Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ముస్లిం ఓటర్లకు ఆటంకాలు

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ నడవడిక ఇదే మొదటిసారి కాదు. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రి అయిన తరవాత పుష్కర కాలం పాటు ముస్లిం అభ్యర్థులను బీజేపీ దరిజేరనివ్వలేదు. ఆయన ప్రధానమంత్రి అయిన తరవాత దేశవ్యాప్తంగా ముస్లింల వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్‌ ఏలుబడిలోనూ ముస్లిం అభ్యర్థులను ఎంపిక చేయడమే మానేశారు. ప్రస్తుత లోక్‌సభలో గానీ, వివిధ రాష్ట్రాలలోగానీ బీజేపీ అభ్యర్థ్థులు ఒక్కరు కూడా లేరు. ముస్లింలు ఎలాగో తమకు ఓటు వేయరన్న అభిప్రాయం ఉండడంవల్ల కావచ్చు, 80 శాతంగా ఉన్న హిందువుల అండ తమకు ఉండగా 14-15 శాతం ముస్లింలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అని నిర్ధారణకు వచ్చినందువల్ల కావొచ్చు బీజేపీ ముస్లింలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. కేరళలో మాత్రం మల్లపురం నియోజకవర్గంలో రాజకీయ నాయకుడిగా మారిన ఎం.అబ్దుల్‌ సలాంకు మాత్రం బీజేపీ టికెట్‌ ఇచ్చింది. ఇదే అబ్దుల్‌ సలాంను మోదీ కేరళలో పర్యటిస్తున్నప్పుడు మోదీ ర్యాలీ నిర్వహిస్తున్న జీపులో కాలు పెట్టనివ్వలేదు. అబ్దుల్‌ సలాం నిష్ఠా గరిష్ఠుడైన ముస్లిం. మహమ్మద్‌ ప్రవక్త బోధనలను విపరీతంగా పాటిస్తారు. కానీ తనకు దేశభక్తి, జాతీయ ప్రయోజనాల మీద అంతకన్నా ఎక్కువ విశ్వాసం ఉందని ఆయన అంటుంటారు. ముస్లింలు అంటే బీజేపీకి, ముఖ్యంగా మోదీకి ఎంత ఏవగింపో ఇటీవల బికనేర్‌ లో జరిగిన ఒక్క సంఘటన గమనిస్తే చాలు. మోదీ బికనేర్‌ వెళ్లినప్పుడు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఒస్మాన్‌ ఘని మోదీని కలుసుకున్నారు. ఘని అడిగిన ప్రశ్నలు మోదీకి ఏ మాత్రం నచ్చలేదు. వెంటనే ఆయనను ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇంతకు ముందు భారతీయ జనసంఫ్‌ు రోజులలో ఆరిఫ్‌ బేగ్‌, షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, సికిందర్‌ భక్త్‌ లాంటి ప్రసిద్ధ ముస్లిం నాయకులు ఉండేవారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ముఖ్తర్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి నాయకులు ప్రముఖంగా కనిపించేవారు. అలాంటి వారు ఇప్పుడు అంతర్ధానమై పోయారు. దీర్ఘకాలంగా బీజేపీలో ఉండి ప్రతిష్ఠ పెంచుకున్న గుప్పెడుమంది ఇప్పటికీ పార్టీ అధికార ప్రతినిధులుగా అక్కడక్కడా అవశేషాల రూపంలో కనిపిస్తారు. యోగీ ఆదిత్యనాథ్‌ లాంటి వారు బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారిన తరవాత ముస్లింలకు ఏ అవకాశమూ ఇవ్వని ధోరణి బాగా పెరిగిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గో హత్యలు, పశు మాంసం తినడం పెరిగిపోతాయని యోగి ఇటీవల కూడా హెచ్చరించారు. ముస్లిం వ్యతిరేకత బీజేపీ నరనరాల్లో జీర్ణించుకు పోయింది. బీజేపీలో ముస్లింల ప్రాతినిధ్యం క్రమంగా తగ్గించి చివరకు ఇప్పుడు మోదీ హయాంలో ఆ మతం వారికి ఏ అవకాశమూ లేకుండా చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ‘‘ఇస్‌ బార్‌ 400 పార్‌’’ అని ఇన్నాళ్లుగా నినదిస్తూ వచ్చిన తరవాత గత 19న జరిగిన తొలి విడత పోలింగ్‌ తరవాత ఆ మాట మాట్లాడడం తగ్గించారు. శుక్రవారం జరిగిన రెండవ విడత పోలింగ్‌ సరళితో మోదీలో నైరాశ్యం మరింత పెరిగింది. 400 సీట్లు కాకపోతే కనీస మెజారిటీ అయినా దక్కుతుందో లేదోనన్న భయం ఆయనను పీడిస్తోంది. అనేక సర్వేలు బీజేపీ మహా అయితే 250 స్థానాల్లో గెలిస్తే గొప్ప అంటున్నాయి. ఇంకా కొన్ని సర్వేలైతే బీజేపీని 180 సీట్లకే కుందించి వేస్తున్నాయి.
నైరాశ్యంలో కూరుకున్నందువల్ల, ముస్లింలు తమకు ఎలాగో ఓటు వేయరని నిర్ధారణకు వచ్చినందువల్ల బీజేపీ మరో మార్గం ఎంచుకున్నట్టు ఉంది. గత రెండు విడతల పోలింగ్‌ శాతం తక్కువే ఉంది. ఒక్క బెంగాల్‌లోనే జనం ఉత్సాహంగా ఓట్లు వేశారు. బీజేపీ కనిపెట్టిన కొత్త మార్గం ఏమిటంటే ముస్లింలను ఓటు వేయకుండా ఏదో ఒక రూపంలో నిరోధించడం. ఇది ఇంతకు ముందు కూడా స్వల్ప స్థాయిలో అనుసరించిన పద్ధతే. గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని రాం పూర్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ కుటుంబ సభ్యులు తమను ఓటు వేయనివ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై సమాజ్‌ వాదీ పార్టీ సభ్యులు పార్లమెంటులో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. షరా మామూలుగా యోగి ప్రభుత్వం ఈ ఆరోపణను తోసిపుచ్చింది. సభలో గలభా సృష్టించడమే సమాజ్‌ వాదీ ప్రతినిధుల తత్వం. కానీ ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉంది అని యోగి అన్నారు. ఈ సారి ఎన్నికలలో బీజేపీ రెండు వ్యూహాలు అనుసరించి ముస్లింలు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఒకటి: ఓటర్ల జాబితా నుంచి అనేక మంది ముస్లింల పేర్లు మాయం చేయడం. కొన్ని చోట్ల కుటుంబాలకు కుటుంబాలే ఓటర్ల జాబితాలో కనిపించడంలేదు. ప్రసిద్ధ సినీనటి హేమ మాలిని పోటీ చేస్తున్న మథుర నియోజకవర్గంలో ఈ ఆరోపణలు విపరీతం. భాగ్‌పత్‌, మీరట్‌ లో కూడా ఇవే ఆరోపణలున్నాయి. అనేక ఏళ్లనుంచి ఓటు వేస్తున్న వారి పేర్లూ మాయమైనాయి. అనేక చోట్ల ముస్లింలు ఓటు వేయడానికి వెళ్తే మీ ఓటు ఇదివరకే పోలైంది అన్న సమాధానం వినాల్సి వస్తోంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న బస్తీల్లో పనిగట్టుకుని పోలింగ్‌ నెమ్మదిగా జరిగేట్టు అధికారులే ప్రయత్నిస్తున్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్లలోనే ఇ.వి.ఎం.లు మొరాయించాయి. ఘాజియా బాద్‌లోని గౌతం బుద్ధ నగర్‌, నోయిడాలో కూడా ముస్లింలను ఓటు వేయనివ్వలేదన్న ఆరోపణలు వచ్చాయి. మొన్నటి దాకా బి.ఎస్‌.పి.లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున అమ్రోహీ నుంచి దానిశ్‌ అలీ పోటీ చేస్తున్నారు. అక్కడా ఇదే సమస్య. చత్తీస్‌గఢ్‌ లోనైతే పరిస్థితి మరింత దారుణం. మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు చాలా సేపు అడ్డుతగిలారు. భాగ్‌పట్‌ లోని మోదీ నగర్‌ లో 258వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో, సివాల్‌ ఖాస్‌ లోని 328వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి ముస్లింలు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీకి ఓట్లు పడవనుకున్న చోటే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపించాయి. ముస్లిం ఓటర్లను బీజేపీ అడ్డుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ముస్లిం ఓటర్లంటే భయం. రెండు: బీజేపీకి ప్రజాస్వామ్య ప్రక్రియలో విశ్వాసం లేకపోవడం. ఇదే ప్రవర్తన భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పక్షం అవలంబిస్తే అప్పుడు తమ గతి ఏమిటి అని బీజేపీ ఆలోచిస్తున్నట్టు లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img