మంగళవారం వెలువడిన హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా ఐక్యసంఘటన పార్టీలు స్థిరమైన పోరాటం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవడంలో చూపిన అలసత్వానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలలో పట్టువిడుపులు వదిలి మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనందుకు చెల్లించుకున్న భారీ మూల్యం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 240కి పడిపోయిన తర్వాత కాషాయ పార్టీని ముఖాముఖి ఢీకొనే అవకాశం కాంగ్రెస్ పార్టీకి హర్యానా ఎన్నికల ద్వారా లభించింది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వచ్చాయని అత్యధికులు భావించారు. ప్రతిపక్ష నేత హోదా సాధించిన రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్కు మాత్రమే కమలదళాన్ని ఎదుర్కొనే సామర్థ్యం వుందన్న అంచనాలను ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. ముఖాముఖి ఎదుర్కొనే రాష్ట్రాలలో బీజేపీని ఎదుర్కొనే శక్తిని, వ్యూహరచనను కాంగ్రెస్ పార్టీ సమకూర్చుకోలేదని హర్యానా ఫలితాలు రుజువుచేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే మిత్రపక్షాలు అవసరమన్న సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గ్రహించాలి. ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే అంశంలో కాంగ్రెస్ పార్టీనే కాకుండా అమ్ ఆద్మీపార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇతర భావసారూప్యత కలిగిన పార్టీలు కూడా ఆచితూచి వ్యవహారించాల్సిన అవశ్యకతను ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ముందస్తు విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా వెళుతున్నట్లు కనిపించినా తర్వాత బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణి ఫలితంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా ఐక్యసంఘటన ఉమ్మడిగా అభ్యర్థులను నిలపలేకపోయింది. కాంగ్రెస్ అతివిశ్వాసం, మంకుపట్టుతో కమలదళాన్ని దీటుగా ఎదుర్కొనే అవకాశాన్ని ఇండియా ఐక్యసంఘటన కోల్పోయింది. ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పార్టీలు ఐక్యంగా పోటీచేసి కాషాయదళాన్ని ఓడిరచాలన్న లక్ష్యంగా చర్చలు ప్రారంభించాయి. ఇండియా భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించిన తర్వాతే పొత్తులపై కొంతవరకు చర్చలు ముందుకు సాగాయి. జాతీయ స్థాయి ప్రయోగాన్ని రాష్ట్రాలకు విస్తరించాలన్న రాహుల్ ఆశ కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తీరుతో అడియాసే అయింది. ఒంటెత్తుపోకడ, ఏకపక్ష ధోరణి కారణంగా సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించలేదు. కేవలం సీపీఎంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అవగాహన కుదిరింది. ఆ పార్టీకి ఒక్క సీటు కేటాయించింది. హస్తంపార్టీ మంకుపట్టు కారణంగా ఆప్, సీపీఐతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హర్యానా కాంగ్రెస్ నాయకులు ఆప్ విషయంలో సీట్లను వదులుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ విచిత్ర ధోరణి వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో చర్చలు విఫలమయ్యాయి. సీపీఐకి ఒక స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అయితే సీపీఐ సూచించిన ఏ సీటును ఆ పార్టీకి కేటాయించేందుకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో రెండు పార్టీల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. ఎన్నికల్లో ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్య పార్టీలు ఏటికవే పోటీ చేయాల్సి వచ్చింది. అహంకారం, మితిమీరిన విశ్వాసమే కాంగ్రెస్ ఓటమికి కారణమైందన్న ఇండియా ఐక్య సంఘటన పార్టీల అభిప్రాయంలో ఇసుమంత కూడా అనుమానంలేదు. ‘మేము గెలుస్తున్నామని భావిస్తే... ఏ ప్రాంతీయ పార్టీని చేర్చుకోము. కానీ మా పరిస్థితి బాగా లేని రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు సహకరించాలన్న ధోరణిని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ విడనాడాలి. అహంకారం, ప్రాంతీయ, చిన్న పార్టీలను చిన్నచూపు చూడటం ఈ విపత్తుకు మూలం అని కాంగ్రెస్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. దేశ రాజధాని దిల్లీలో మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ కటువైన వ్యాఖ్యలతో చేసిన ప్రకటనలో కొంత వాస్తవమున్నప్పటికీ తొందరపాటుతో కూడినదిగా చెప్పవచ్చు. హర్యానాలో ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పార్టీలు అతి విశ్వాసంతో వేరువేరుగా పోటీచేసి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇందుకు ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అయినా మిగిలిన పార్టీలూ బాధ్యులేనని చెప్పకుండా ఉండలేం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని తీవ్రంగా పరిగణించి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్లోనైనా ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పార్టీలు జాగ్రత్తపడాలి. పరస్పర అవగాహన, విశ్వాసంతో కలిసి పనిచేయాలి. సీట్ల సర్దుబాట్ల విషయంలో పరస్పర అనుకూల పద్ధతులలో సర్దుకుపోవాలి. పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించి సీట్ల సర్దుబాటు చేసుకోవాలి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన స్వాగతించదగ్గది. మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్పవార్) భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ) సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమకు అభ్యంతరంలేదనీ, వారికి మద్దతిస్తామని చెప్పడం ద్వారా ఠాక్రే రాజకీయ పరిపక్వతను కనబర్చారు. మహారాష్ట్ర పరిరక్షణే తమ లక్ష్యమనీ, ఇందుకు కూటమి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని చెప్పారు. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 81 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నవంబరు
డిసెంబరులో జరగాల్సివుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి పది నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగాల్సివుంది. లోక్సభ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని గణనీయమైన ఫలితాలు సాధించాయి. ఈ ఉప ఎన్నికలో కూడా అలాగే పొత్తుపెట్టుకోవాలని భావించాయి. ఈ పార్టీల్లోని అతివిశ్వాసం కారణంగా పొత్తు కుదిరే అవకాశాలు సన్నగిల్లినట్టుగా సమాజ్వాదీ పార్టీ నేతల ప్రకటనలో సూచిస్తున్నాయి. ఏదేమైప్పటికీ, కాషాయ పార్టీ జోరుకు కళ్లెం వేసేందుకు విపక్షాలన్నింటినీ ఏకం చేసి ఎన్డీయే వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడ విడనాడి అఖిలభారతస్థాయిలో అన్ని రాష్ట్రాలలో ‘ఇండియా’ ఐక్యసంఘటన పార్టీలతో మరింత అనుకూలమైన పద్ధతులలో సీట్ల సర్దుబాటు విషయంలో వ్యవహరిస్తుందని ఆశిద్దాం.