ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని అడుగుతున్నాయి. నిజానికి ఒడిశాలో 20 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నడూ ఈ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత మాత్రమే బీజేడీ తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ప్రస్తావన తీసుకొస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో మొన్నటి దాకా అధికారంలో ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని గట్టిగా కోరిన సందర్భమే లేదు. కేవలం ప్రధానమంత్రికి వినతిపత్రాలు సమర్పించే తంతుతోనే సరిపెట్టుకున్నది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల జనాన్ని ఆకర్షించడానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రత్యేక ప్రతిపత్తి రాగాలాపన మొదలెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరో విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి అని యాగీ చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆ అంశానికి సంబంధించి కాడి కింద పడేసినట్టే ఉంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కనక ఆర్థికంగా ఎక్కువ నిధులు సమకూర్చే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలునని చంద్రబాబు బాహాటంగానే చెప్తున్నారు. ఈ విషయంలో నితీశ్కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ ( జె.డి.యు) పైకి కనిపించడానికైనా చిత్తశుద్ధి ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జరిగిన జె.డి.(యు) సమావేశంలో బీహార్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిందేనని తీర్మానం ఆమోదించారు. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం ఈ మాట గట్టిగా అడగడంలేదు. చంద్రబాబు, నితీశ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల తరవాత మెజారిటీ తక్కువైన మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్.డి.ఎ. కూటమికి మద్దతిచ్చారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కోరికల చిట్టా చాంతాడంత ఉన్న మాట వాస్తవమే కానీ ఆ కోర్కెలు తీర్చకపోతే మోదీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని మాత్రం చెప్పడంలేదు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ కేంద్రంలో చక్రం తిప్పడానికి వీరిద్దరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ అపారమైన రాజకీయ అనుభవం ఉంది కనక అవసరార్థం ఎప్పుడైనా మాట మార్చగలరు. ఒడిశా అంశం ఇప్పుడే తెర మీదకు వచ్చింది. మొన్నటి ఎన్నికలలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ మళ్లీ గెలిచి ఉంటే ఒడిశాకు ప్రత్యేక ప్రతిపత్తి అనే ప్రస్తావనే వచ్చేది కాదేమో. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల నిరంతర పోరాటానికి అది ఒక బలమైన అంశం కావాలి కనక ఈ కొత్త రాగం ఎత్తుకున్నట్టున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయింది. మొదటి అయిదేళ్లూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరవాత అయిదేళ్లు జగన్ ఆ పదవిలో ఉన్నారు. చంద్రబాబు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించనందువల్ల తెలుగుదేశం పార్టీ 2018 లో ఎన్.డి.ఎ. కూటమితో తెగ తెంపులు చేసుకుంది. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది కనక ప్రత్యేక హోదా మీద అప్పుడప్పుడూ గొంతెత్తుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ తెలుగు దేశం ఆంధ్ర ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబే ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా గురించి ఏ హామీ లేకుండానే చంద్రబాబు మైనారిటీలో పడిపోయిన మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించారు. బీహార్ను విడగొట్టి జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన దగ్గరనుంచి బీహార్ తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతూనే ఉంది. ఇందులోనూ తేడాలున్నాయి. కొన్నాళ్లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం, ఆ తరవాత ఆ బీజేపీతోనే కలిసి బీహార్లో అధికారం పంచుకోవడం నితీశ్ కుమార్కు కొత్తకాదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే నితీశ్ మళ్లీ బీజేపీతో కత్తు కలిపారు. అప్పుడు ఆయన బీహార్కు ప్రత్యేకహోదా కోర్కెను బలహీనంగానైనా వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారుకు మద్దతు ఇచ్చినప్పుడూ ఆ షరతు విధించలేదు. కానీ జె.డి (యు) ఓ తీర్మానం అయితే ఆమోదించింది. మొన్నటి శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో తెలుగు దేశం ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన తీసుకొచ్చింది. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని కూడా తెలుగు దేశం వాగ్ధానం చేసింది. ట్రూ అప్ చార్జీల పేర కొనసాగుతున్న అదనపు వడ్డింపును తొలగిస్తానని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ చేయాలంటే రూ. 28, 000 కోట్లకు మించి అవసరం అవుతుందంటున్నారు. జగన్ ఖజానా ఖాళీచేసి పోయాడని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని విద్యుత్ శాఖపై విడుదల చేసిన శ్వేత పత్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అది నిజమేననుకున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులైతే కావాలిగా. ప్రత్యేక హోదా సాధించడానికి కాళ్లీడిస్తే ప్రధానమైన ఆరు వాగ్దానాలను ఎలా అమలు చేస్తారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి తెలుగు దేశం మద్దతు అవసరం కనక ఒత్తిడి తీసుకొచ్చే పని అయినా చేయకపోతే సంపద సృష్టిస్తాం అన్న కల ఎలా నెరవేరుతుంది? ప్రత్యేక హోదా సాధించగలిగితే అంగన్వాడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటికి అయ్యే ఖర్చులో కేంద్రం 90 శాతం భరించాలి. ఇప్పుడు 60 శాతమే భరిస్తోంది. పైగా బోలెడు రాయితీలు దక్కుతాయి కనక పరిశ్రమలు నెలకొల్పే వారు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతారు. ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని దిల్లీకి తీసుకెళ్లడం లాంటి ఆలోచనే చంద్రబాబుకు ఉన్నట్టు లేదు. ఇది చిత్తశుద్ధి లోపాన్నే సూచిస్తోంది. మునుపటి ప్రభుత్వం చేసిన తప్పులెన్నడానికి ఎన్ని శ్వేత పత్రాలు విడుదలు చేసినా ఫలితం ఉండదు. హామీలను నెరవేర్చడానికి నిధులు, రాయితీలు సాధించాలంటే ప్రత్యేక హోదా కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. చంద్రబాబుకు ఆ ఆసక్తి ఉన్నట్టు లేదు. బీహార్ కు ప్రత్యేక హోదా ప్రసక్తే లేదని సోమవారం పార్లమెంటులోనే మోదీ ప్రభుత్వం ఖండితంగా చెప్పింది. ఈ మాట చంద్రబాబుకు వినిపించలేదా!