుడిగా విడుదల చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ కేసుపై గుజరాత్ లో విచారణ జరిగితే నిష్పక్షపాతంగా ఉండదన్న అభిప్రాయంతో సుప్రీంకోర్టు విచారణ బాధ్యతను మహారాష్ట్ర హైకోర్టుకు అప్పగించింది. ఆ కోర్టు వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ గుజరాత్ ప్రభుత్వం అయిదుగురు సభ్యుల కమిటీ సిఫార్సు మేరకు విడుదల చేసేసింది. ఇది గుజరాత్ ప్రభుత్వం లేని అధికారాన్ని వినియోగించుకోవడమేనని సుప్రీంకోర్టు నిగ్గు తేల్చింది. ఈ విడుదలతో ఈ కేసులో గుజరాత్లో విచారణ నిష్పక్షపాతంగా జరగదన్న తమ అనుమానం నిజమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వం దోషులతో కుమ్మక్కైంది అని కూడా చెప్పింది. ‘‘నిందితులు కనక తమ తీర్పును పెడదారి పట్టిస్తే సమాజంలో శాంతి, సామరస్యం భ్రమగా మిగిలిపోతాయన్న తమ అనుమానం సైతం నిజమైందని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఈ 11 మంది దోషులు జైలు శిక్షవల్ల తమ స్వేచ్ఛకు భంగం కలిగిందని భావిస్తే ముందు వారు మళ్లీ జైలుకెళ్లి తదుపరి ప్రయత్నాలు చేసుకోవాలని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. 2022 మే 13న న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రంనాథ్తో కూడిన బెంచి ఈ దోషుల అభ్యర్థనను గుజరాత్ ప్రభుత్వం పరిశీలించాలని ఇచ్చిన తీర్పు కూడా చెల్లదని ఇద్దరు న్యాయమూర్తులు సోమవారం తమ తీర్పులో తెలియజేశారు. కోర్టును మోసగించి దోషులు విడుదలయ్యారని కూడా చెప్పారు. తమను విడుదల చేయాలన్న వీరి అభ్యర్థనను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అందరూ గుజరాత్ ప్రభుత్వానికి అనుకూలురనే, మరీ మాట్లాడితే అందులో ఎక్కువ మందిని బీజేపీ వారినే నియమించింది.
దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానోతో సహా అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ, స్వతంత్ర పత్రికా రచయిత రేవతి లౌల్ ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. బిల్కిస్ బానో అర్జీ సవ్యమైంది అనుకున్నప్పుడు మిగతావారి పిటిషన్లు సవ్యమైనవో కాదో తేల్చవలసిన అగత్యం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో దాఖలు చేసిన అర్జీ రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం విచారణకు స్వీకరించ దగిందా కాదా, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు అనుమతించదగినవా కాదా, దోషులను విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా విడుదల చేయాలని జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమైనవా కాదా అన్న నాలుగు అంశాలను నిశితింగా పరిశీలించిన తరవాత దోషులను విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. దోషులకు సంబంధించిన వాస్తవాలను తొక్కి పెట్టి, వాస్తవాలను వక్రీకరించి వీరిని విడుదల చేశారని సుప్రీంకోర్టు భావించింది. ఇది పచ్చి మోసం అనీ, గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై దోషులను విడుదల చేయాలని నిర్ణయించారని కూడా తెలియజేసింది. దోషుల్లో రాధే శ్యాం అనే వ్యక్తి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కానీ ఆ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకముందే గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. ఈ పదకొండు మంది 2022 ఆగస్టు 15న విడుదలైన తరవాత వారికి పూల మాలలువేసి, మిఠాయిలు తినిపించి స్వాగతం చెప్పారు. ఈ సత్కారాలు చేసిన వారిలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంటే దోషుల విడుదల గుజరాత్ ప్రభుత్వ ప్రమేయంతోనే జరిగినట్టు. అత్యాచారం జరిగినప్పుడు బిల్కిస్కు 21 ఏళ్లు. గర్భిణీ. అప్పటికే ఆమెకు మూడేళ్ల పాప ఉంది. ఆ పాపతో పాటు ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను మొత్తం 14 మంది మతోన్మాదం తలకెక్కిన వారు హతమార్చారు. ఇది చాలా కిరాతకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదల చేయాలన్న దోషుల అర్జీని పరిశీలించాల్సింది మహారాష్ట్ర ప్రభుత్వం అయితే గుజరాత్ ప్రభుత్వం అక్రమంగా వీరిని విడుదల చేయాలని సిఫార్సు చేసింది. ఇది లేని అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. 2002 నాటి గుజరాత్ మారణకాండలో కనీసం రెండువేల మంది బలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలే. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ మారణకాండను అనుమతించారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ఆయన మీద మోపిన కేసులేవీ న్యాయ పరీక్షకు నిలబడలేదు. అందువల్ల మోదీ నిర్దోషిగా మిగిలిపోయారు. కానీ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు పరోక్షంగానైనా మోదీని అభిశంసించడం లాంటిదే. ఎందుకంటే ఈ దుర్మార్గం జరిగింది డబులు ఇంజిన్ సర్కారు ఉన్న గుజరాత్ లోనే కదా! మారణకాండకు సంబంధించి న్యాయస్థానాల్లో అనేక కేసులు దాఖలైనా న్యాయం జరిగింది చాలా తక్కువ సందర్భాలలోనే. కనీసం బిల్కిస్ బానో కేసులోనైనా సుప్రీంకోర్టు దోషులను మళ్లీ జైలుకు వెళ్లాలని ఆదేశించడంవల్ల న్యాయం ఇంకా మిగిలే ఉందని నిరూపితమైంది.