పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం ప్రభుత్వం పలికించే చిలకపలుకులు పలకడమేనని అందరికీ తెలుసు. ఈ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. దాన్ని రాష్ట్రపతి అక్షరం పొల్లు పోకుండా చదవాల్సిందే. అందులో రాష్ట్రపతి అభిప్రాయాలకు తావు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయబోతోందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నోటితో చెప్పిస్తుంది. ఇది ఆనవాయితీ. కానీ ఊతకర్రల ఆధారంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మురిసిపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చదివిన ప్రసంగ పాఠంలో అర్థ శతాబ్దం నాటి ఎమర్జెన్సీ ఊసే ఎక్కువ. స్పీకర్గా ఎన్నికైన తరవాత ఓం బిర్లా అయితే ఏకంగా ఎమర్జెన్సీని తూర్పారపడ్తూ తీర్మానమే ప్రతిపాదించారు. ముర్ము నోటా మోదీ ప్రభుత్వం అవే మాటలు చెప్పించింది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అనీ, అది రాజ్యాంగం మీద జరిగిన తీవ్రమైన దాడి అని ముర్ము అన్నారు. ఎమర్జెన్సీ దుష్పరిణామాలు ఏమిటో అది ప్రజాస్వామ్యాన్ని ఎలా కుళ్లబొడిచిందో ఇన్నేళ్లుగా విస్తృతమైన చర్చే జరిగింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడానికి కారణాలు ఏమైనప్పటికీ, అది ఎంత ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అయినప్పటికీ రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును వినియోగించుకునే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. అందువల్ల దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్య అనలేం. ఆ సమయంలో ఎన్నో అకృత్యాలు జరిగాయి. ఇందిరా గాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడానికి అవకాశం ఇవ్వడం ఇందిరా గాంధీ చేసిన అతి పెద్ద పొరపాటు. తుర్క్మాన్ గేట్ వద్ద సామాన్యుల ఇళ్లు కూల్చి వేయడం, సంఖ్యా పరంగా లక్ష్యాలు నిర్దేశించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, మూకుమ్మడిగా ప్రతిపక్ష నాయకులను నెలల తరబడి జైళ్లల్లో మగ్గబెట్టడం మొదలైనవి ఏవీ సమర్థించదగినవి కాకపోవచ్చు. అయితే ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థ్థితులను బేరీజు వేయడంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆసక్తి లేదు. అన్నింటికన్నా మించి ఎమర్జెన్సీని రద్దు చేయడం ద్వారా ఇందిరా గాంధీ తన నిరంకుశత్వాన్ని తానే రద్దు చేసుకున్నారు అన్న వాస్తవాన్నీ మరుగు పరచడం కుదరదు. బహుశ: ప్రపంచంలో ఏ నియంతా తన నిరంకుశ అధికారాలను వదులుకున్న దాఖలాలు కనిపించవు. ఇవన్నీ అలా ఉంచినా గత పదేళ్ల మోదీ పాలనలో ఎమర్జెన్సీని మించిన నిరంకుశత్వం, ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. దీని గురించి మాత్రం ముర్ము ప్రసంగంలో ప్రస్తావనే లేదు. ఆ ప్రసంగం నిండా అంతా ఏకపక్ష దాడే కనిపిస్తుంది. బలం పుంజుకున్న ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ను ఇరుకున పెట్టడానికే మోదీ ప్రభుత్వం ముందు స్పీకర్ చేత, ఆ తరవాత రాష్ట్రపతి చేత ఎమమర్జెన్సీ ప్రస్తావన చేయించారు. తాము బలహీన పడ్డాం కనక ప్రత్యర్థి పక్షం మీద బురద చల్లితే పనై పోతుంది అన్నది మోదీ ఎత్తుగడ. ఎమర్జెన్సీ గతం. ప్రస్తుతం మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న అప్రకటిత చరిత్ర వర్తమానం. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాలేదన్న అక్కసుతో ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోయడానికి మోదీ ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు ప్రజలు వెంటనే ఇందిరా గాంధీకి గుణపాఠం నేర్పారు. ఒక రకంగా బీజేపీకి మెజారిటీ దక్కకుండా చేసి ఇప్పుడు సైతం ప్రజలు మోదీని దండిరచారు. కూడికలు తీసివేతల పుణ్యమా అని మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. కానీ ఎన్నికల ఫలితాల రూపంలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి మోదీ గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు. మునుపటి రీతిలోనే వ్యవహరిస్తున్నారు. దానికి రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ముసుగు కప్పే ప్రయత్నం చేశారు.
ముర్ము ప్రసంగంలో సార్వత్రిక ఎన్నికలలో జమ్మూ-కశ్మీర్ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారన్న ప్రస్తావన కూడా ఉంది. ఈ మాట చెప్పించడం ద్వారా 370వ అధికరణాన్ని రద్దు చేసి జమ్మూ-కశ్మీర్ విషయంలో తాము ఘనకార్యం చేశామని చెప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. 370వ అధికరణం రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టినందువల్ల అక్కడ శాంతి వెల్లి విరుస్తోందని రాష్ట్రపతి చేత చెప్పించడం మోదీ అసత్య ప్రచారంలో భాగం. దాదాపు రెండువారాల కింద కూడా అక్కడ వరసగా మూడుసార్లు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆ దాడుల వెనక ఉన్న వారిని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ నిర్బంధించలేక పోయింది. ఎన్నికలలో ప్రజలు ఉత్సాహం చూపడం శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయనడానికి సంకేతం కాదు. ప్రజలు తమ స్వేచ్ఛాకాంక్షను వ్యక్తం చేయడానికే పోలింగ్లో పాల్గొన్నారు. జమ్ము-కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అయిదేళ్లవుతోంది. ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. డాంబికాల మాట ఎలా ఉన్నా వాస్తవ పరిస్థితి నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. జమ్ము-కశ్మీర్లో వాస్తవ పరిస్థితి రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. బీజేపీ ఆత్మకు ఇంపైన ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికల వంటి ప్రగల్భాల ప్రస్తావన కూడా ముర్ము ప్రసంగంలోంచి మాయమైంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరవాత దాని మీద అనేకసార్లు దాడులు జరిగాయని చెప్పిన రాష్ట్రపతి మోదీ హయాంలో రాజ్యాగాన్ని ధ్వంసం చేసిన దురంతాలను ఉటంకించలేక పోయారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగించడం ఒకటే కావన్న సుద్దులు మాత్రం ఈ ప్రసంగంలో వినిపించాయి. వికసిత భారత్ సాధించాలన్న సంకల్పాన్ని సాకారం చేయాలని కూడా ఆమె హితవు చెప్పారు. వికసిత భారత్ నినాదం ఎవరిదో ప్రజలు ఆలోచించకుండా పోరు. అభివృద్ధి గురించి మాయమాటలు చెప్పి 2014లో అధికారం సంపాదించిన తరవాత ఎంత వికాసం జరిగిందో, పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య, పరిశ్రమలు మూత పడినందువల్ల నిరుద్యోగులైన లక్షలాదిమంది దుస్థితి ఛాయలే ఈ ప్రసంగంలో లేవు. రాబోయే బడ్జెట్లు మునుపటి నిర్మలా సీతారామన్ బడ్జెట్లకన్నా భిన్నంగా ఉంటాయన్నమాట మాత్రం ముర్ము ప్రసంగంలో వినిపించింది. ఇప్పుడు ఆ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయినప్పుడు బడ్జెట్ల స్వరూపం ఎలా మారుతుందో తెలియదు. మోదీ ప్రసంగాల్లో దొర్లించే కల్లబొల్లి మాటలే రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేరాయి. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు స్పష్టమైన, సుస్థిరమైన తీర్పు ఇచ్చారు అని రాష్ట్రపతి చేత చెప్పించడం అసత్యాలాడడం అలవాటైన ప్రభుత్వానికి సునాయాసమైన పనే. ప్రతిపక్షాల బలం పెరిగినందువల్ల ఊపిరి సలపని మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంది.