ఈ ఏడాది చివరలోగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తిస్ గఢ్ శాసన సభలకు, 2024 ఆరంభంలో లోకసభ ఎన్నికలు జరగనున్నందువల్ల రాజకీయ సమీకరణలు వేగవంతంగా మారి పోతున్నాయి. బీజేపీని గద్దె దించే వ్యూహంలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు తమ శత్రు పక్షాలను కూడా చేర దీస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ సకల ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ను గద్దె దించి అధికారం సంపాదించడానికి బీజేపీ కూడా అనేక మార్గాలు అన్వేషిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, బీజేపీకి ప్రధాన వ్యూహకర్త అమిత్ షా అప్పుడే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ప్రచారంలో మునిగి పోయి ఉన్నారు. తెలంగాణా శాసనసభ ఎన్నికలు కూడా ఈ ఏడాది ఆఖరులోగా జరగాలి. కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి) కూడా మళ్లీ అధికారం నిలబెట్టు కోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కె.సి.ఆర్. పార్టీ ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’ లో చేరలేదు. తమది ప్రతిపక్షమే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. మోదీని విమర్శించడానికి సకల అవకాశాలను వినియోగించుకుంటుంది. అన్ని ప్రాంతీయ పార్టీలలాగే బి.ఆర్.ఎస్.కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తూనే బీజేపీని గట్టిగా వ్యతిరేకించదు. ఈ వ్యతిరేకత మాటలకే పరిమితం. ప్రస్తుత లోకసభలో ప్రాంతీయ పార్టీల నడవడికను చూస్తే ఈ పార్టీలన్నీ కీలక దశలో ప్రతిపక్షాలతో నిలబడకుండా మోదీ సర్కారును సమర్థించిన సందర్భాలే ఎక్కువ. అనేక బిల్లులు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ పార్టీలన్నీ బీజేపీతోనే చేయి కలిపాయి. బి.ఆర్.ఎస్. తెలంగాణలో అజేయంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నందువల్ల కంగారు పడుతోంది. అంతకు ముందు బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావించిన కె.సి.ఆర్. పరిస్థితి మారడంతో కాంగ్రెస్ను ఎలా ఎదుర్కో వాలో ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో కె.సి.ఆర్. పార్టీ ప్రతిపక్షాలకే అండగా ఉంది. మణిపూర్ విషయం లోనూ ఇదే పరిస్థితి. శాసనసభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టు కోవడం కోసం కె.సి.ఆర్. భీంఆర్మీ పార్టీతో చేయి కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.. బి.ఆర్.ఎస్. నాయకుడు నామా నాగేశ్వర్ రావు కూడా అవిశ్వాస తీర్మానం ప్రేశ పెట్టడానికి నోటీసు ఇచ్చిన వారిలో ఉన్నారు. బి.ఆర్.ఎస్.కు లోకసభలో తొమ్మిది మంది సభ్యులున్నారు. అయితే బి.ఆర్.ఎస్. ‘‘ఇండియా’’ ఫ్రంట్ లో భాగస్వామి కాదు. మోదీని బలంగా సవాలు చేస్తున్నది ఈ ప్రతిపక్ష ఫ్రంటే. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిస్తేతప్ప బి.ఆర్.ఎస్. వైఖరి జాతీయ రాజకీయాలలో ఎలాఉంటుందో తెలియదు. 80 లోకసభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షాలతో బాహాటంగా చేయి కలిపే విషయంలో ఇప్పటికీ సందిగ్ధత వీడలేదు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి బీజేపీని ఒంటరిగా ఎదుర్కోగలనన్న ధీమా కనిపిస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాల మహా కూటమికి అఖిలేశే నాయకత్వం వహించవచ్చు. దళితుల సంక్షేమ కోసం పాటుపడ్తున్న భీం ఆర్మీ నాయకుడు చంద్ర శేఖర్ ఆజాద్ తో పొత్తు కోసం అఖిలేశ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. షహరాన్ పూర్, ముజఫ్ఫర్ నగర్, బిజ్ఞోర్ ప్రాంతాలలో భీం ఆర్మీకి పట్టు ఉంది. బెంగళూర్లో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశాలలో సమాజ్వాదీ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్ (కె) కాంగ్రెస్తో చేయి కలిపే అవ కాశాలను పరిశీలిస్తున్నాయి. ఇందులో అఖిలేశ్ కన్నా మిగతా రెండు పార్టీలే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నాయి. కాంగ్రెస్ ను బలహీన పరచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న ఆం ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ తో స్నేహం చేయక తప్పని స్థితి ఉంది. అందుకే ఆం ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్గాంధీతో సోనియా గాంధీ సమావేశం కావడానికి ప్రాధాన్యత ఏర్పడిరది. రాజ్యసభలో సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేసిన తరవాత ఆయన పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష పూనారు. సోనియా గాంధీ ఆయనను కలుసుకుని కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మళ్లీ అధికారంలోకి రావడం కాంగ్రెస్కు అనివార్యం. కాంగ్రెస్గెలిస్తే ప్రతిపక్షకూటమిలో నూత నోత్సాహం నింపుతుంది. అందుకే మధ్యప్రదేశ్లో గిరిజనులు, దళితులు, మహిళల మీద కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరిస్తోంది. సామాజిక న్యాయం అన్నభావన మళ్లీ రంగంమీదికివస్తోంది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులాల ప్రాతిపదికన జనగణన ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ హామీ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మాల్వా, బుందేల్ఖండ్, వింధ్య ప్రాంతాల మీద కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.18,000 ఆర్థికసహాయం అందజేస్తామని కమల్నాథ్ అంటున్నారు. మధ్య ప్రదేశ్ శాసనసభలో 47 స్థానాలు గిరిజనులకు, 35 సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేకించారు. ఆ రాష్ట్ర జనాభాలో 37 శాతం గిరిజనులు, షెడ్యూల్డ్కులాల వారే. రాజస్థాన్ లో అధికారం నిలబెట్టు కోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మానవాభివృద్ధి మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ఎదుర్కోవడానికి ఇదే మెరుగైన వ్యూహం అనుకుంటున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రజానుకూల విధానాలు ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణ, కనీస ఆదాయం అన్న ప్రతిపాదనలకు ఆదరణ పెరుగు తోంది. రాజస్థాన్ ప్రభుత్వ ఆరోగ్యపథకం రాష్ట్రంలోని ఏ ఆసుపత్రి లోనైనా డబ్బు చెల్లించకుండా చికిత్స చేయించుకునే సదుపాయం కల్పిస్తుంది. కనీస ఆదాయ పథకం కింద నెలకు వెయ్యి రూపాయలు అందిస్తారు లేదా ఏడాదిలో 125 రోజులు ఉపాధి కల్పిస్తారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో వంద రోజులకే ఉపాధి హామీ ఉంది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం నిధులకేటాయింపులో కోతపెడ్తోంది. అందువల్ల కాంగ్రెస్ ప్రతిపాదన జనాకర్షణకు తోడ్పడవచ్చు. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలలోనూ అమలు చేయాలనుకుంటోంది. మరో వైపు ఇలాంటి పథకాలను మోదీ రేవడీలు(తాయిలు) అని విమర్శిస్తున్నారు. ఆయన చేస్తున్న పనీ అదేనన్నది వేరే విషయం. గెహ్లోత్ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. శిక్షణావకాశాలు పెంచుతోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. నూతన పథకాల రూపకల్పనకు ఎంత ప్రాధాన్యంఉందో కొత్త రాజకీయ సమీకరణలకు అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతే ఉంటుంది.