మూడు నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న మణిపూర్ మారణ కాండ ఒక కొలిక్కిరావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశమైనా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. ప్రస్తుతం పార్లమెంటులో, సుప్రీంకోర్టులో ఈ సమస్య ప్రస్తావనకు వస్తోంది. అడపాదడపా మణిపూర్ కూడా రాజకీయ పక్షాలకు కార్య క్షేత్రం అవుతోంది. ఎక్కడా వెలుగురేఖ కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమయ్యారు కనక ఆయనను తొలగించాలన్న డిమాండు ఎంత విస్తృతంగా ఉన్నా మోదీ సర్కారులో మాత్రం చలనంలేదు. నిజానికి మోదీ ప్రభుత్వంలో అలా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మణిపూర్లో అల్లకల్లోలానికి కారణమైన విధానాలను బీరేన్ సింగ్ తనంత తానుగా అమలు చేయలేదు. మోదీ, అమిత్ షా లాంటి నాయకులకు తెలియకుండా ఆయన స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారనుకోలేం. జాతుల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపిందే బీజేపీ. ఈ చిచ్చు ఒక్కసారి రేగిన తరవాత అనుకున్నప్పుడు చల్లార్చడం కుదరదు. ఆ రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు లోతుగా నాటుకుపోయాయి. ఒక జాతి వారు మరో జాతి వారిని విశ్వసించే అవకాశమే లేకుండా పోయింది. పార్లమెంటు సమావేశాలలోనైనా చర్చ జరిగి ఓ పరిష్కారం కుదిరే వీలుంటుందేమో అనుకుంటే అదీ నిరాశగానే మిగిలింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో మణిపూర్ అంశంపై ముందు ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు ఎంత గట్టిగా పట్టుబట్టినా ఫలితంలేదు. ఆయన ఇంతవరకు పార్లమెంటు సమావేశాలకు హాజరైన దాఖలానే లేదు. మణిపూర్ లోని వాస్తవ పరిస్థితిని పరిశీలించడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆ తరవాత వామపక్ష పార్టీల నాయకులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఓ పని అయిపోతుందన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మూడు రోజులు మణిపూర్లో గడిపినా జనాన్ని సంప్రదించడానికి ఆయనకు తీరికే చిక్కినట్టు లేదు. అధికారులతో మంతనాలకే ఆయన పర్యటన పరిమితం అయింది. శుక్ర, శనివారాల్లో ప్రతిపక్ష ఫ్రంట్ ‘‘ఇండియా’’కు చెందిన 21 మంది నాయకులు మణిపూర్లో పర్యటించి అక్కడి హృదయ విదారక దృశ్యాలను గమనించారు. అఖిలభారత మహిళా సమాఖ్య నాయకురాలు అనీ రాజా, మరికొంతమంది మణిపూర్లో పర్యటిస్తే ఆ బృందం మీద కేసులు మోపారు. మోదీ ప్రభుత్వం ఇంతటి మొండివైఖరి అనుసరిస్తున్న స్థితిలో పరిస్థితి అమాంతం మెరుగుపడుతుందనుకోవడం భ్రమ. ఏ ప్రతినిధి వర్గం వెళ్లివచ్చినా అక్కడిపరిస్థితిని నివేదించడంలో సామ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్ని ఘోరాలు జరిగినా శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నారు. అక్కడితో ఆగకుండా అల్లర్లకు పాల్పడుతున్న పక్షాలకు మద్దతు ఇస్తున్నారు. అలాంటప్పుడు బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అంతు పట్టడం లేదు. పోలీసులు చేష్టలుడిగినట్టు ఉన్నా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కనీసం విచారణకైనా ఆదేశించలేదు. ఇక్కడే 2002 నాటి గుజరాత్ మారణకాండకు, ప్రస్తుత మణిపూర్ పరిస్థితికి పోలిక కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారే మారణ కాండకు పాల్పడే వారికి అండదండలు అందించడంలో పోలిక అచ్చు గుద్దినట్టు ఉంది. అక్కడి ప్రధాన జాతులైన మెయితీలు, కుకీలు, నాగాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ వర్గాల వారు భవిష్యత్తులో కూడా కలిసి ఉండలేని విషమ స్థితికి చేరుకుంటున్నట్టుంది.
ప్రధానిని పార్లమెంటులో ప్రకటన చేసేట్టు చేయడానికి విఫలమైన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించవలసి వచ్చింది. రాజ్యసభలో సోమవారం స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని ఆ సభ అధ్యక్షుడు జగదీప్ ధన్ కర్ చేసిన ప్రయత్నం కొనసాగలేదు. పార్లమెంటు వేదికను మణిపూర్ వ్యవహారాన్ని చర్చించ డానికి వినియోగించుకోవాలని ప్రతిపక్షాలు చేసిన ఏ ప్రయత్నమూ నెరవేర లేదు. అందుకే ప్రతిపక్ష ప్రతినిధివర్గం మణిపూర్లో పరిస్థితిని తెలుసుకుని వచ్చింది. అక్కడ వారు గమనించిన అంశాలను క్రోడీకరించి మణిపూర్ గవర్నర్కు ఓ విజ్ఞాపనపత్రం అందజేసింది. మణిపూర్ ప్రభుత్వమే దురాగతంలో భాగస్వామి అయినప్పుడు గవర్నర్ చేయగలిగింది చాలా తక్కువ. వెళ్లింది అఖిలపక్షం కనక రాష్ట్రపతిని కలిసి విజ్ఞాపనపత్రం అందజేస్తే మరింత బాగుండేది. ‘‘మణిపూర్ వెళ్లివచ్చారుగా రండి ‘‘పార్లమెంటులో ఆ విశేషాలు తెలియజేయండి’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దెప్పి పొడుస్తున్నారు. చర్చకు అవకాశం ఎందుకు రావడంలేదో మాత్రం ఆమె చెప్పరుగాక చెప్పరు. ప్రతిపక్షాలే పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. లోకసభ స్పీకర్ కూడా చర్చ ప్రస్తావన తెస్తారు తప్ప ప్రకటన చేయమని ప్రధానిని కోరే సాహసం మాత్రం చేయలేరు. తొమ్మిది రోజులుగా పార్లమెంటు రెండు నినాదాలతో హోరెత్తుతోంది. మణిపూర్, మణిపూర్ లేదా ప్రధానమంత్రి సభకు రావాలని ప్రతిపక్షాలు నినదిస్తుంటే అధికార పక్షం మోదీ మోదీ అన్న నినాదాలతో కాలక్షేపం చేస్తోంది. చినుకుకు చినుకుకు మధ్య తడవకుండా నడిచినట్టు మధ్యలో ఏ కాస్త అవకాశం దొరికినా అధికారపక్షం బిల్లులు ప్రతిపాదిస్తోంది లేదా గుట్టుచప్పుడు కాకుండా ఆమోదించేసి ఓ పని అయిపోయిందనిపిస్తోంది. అభ్యంతరకరమైన వీడియో వెలికి వచ్చిన మర్నాడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చారు. ఈ వారంలోగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కనిపించలేదు. అయినా సుప్రీంకోర్టు తీసుకున్న ప్రత్యేక చర్యా లేదు. కానీ సోమవారం మరో రూపంలో మణిపూర్ సమస్య ప్రస్తావనకు వచ్చింది. అత్యాచారానికి గురైన ఇద్దరు కుకీ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిని కూడా గత మే నాలుగున నగ్నంగా ఊరేగించారు. విచారణ సందర్భంగా ఒక న్యాయవాది రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘాతుకాలను లేవనెత్తినప్పుడు అన్నిచోట్ల మహిళల మీద అత్యాచారం జరుగుతోందన్నది సమాధానం కాదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. నిర్భయ కేసు ఒక మహిళకు సంబంధించింది కానీ మణిపూర్ భిన్న జాతులకు, సంబంధించింది అని చంద్రచూడ్ గుర్తు చేశారు. మణిపూర్లో మహిళల మీద అత్యాచారాలను విచారించడానికి మాజీ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆలోచించడం ఆహ్వనించదగింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించినంత మాత్రాన ఫలితం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ముందు ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు కోరడంలో తప్పు లేదు కానీ పార్లమెంటులో చర్చే జరగకపోతే ఫలితం ఏమిటి అని కూడా ప్రతిపక్షం ఆలోచించాలి. మణిపూర్ బాధలు పార్లమెంటు ద్వారా దేశ వాసుల దృష్టికి రావాల్సిందే. చర్చలో పాల్గొనడమే మెరుగైన మార్గం కావచ్చు. అలాగే మణిపూర్ గవర్నరుకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతికి కూడా ఇవ్వాలి.