ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికలు బీజేపీ దిగజారుడుకు పరాకాష్ఠగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్లో పదికి పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ కర్నాటకలో క్రాస్ ఓటింగ్కు సీటు కోల్పోయింది. ఏ మాత్రం మెజారిటీలేని కాంగ్రెస్ పాలిత హిమాచల్ప్రదేశ్లో బీజేపీ విజయం సాధించి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యేలే లేనిచోట ఎలా గెలిచిందనే అంశంపై తర్జనభర్జనలు పడాల్సిన అవసరం లేదు. మోదీ`అమిత్షా ద్వయం ‘తెలివైన కుట్ర’తో 9 మంది ఎమ్మెల్యేలను కొనేయడమంటే మాటలు కాదు. అతిపెద్ద క్రాస్ఓటింగ్ ఇది. ఏప్రిల్ తొలి వారానికి 56 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో 41 స్థానాలు ముందుగానే ఏకగ్రీవమైపోయాయి. కానీ ఉత్తరప్రదేశ్లో 10, కర్నాటకలో 4, హిమాచల్ప్రదేశ్లో ఒకేఒక్క స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈ పదిహేను స్థానాల్లోనూ తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడం ద్వారా రాజ్యసభ బలాన్ని పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్, ఎస్పీ వంటి ప్రత్యర్థుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయాలన్న మోదీషా ఆలోచన ‘అద్భుతం’గా పనిచేసింది. మోదీషా కుట్రను పసిగట్టడంలో ప్రత్యర్థిపార్టీలు విఫలమయ్యాయని ఒప్పుకొని తీరాల్సిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మోదీషా ప్రయత్నాలు ఆరంభించారు.
కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో పడిపోయిందని బీజేపీ వాదిస్తోంది. హిమాచల్లో ఎన్నిక అనివార్యంగా మారిన రాజ్యసభ సీటు ఒక్కటే అయినప్పటికీ, ఆ ఒక్కటే కాంగ్రెస్ను దెబ్బతీసింది. ఈ స్థానం కోసం కాంగ్రెస్లో ఎంతో అనుభవజ్ఞుడు, రాజనీతజ్ఞుడు అభిషేక్ మను సింఫ్వీు పోటీపడగా, బీజేపీ నుంచి హర్ష్ మహాజన్ బరిలో నిలిచారు. సహజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెజారిటీ ఉన్నందున సింఫ్వీు విజయం సునాయాసమని అంతా భావించారు. కానీ మోదీషా రాజకీయ కుట్ర అమలులో స్థానిక బీజేపీ నాయకత్వం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ కీలకపాత్ర పోషించారు. మైనారిటీలో పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు జైరామ్ తాజాగా చేసిన ప్రకటన లోక్సభ ఎన్నికలకు ముందే ఆ రాష్ట్రంలో అస్థిరత సృష్టించడానికి కాషాయపార్టీ రంగం సిద్ధం చేసినట్లు అర్థమైపోతున్నది. 68 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో రాజ్యసభ పోటీదారుల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెరో 34 ఓట్లు చొప్పున వచ్చాయి. టైబ్రేకర్ కావడంతో డ్రా తీయాల్సివచ్చింది. ఈ డ్రాలో మహాజన్ను విజయం వరించింది. 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్ఓటింగ్కు పాల్పడినట్లు స్పష్టమైంది. వారిలో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు కాగా, మిగిలిన ముగ్గురు స్వతంత్రులు. సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ మార్కు కన్నా ఒక స్థానం తక్కువే ఉంది. అంటే మైనారిటీలో పడినట్లే భావించాలి. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన 9 మంది ఓటు వేసినప్పటి నుంచి కనబడటం లేదు. వారిని బీజేపీ మంగళవారం సాయంత్రమే హర్యానాలో పంచకులలోని ఒక రిసార్ట్కు తరలించిందని మీడియా కథనాలు చెపుతున్నాయి. ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు మీడియా ఫుటేజ్ కూడా దొరికింది. పథకం ప్రకారం, మాజీ సీఎం, బీజేపీ నాయకుడు జైరామ్ ఠాకూర్ బుధవారం ఉదయాన్నే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను దర్శనం చేసుకొని, ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే ఓట్ల విభజనపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అంటే కాంగ్రెస్ శాసనసభలో తన మెజారిటీని తక్షణమే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మెజారిటీ లేనందున సుఖు ప్రభుత్వం రాజీనామా చేయాలని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారిలో జైరామ్ ఠాకూర్ ఒకరు. ఇంత జరిగినా సభను వదిలేది లేదంటూ వారు అక్కడే బైఠాయించి గోలగోల చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి వరంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి సుఖుకు, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వీరభద్రసింగ్ సతీమణి, హిమాచల్ కాంగ్రెస్ అధినేత్రి ప్రతిభాసింగ్కు మధ్య తలెత్తిన వివాదాలే ఈ కుట్రకు అసలు కారణమని తెలుస్తోంది. 2022 నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి తనకే దక్కుతుందని ప్రతిభాసింగ్ ఆశించారు. కాకపోతే రాహుల్గాంధీ ప్రమేయంతో ఆ పదవి కాస్త సుఖు వశమైంది. రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరభద్రసింగ్ అనుచరులే. పైగా తన ఎమ్మెల్యేలను చాలాసార్లు సుఖు ప్రభుత్వం అవమానించిందని, తట్టుకోలేకపోతున్నట్లు వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య హఠాత్తుగా మంత్రిపదవికి రాజీనామా చేసి అగ్నికి ఆజ్యం పోసి ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో కొనసాగలేనని, తదుపరి హిమాచల్లో కాంగ్రెస్కు ఎవరు నాయకత్వం వహించాలో అధిష్టానం నిర్ణయించుకోవాలంటూ ఆయన ఏకంగా మీడియాకెక్కారు.
హిమాచల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న ఈ తరుణంలోనే బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినా, అది ఫలించే పరిస్థితులు కన్పించడం లేదు. ఈ సంక్షోభం మోదీషా ఎత్తుగడల్లో భాగమేనని అందరికీ ఎరుకే. కాంగ్రెస్లో నష్టనివారణ చర్యల కోసం కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్హుడాలు హుటాహుటిన సిమ్లా చేరినప్పటికీ, ఇంకొన్ని గంటలైనా సుఖు ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప విషయమే. ఉత్తరప్రదేశ్లోనూ రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ దెబ్బకు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు దిమ్మతిరిగింది. 10 స్థానాలకు గాను బీజేపీ 8 గెల్చుకోగా, ఎస్పీకి రెండు మాత్రమే దక్కాయి. వాస్తవానికి లెక్క ప్రకారం ఎస్పీ నుంచి ముగ్గురు గెలవాల్సి ఉంది. క్రాస్ ఓటింగ్పై పక్కా విశ్వాసంతో బీజేపీ ఆఖరి నిమిషంలో ఎనిమిదో నామినేషన్ దాఖలు చేయించింది. ఎస్పీ నుంచి జయాబచ్చన్, రామ్జీలాల్ సుమన్ గెలిచినా, అలోక్ రంజన్ అనూహ్యంగా బీజేపీ ఎనిమిదో సభ్యుడు, పారిశ్రామికవేత్త సంజయ్సేథ్ చేతిలో ఓడిపోయారు. పార్టీకి దమ్కీ ఇచ్చిన క్రాస్ఓటింగ్కు పాల్పడిన వారిపై చర్యలకు అఖిలేశ్ ఉపక్రమించినా, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఎస్పీ చీఫ్విప్ మనోజ్కుమార్ పాండే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే క్రాస్ ఓటింగ్కు బీజేపీ ఎత్తుగడ మొదలైందని అర్థమైపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అదనంగా ఒక ఎంపీని సాధించుకోవడంలో ఎస్పీని దెబ్బతీయడానికి ఏ స్థాయిలో బరితెగించారో స్పష్టమైంది. కర్నాటకలో మాత్రం కాంగ్రెస్ ముందు జాగ్రత్తలు తీసుకొని, పకడ్బందీగా వ్యవహరించి ముగ్గురు సభ్యులను గెలిపించుకోవడమే కాకుండా బీజేపీకే క్రాస్ ఓటింగ్ చేదును తినిపించింది. బీజేపీ నుంచి ఒకరు గెలిచారు. మొత్తంమీద హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ దిగజారుడు చర్యలు అసహేతుకం, అసమంజసం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను వినాశనం చేసే మోదీ నియంతృత్వ పోకడకు నిదర్శనం.