లదాఖ్ ప్రాంతంలో భారత-చైనా దేశాల మధ్య నాలుగేళ్ల నుంచి ఘనీభవించిన సంబంధాలలో కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడడం ఆహ్వానించదగిందే. రష్యాలోని కజాన్లో మంగళవారం ప్రారంభమైన ‘‘బ్రిక్స్’’ దేశాల అధినేతల సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న సమయంలో చైనాతో సంబంధాలు మెరుగుపడడం శుభ సూచన. చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వస్తోందని గత నాలుగేళ్ల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంటే అదేమీ లేదని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఇటీవలి కాలం దాకా బుకాయించారు. ‘‘అమ్మో చైనా మనకన్నా పెద్ద దేశం, భారీ ఆర్థిక వ్యవస్థ’’ అన్న జై శంకర్ చైనా చొచ్చుకువస్తే చేసేదేమీ లేదన్న రీతిలో మాట్లాడారు. ఇప్పుడేమో వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాలు గస్తీ తిరగడానికి అనువుగా ఒప్పందం కుదిరిందంటున్నారు. ఈ ఒప్పందం దెల్పాంగ్ మైదాన ప్రాంతానికి, దెంచోక్ కు కూడా వర్తిస్తుందని జై శంకర్ చెప్తున్నారు. అయితే సరిహద్దులో పహరా కాయడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరినా అక్కడ బలగాలను ఇప్పట్లో తగ్గించే వీలులేదని కూడా ఆయన అంటున్నారు. శీతాకాలంలో చలి విపరీతంగా ఉంటుంది కనక రెండు దేశాల బలగాల సంఖ్య తక్కువే ఉంటుంది. ఈ సమయంలోనే పరస్పర కలహాలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతానికి ఘర్షణలు లేకుండా ఒప్పందం కుదిరినప్పటికీ సంపూర్ణంగా సత్సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే కనిపించలేదు. సరిహద్దు వివాదం సమసిపోయేట్టు చేయడానికి 75శాతం బలగాలను తగ్గిస్తున్నామని జై శంకర్ అన్నారు. చైనాతో మన సంబంధాలు ఎప్పుడూ సమస్యాత్మకంగానే ఉన్నాయని ఆయన అంగీకరించారు. 2020లో గల్వాన్ లోయలో వివాదం తలెత్తినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోయాయి. సరిహద్దు వివాదం గురించి 75 శాతం పరిష్కారం కుదిరిందని, ప్రస్తుతానికి తూర్పు లదాఖ్ ప్రాంతంలో సేనలను తగ్గించే స్థితికి చేరుకున్నామని జై శంకర్ అన్నారు. 2020లో ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ పొడవునా సైనికుల సంఖ్య పెంచక తప్పలేదు. అనేక అంశాలపై చైనాతో ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నప్పటికీ కరోనా విజృంభించిన సమయంలో చైనా దళాలు మన సరిహద్దులోకి దూసుకొచ్చాయి. చైనా దూసుకొచ్చిన ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడమే కాక కొన్ని శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టినప్పుడు అంతరిక్షం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాలు కూడా నిరూపించినా మోదీ ప్రభుత్వం చైనా దూసుకు రాలేదని అసత్య వాదన వదలలేదు. చైనా దూసుకు రావడంవల్ల ఏదో విపత్తు ముంచుకొస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమేనని తేలింది. దీనివల్ల రెండుదేశాల మధ్య సంబంధాలు మరింత బెడిసిపోయాయి. ఇంత జరుగుతున్నా చైనా నుంచి మన సరుకుల దిగుమతి ఆగకపోవడం ఆశ్చర్యం. ఇంకా పరిష్కారం కుదరాల్సిన సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గాయని విదేశాంగమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు కుదిరిన పరిష్కారం నిరంతరం రెండు పక్షాల సైనికాధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది జరిపిన చర్చలవల్లే సాధ్యమైంది.
గల్వాన్ లోయలో ఘర్షణలు మొదలైన తరవాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. మన సైనికుల మీద చైనా సైనికులు భౌతిక దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఆయుధాలతో కాకుండా రెండు దేశాల మధ్య ఘర్షణల్లో ఇదివరకటి పద్ధతులకు బదులు వినూత్న పద్ధతుల్లో చైనా ముళ్ల తీగలు మొదలైన వాటితో మన సేనలమీద దాడిచేసింది. ఇందులో మన సైనికులు 20 మంది మరణించారు. చైనా సైనికులు 40 మంది మరణించారని మన పక్షం వాదన. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. 2021లో రెండుపక్షాల మధ్య వివిధ స్థాయిల్లో సంప్రదింపులు మొదలైనాయి. ప్రస్తుతం కుదిరిందంటున్న పరిష్కారం వెనక చర్చోప చర్చల ప్రమేయం ఉంది. గత సెప్టెంబర్ 13న భారత జాతీయ సలహాదారు అజిత్ డోబాల్ చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ తో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో బ్రిక్స్ సమావేశం సందర్భంగా సంప్రదింపులు జరిపారు. అప్పుడు రెండు దేశాల బలగాలను తగ్గించాలన్న ప్రస్తావన వచ్చింది. గత నెల జరిగిన చర్చలలో ‘‘నిర్మోహమాటంగా, నిర్మాణాత్మకంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంప్రదింపులు జరపాలన్న అవగాహనకొచ్చారు. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితిపై సైతం నిర్మోహమాటమైన చర్చలు జరిగాయని అప్పుడు మన విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ చర్చల క్రమంలో శాంతియుత పరిస్థితులను కాపాడాలనుకున్నారు. వాస్తవాధీన రేఖను గౌరవించాలని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు కావడానికి ఆస్కారం ఉంటుంది. చైనాతో సరిహద్దు వివాదం ఇన్నేళ్లుగా ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంది. అరుణాచల్ప్రదేశ్ తమదేనన్న వాదనను చైనా మధ్య మధ్యలో లేవనెత్తుతూనే ఉంటుంది. గత ఆగస్టు 29న బీజింగ్లో భారత-చైనా సరిహద్దు సమన్వయ సమితి సమావేశం జరిగింది. అప్పుడూ రెండు పక్షాల మధ్య చర్చలైతే నిర్మోహమాటంగానే జరిగాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న అవగాహన కూడా కుదిరింది. కానీ నాలుగేళ్లనుంచి చైనా ఆగడాలు మాత్రం ఆగలేదు. చిన్న సమస్యలకు పరిష్కారం కుదిరిందని, క్లిష్టమైన అంశాలపై పరిష్కారం కుదరాల్సిన అవసరం ఉందని ఈ నెలారంభంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు. దౌత్య వర్గాల ద్వారా సానుకూల సంకేతాలే అందాయని కూడా ద్వివేదీ చెప్పారు. రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య నిరంతరం చర్చలు కొనసాగడంవల్ల కొంతలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడిరది. గోరా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోంచి చైనా 2022 లో తమ దళాలను ఉపసంహరించింది. అప్పుడైనా దెప్సాంగ్ మైదానంలో విస్తారమైన మన భూభాగం చైనా అధీనంలోనే ఉంది. రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం ఉంటుందో లేదో చూడాలి. 2019 తరవాత రెండు దేశాల అధినేతల మధ్య ముఖాముఖి సంభాషణ జరిగిన దాఖలాలేలేవు. 2019లో రెండు దేశాల అధినేతలు మామల్లాపురంలో చర్చించుకున్నారు. 2022లో ఇండోనేషియాలో జి-20 దేశాధినేతల సమావేశంలో మోదీ, షీ జిన్పింగ్ మధ్య మర్యాదపూర్వకమైన పలకరింపులు మాత్రమే జరిగాయి. 2023లో దక్షిణాఫ్రికాలోనూ అదే పరిస్థితి. గత సంవత్సరం దిల్లీలో జరిగిన జి-20 సమావేశాలకు షీ జిన్పింగ్ హాజరే కాలేదు. బుధవారం రష్యాలోనైనా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందో లేదో తెలియదు. గత జులైలో శివశంకర్ అస్తానాలో జరిగిన షాంఘాయ్ సహకార సంస్థ సమావేశంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ఈ తో సంప్రదించారు. ఆ తరవాత ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా విదేశాంగ మంత్రులిద్దరూ కలుసుకున్నారు.