ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్టుబట్టినట్టే బుధవారం పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ.) అమలు ప్రారంభం అయిపోయింది. దాదాపు 350 మందికి పౌరసత్వ సర్టిఫికేెట్లు అందజేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో మతపరమైన పీడనకు గురై మన దేశంలోకి వలసవచ్చే హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలకు, బౌద్ధులకు, క్రైస్తవులకు పౌరసత్వం ఇవ్వడానికి 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి 2019లో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. అయితే సి.ఎ.ఎ. ప్రకారం మతపరమైన పీడనకు గురై మన దేశానికి వలస వచ్చే ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వదు. అంటే మొట్ట మొదటిసారి మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ బిల్లును 2016 జులైలోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పటికీ మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత 2019 డిసెంబర్ లో ఆమోదం పొందలేదు. ఈ సవరణ చట్టం అమలులోకి రాక ముందు విదేశాల నుంచి వచ్చేవారు 11 సంవత్సరాలు మన దేశంలో ఉంటే భారత పౌరసత్వం పొందడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ముస్లిం లకు మాత్రమే ఆ అర్హత లేకుండా చేయడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చారు. బిల్లుకు 2019లోనే పార్లమెంటు ఆమోదం లభించినా నిబంధనలు రూపొందించనందున అమలు చేయడం సాధ్యం కాలేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు గత మార్చి 11వ తేదీన మోదీ ప్రభుత్వం ఈ చట్టానికి నిబంధనలు రూపొందించింది. అంటే బిల్లు ఆమోదం తరవాత నాలుగేళ్లకు పైగా జాప్యం జరిగింది. 2014 డిసెంబర్ 31కన్నా ముందు మన దేశంలోకి శరణార్థులుగా వచ్చిన ముస్లింలకు మినహా ఇతర మతాల వారికి ఈ చట్టం ప్రకారం పౌరసత్వం దక్కుతుంది. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదించిన వెంటనే ఇది ముస్లింల విషయంలో వివక్ష చూపుతుంది కనక దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. మొదటి విడతగా దిల్లీలో 14 మందికి పౌరసత్వ సర్టిఫికెట్టు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు అందుకున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనే వాగ్దానం చేసింది. ఈ సవరణ చట్టం కింద 25,000 దరఖాస్తులు అందాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారు. ఈ చట్టం అమలు చరిత్రాత్మకమైందని ఆయన సంబర పడిపోతున్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లా దేశ్ లో మతపరమైన మైనారిటీలను పీడిస్తున్నారు కనక వారికి పౌరసత్వం ఇవ్వడం మన నైతిక బాధ్యత అన్నది అమిత్ షా వాదన. దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చట్టం ‘‘అత్యంత ప్రమాదకరమైంది’’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇది మత చిచ్చు రగులుస్తుందని ఆమె హెచ్చరించారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఈ ఎన్నికలలో అధికారంలోకి వస్తే ఆ తరవాత జరిగే మొదటి పార్లమెంటు సమావేశంలోనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం అంటున్నారు. ఈ చట్టంతో పాటు మరో అయిదు చట్టాలను కూడా ఉప సం హరిస్తామని ఆయన అంటున్నారు. ఈ చట్టానికి సవరణలు చేసే ప్రసక్తే లేదని రద్దు ఒక్కటే మార్గమని చిదంబరం అన్నారు.
2019 డిసెంబర్ 11న రాజ్యసభ పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోద ముద్ర వేస్తే డిసెంబర్ 15 నుంచే నిరసనలు మొదలయ్యాయి. జామియా మిలియా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులను చితకబాదారు. గ్రంథాలయంలో, తరగతి గదుల్లో కూర్చుని చదువుకుంటున్న వారిని కూడా పోలీసులు విచక్షణా రహితంగా బాదారు. ఆ ఆవరణలో ఉన్న అనేక వాహనాలను పోలీసులే ధ్వంసం చేయడం మోదీ ప్రభుత్వం పోలీసు బలగాలను ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయగలుగుతుంది అనడానికి తార్కాణం. 2019 డిసెంబర్ 16వ తేదీ నుంచి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో మహిళలు నిరవధిక ధర్నా ప్రారంభించారు. కరోనా మహమ్మారి సంకటం ఎదురైనప్పుడు మోదీ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరిక లేకుండా లాక్ డౌన్ విధించడంతో షాహీన్ బాగ్ ఉద్యమం విరమించవలసి వచ్చింది. 2020 జనవరిలో ఈ దుష్ట చట్టాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలైనాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది. ఈ లోగా అమలు జరిగిపోతోంది. ఈ చట్టం ప్రకంపనలు అనేక పెడదారులకు దారి తీశాయి. దిల్లీలో మత కలహాలు జరిగాయి. 2024 ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామని 2023 డిసెంబర్ లో ప్రకటించారు. ఎన్నికలకు ముందు అయితే అమలు చేయలేదు కానీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే అమలు ప్రారంభించారు. ఈ చట్టం ప్రకారం ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న మూడు దేశాలలో బాధలు అనుభవిస్తున్న ముస్లింలు మినహా మిగతా వారికి పౌరసత్వం ఇస్తామని అమిత్ షా చెప్తూనే ఉన్నారు. ముస్లింలను మాత్రం మినహాయించి అందరికీ సమాన హక్కులుంటాయని ఆయన బుకాయిస్తున్నారు. పాకిస్థాన్ లో ఇస్లాం మతాన్ని అవలంబించే మహమ్మదీయులు విపరీతమైన వేధింపులకు, వివక్షకు గురవుతున్నా వారికి మాత్రం భారత పౌరసత్వం ఇవ్వరట. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైందని, మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని, భారత్ అన్న భావనకే విఘాతం కలిగిస్తుందన్న విమర్శలను మోదీ ప్రభుత్వం ఖాతరు చేయకుండా మొండిగా అమలుచేసి తమ ముస్లిం వ్యతిరేకతను మరో రూపంలో వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం ద్వారా ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోవడం లేదని కొందరు కేంద్ర మంత్రులు బూటక ప్రచారం చేస్తున్నారు. 2014 డిసెంబర్ 31కి ముందు శరణార్థులుగా వచ్చిన వారు భారత పౌరసత్వంకోసం దరఖాస్తులు చేసుకోవచ్చునన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లేదు. రొహింగ్యాలకు శరణు ఇవ్వడాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పు పడ్తోంది. శరణార్థులను తిరస్కరించడానికి వీలు లేదని అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్న మోదీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. జాతీయ పౌరుల జాబితా అన్న మోదీ ప్రభుత్వ మరో పథకం కూడా ఇలాగే వివక్షా పూరితమైందే. కానీ ఈ రెండిరటికీ సంబంధం లేదని కేంద్ర పెద్దలు బుకాయిస్తున్నారు. ఆక్రమిత కశ్మీర్ మనదేనని ఇటీవల కూడా అమిత్ షా లాంటి వారు గర్జిస్తున్నారు. మరి వారి గతి ఏమిటో మాత్రం చెప్పరు. మాట్లాడితే ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని బీరాలు పలుకుతుంటారు. ఆ దిశగా ఒక్క అడుగైనా వేయలేదు.