క్రీడల్లో రాణించాలంటే కృషి, పట్టుదల, గెలుపుపై ఆరాటం, ఆట పట్ల నిబద్ధత, నిజాయితీతోపాటు ఆటలో అత్యంత నైపుణ్యం చాలా అవసరం. ఇవన్నీ కలబోస్తే మన ముందు కన్పించేది సచిన్ టెండూల్కర్ అన్నమాట! జెంటిల్మెన్ క్రీడగా ఉండే క్రికెట్ కొందరికే పరిమితమయ్యేది. అది భారత్లోనైనా, ఇంకెక్కడైనా! కానీ సచిన్ టెండూల్కర్ వచ్చిన తర్వాత ఇండియాలో క్రికెట్ స్వరూపస్వభావాలే మారిపోయాయి. ఈ ఆట గల్లీగల్లీకి వ్యాపించింది. సచిన్ను స్ఫూర్తిగా తీసుకొని వందలు వేలాది మంది క్రికెటర్లు అవతరించారు. సచిన్ ఆటను చూస్తూ పెరిగిన మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ, రోహిత్శర్మ వంటివారు ఏకంగా కెప్టెన్లుగా ఆవిర్భవించారు. సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలుగొట్టడమే ప్రతి క్రికెటర్ లక్ష్యంగా మారిందంటే అది అతిశయోక్తికాదు. ఏటా 2000 కోట్ల రూపాయలను కేవలం ప్రకటనల ద్వారానే సచిన్ ఆర్జించేవాడంటే వ్యాపారానికి సైతం క్రికెట్ ఒక వస్తువులా ఎలా మారిపోయిందో అర్థమవుతుంది. ఎప్పుడైతే క్రికెట్ ఒక వ్యాపారంలా మారి, ఐపీఎల్ వంటి వేదికలు ఆటగాళ్లకు కోట్లు వేలం పలుకుతున్నాయో ఆనాడే రాజకీయాలు సైతం క్రికెట్లోకి సంపూర్ణంగా చొరబడ్డాయి. క్రీడల్లో రాజకీయ రొచ్చు పెచ్చుమీరింది. గత ఏడాది క్రీడలను కుదిపేసిన రెజ్లింగ్ అసోసియేషన్ వివాదం నేటికీ మన కళ్లముందు కన్పిస్తూనే ఉంది. అది ఉత్తరాది సమస్య అనుకున్నాం. అంతలోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో గాదె హనుమ విహారి వివాదంతో ఏకంగా మన ఇంటినే ఈ వికృతక్రీడ ఆవహించిందని అర్థమైపోయింది. రాజకీయాల్లోకి క్రీడాకారులు ప్రవేశిస్తే నష్టం జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ క్రీడల్లోకి రాజకీయాలు చొరబడితే, కచ్చితంగా అది క్రీడారంగానికి నష్టదాయకం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయక్రీడకు జాతీయ క్రికెటర్ హనుమ విహారి బలైన ఉదంతం గురించి వింటే క్రీడాభిమానుల మనస్సు చివుక్కుమంటుంది. కీడల్లో రాజకీయ భూతాల వికృతచేష్ఠలు కొత్తేమీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏదో రూపంలో జడలువిప్పుతూనే ఉంది. ఫాసిజం, నాజిజం విధానాలతో ప్రపంచ ప్రసిద్ధిపొందిన నియంతలు ముస్సోలినీ, హిట్లర్ మొదటి, రెండవ ప్రపంచ యుద్ధకాలాల్లో ఒలింపిక్స్ క్రీడలను తమ రాజకీయాలకు వేదికలుగా వాడుకున్న విషయం చారిత్రక సత్యం. హిట్లర్ తన జాతి పరువు కోసం బెర్లిన్ ఒలింపిక్స్పై కోట్లాది రూపాయలు వెచ్చించాడు. ఎవరు అవునన్నా కాదన్నా, ఆ తర్వాత ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్లు ఆరేడు ఒలింపిక్స్ల్లో తమ సత్తా చూపించుకొని ఏకంగా యుద్ధక్షేత్రాలను తలపింపజేశాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ను అమెరికా బహిష్కరించగా, 1984 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్ను సోవియట్ యూనియన్ బహిష్కరించింది. ఇక వర్ణవివక్ష అనేది క్రీడల్లో అంతర్భాగంగా కొనసాగుతూనే ఉంది. టెర్రరిజం రక్కసికోరలకు రక్తపాతం చవిచూసిన స్టేడియాలనూ కళ్లారా వీక్షించాం. ఈ విధంగా ప్రపంచ క్రీడకు పట్టిన జాఢ్యాలు భారత్నూ పీడిరచాయి. భారత ఒలింపిక్ సంఘం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బాక్సింగ్, రెజ్లింగ్ సంఘాలతోపాటు దాదాపు అన్ని సంఘాలకూ అధ్యక్ష, కార్యదర్శులు, ఆఫీసు బేరర్లలో 70 శాతం మంది రాజకీయ నాయకులే ఉంటూ వచ్చారు. ఎన్కేపీ సాల్వే, అరుణ్జైట్లీ, రణ్బీర్సింగ్ మహేంద్ర, జ్యోతిరాదిత్య సింధియా, మాధవ్రావు సింధియా, విలాస్రావ్ దేశ్ముఖ్, శరద్పవార్, రాజీవ్శుక్లా, అనురాగ్ ఠాకూర్, నరేంద్రమోదీ, అమిత్షా..ఇలా రాజకీయ నేతలంతా బీసీసీఐకి అధ్యక్షులుగానో, ఇంకోరకంగానో పనిచేసినవారే. నేతల కబ్జాలో క్రీడా సంఘాలు ఉండిఉండకపోతే, అమెరికా, రష్యా, చైనా, జర్మనీల కన్నా భారత్ ప్రపంచ క్రీడాయవనికలో ఎన్నో గొప్ప విజయాలు సాధించేది. త్రివర్ణపతాక రెపరెపలతో ఊరేగేది. కేవలం రాజకీయ చొరబాట్లు కారణంగానే క్రీడల్లో భారత్ ఆటతీరు అంతంత మాత్రమైపోయిందన్నది అక్షరసత్యం. ఇప్పటివరకు భారత్ సాధించిన మొత్తం పతకాలు అతిపేద దేశమైన కెన్యా సాధించిన స్వర్ణపతకాలకన్నా తక్కువే అంటే నమ్ముతారా? నిజంగానే ఇది నిజం. ఇటీవల కాలంలో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన 8 క్రీడల్లో 4 క్రీడాసంఘాలకు బీజేపీ నేతలే అధినేతలు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వివాదాస్పదుడైన సంజయ్సింగ్ కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అతన్ని పదవీచ్యుతుడిని చేయడానికి ఎంతోమంది కుస్తీవీరులు తమ పతకాలనే త్యాగం చేయాల్సిన దౌర్భాగ్యపరిస్థితి దాపురించింది. భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్సింగ్ స్వతహాగా రాజకీయ నాయకుడు కాకపోయినా, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదాన్ని సృష్టించిన బీజేపీ మీడియా వ్యూహకర్త. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు కళ్యాణ్చౌబే మాజీ ఆటగాడే. కాకపోతే బీజేపీ సభ్యుడు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, అథ్లెటిక్స్ లెజెండ్ పీటీ ఉష బీజేపీ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యురాలు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో అత్యంత శక్తిమంతమైన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న జయ్షా స్వయంగా హోంమంత్రి అమిత్షా పుత్రరత్నమే. మనుషులకు మూడో కిడ్నీ ఉండకపోవచ్చు. కానీ రాజకీయనాయకులకు క్రీడాసంఘాల బాధ్యతలనేవి అదనపు కిడ్నీతో సమానం. 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత బృందం కవాతును పక్కనబెట్టి క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ (బీజేపీ)ను టీవీ ప్రత్యక్ష ప్రసారాలు పదేపదే చూపించిన దృశ్యాలు ఇందుకొక మచ్చుతునక. ఇక ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి విషయానికొస్తే, పాలక వైసీపీ నేతల కబ్జాలో ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అతన్ని నిర్ధాక్షిణ్యంగా రంజీజట్టు కెప్టెన్సీ నుంచి తొలగించి, మన క్రీడల పరిస్థితిని రోడ్డుకీడ్చింది. జట్టులో 17వ ఆటగాడైన వైసీపీ కార్పొరేటర్ కుమారుడ్ని మందలించాడన్న ఏకైక కారణంతో విహారిపై వేటువేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏసీఏ ఇప్పుడు వైసీపీ కుటుంబ కంపెనీగా మారిపోయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్రెడ్డి ఏసీఏ ఉపాధ్యక్షుడిగా, అల్లుడి అన్న, దిల్లీ మద్యం కేసులో నిందితుడు శరత్చంద్రారెడ్డి అధ్యక్షుడిగా, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు గోపీనాథ్రెడ్డి కార్యదర్శిగా, అతని ఆడిటరే ఏసీఏ కోశాధికారిగా ఉన్నారు. ఏసీఏ పూర్తిగా వైసీపీ కబంధహస్తాల్లో ఉందనడానికి ఇంతకన్నా రుజువేముంది? రంజీజట్టులో 15 మంది సభ్యులే ఉండాలి. కానీ మన ఆంధ్రా రంజీ జట్టులో 17 మంది సభ్యులుంటారు. వైసీపీ నేతల కుమారుల కోసమే సెక్రటరీ కోటా పేరుతో అదనంగా రెండు స్థానాలను సృష్టించుకున్న ఘనత ప్రస్తుత ఏసీఏది. జట్టు కెప్టెన్గా 17వ నెంబరు ఆటగాడు పృథ్వీరాజ్ను తిట్టాడన్న కారణంతోనే విహారీకి ఉద్వాసన పలికారు. ఈ పృథ్వీరాజ్ తండ్రి, తిరుపతి కార్పొరేటర్ నర్సింహాచారికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వంటి నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. భారత జాతీయ జట్టు తరపున 16 టెస్టు మ్యాచ్లాడి, రాణించిన హనుమ విహారి సారథ్యంలో ఆంధ్రాజట్టు ఇప్పుడిప్పుడే విజయాలతో వెలుగులోకి వస్తోంది. అవినీతి, రాజకీయ జోక్యాలతో భ్రష్టుపట్టిపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) బాటలోనే ఏసీఏ కూడా పయనిస్తోందని తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ అవమానభారంతో ‘ఆంధ్ర’ను వీడిన విహారికి ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు తమ రంజీ జట్లలో చోటు కల్పిస్తామంటూ స్వాగతం పలుకుతున్నాయి. వైసీపీ రాజకీయాలకు ఈమధ్యనే స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు బలైన విషయం సర్వవిదితం. వైసీపీ పాలనలో ఆంధ్రను వీడుతున్న పరిశ్రమల తరహాలోనే క్రీడాకారులూ రాష్ట్రాన్ని వదిలిపోవాలని భావించడం బాధాకరం. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ప్రభుత్వం నిర్వహించిన క్రీడోత్సవం రాష్ట్రంలో క్రీడల పట్ల ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలను ఎత్తిచూపింది. అయినా బుద్ధిరాని వైసీపీ నేతలు విహారి లాంటి ఆటగాళ్ల భవిష్యత్తో ఆటలాడుకోవడం గర్హనీయం. క్రీడాసంఘాలకు రాజకీయ చీడపడితే పరిణామాలు ఎలా ఉంటాయో విహారీ ఉదంతమే ఓ ఉదాహరణ.