అధికారం కోసమో, అస్తిత్వం కోసమో కుదిరే రాజకీయ పొత్తులు దీర్ఘకాలం కొనసాగిన సందర్భాలు తక్కువ. మోదీ నాయకత్వంలోని బీజేపీకి ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కన్నా 33 స్థానాలు తక్కువ వచ్చాయి. ఎన్.డి.ఎ. ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే ఇతర పార్టీల సహకారం అవసరం అయింది. అందుకే 16 స్థానాలు సాధించిన తెలుగు దేశం, 12 సీట్లు సంపాదించిన జె.డి.(యు) సహకారం మోదీకి అనివార్యం అయింది. ఈ రెండు పార్టీలూ ఇంతకు ముందు బీజేపీతో కలిసి కాపురంచేసిన సందర్భం ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్య సామ్యం కన్నా తేడాలే ఎక్కువ. తెలుగు దేశం నిక్కచ్చిగా సెక్యులర్ భావాలున్న పక్షం కాకపోయినప్పటికీ మతతత్వ బీజేపీకి మద్దతు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి తప్ప మతతత్వ ధోరణి అనుసరించిన సంఘటనలు లేవు. జె.డి. (యు)ది అదే పరిస్థితి. అదీ కాక జె.డి. (యు) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోషలిస్టు భావజాల పునాదిమీద రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. తెలుగు దేశం, జె.డి.(యు) పార్టీల ప్రధానమైన కోరిక అయితే తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండును ఇప్పటికీ విడనాడ లేదు. ఇతర అంశాల విషయంలోనూ, ముఖ్యంగా మంత్రిపదవుల బట్వాడా విషయంలో మోదీ ఈ రెండు పార్టీల కోరికలను ఖాతరు చేయలేదు. ఈ విషయంలో తెలుగుదేశం పరిస్థితే కొంత నయం. రామ్ మోహన్ నాయుడికి విమానయాన మంత్రిత్వ శాఖ అయినా దక్కింది. జె.డి. (యు)కు దక్కింది రెండు సహాయమంత్రి పదవులే. బీహార్ నుంచి మొత్తం ఎనిమిది మంది మోదీ మంత్రివర్గంలో ఉన్నా జె.డి. (యు)కు ఒక్క కాబినెట్ మంత్రి పదవి అయినా ఇవ్వలేదు. దీనితో నితీశ్ కుమార్ ను మోదీ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదన్న అసంతృప్తి జె.డి.(యు) నేతల్లో గూడు కట్టుకుంటోంది. ఇంతకు ముందు నితీశ్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో చేరితే కనీసం గౌరవం అయినా దక్కేది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రభుత్వంలో వీరి మాటను ఖాతరుచేసే అవకాశం ఉండేది. ఒక దశలో నితీశ్ కుమార్కు ఉప ప్రధానమంత్రి పదవి ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు జరిగాయి. తీరా ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరవాత జె.డి. (యు)కు మిగిలింది నిరాశే. నితీశ్ కుమార్ మనసులో ఏముందో ఇంతవరకు తెలియదు కానీ ఆయన పార్టీ నాయకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. మంత్రివర్గం ఏర్పాటుచేసే సమయంలో దిల్లీ వెళ్లే ముందు నితీశ్ చెప్పిన మాటవేరు, తీరా జరిగింది దానికి పూర్తి భిన్నమైంది అన్న భావన ఆ నాయకుల్లో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగాలి. ఈ లోగానే బీహార్ శాసనసభను రద్దు చేయాయాలని నితీశ్ వాదన్. ఇప్పుడు ఆ అవకాశమే కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా 15-16 నెలల సమయం ఉంది కనక ఆ లోగా బీహార్లో బీజేపీని బలోపేతంచేసి అక్కడ అధికారం సంపాదించాలన్న ఆలోచనలో మోదీ ఉన్నారు. హిందీ మాట్లాడే ఆ ఉత్తరాది రాష్ట్రంలో ఇప్పటిదాకా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే రాలేదు. బీహార్ బీజేపీ విభాగం అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి పనితీరుపై బీజేపీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉంది. త్వరలో ఆ స్థానంలో కొత్త వారిని నియమించవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవుల మాట ఎలా ఉన్నా రాష్ట్రాలస్థాయిలో ప్రాంతీయంగా బలంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ పొత్తు కుదుర్చుకున్నా ఆ పార్టీని బీజేపీ ఛిన్నాభిన్నం చేసింది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి గండి కొట్టడం మీదే బీజేపీ అగ్ర నాయకత్వం ఎప్పుడూ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాటేమో కానీ బీహార్ లో మాత్రం జె.డి. (యు) అస్తిత్వానికి ఎసరు తెచ్చి బీజేపీని బలోపేతం చేసే ప్రక్రియకు అప్పుడే శ్రీకారం చుట్టారు. గతంలోనూ జె.డి.(యు)ను తమ అవసరానికి అప్పనంగా వినియోగించుకుని పక్కకు తోసేసిన ఘనత బీజేపీకి ఉంది.
మధ్యంతర ఎన్నికలు, బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి మీద నితీశ్ చాలా ఆశలు పెంచుకున్నారు. అవసరం తీరింది కనక ఈ విషయాలను మోదీ పట్టించుకోక పోవడం జె.డి. (యు) నేతలకు మింగుడు పడడం లేదు. తమ పార్టీకి రైల్వే లాంటి ప్రధాన మంత్రిత్వ శాఖలు కేటాయించాలని నితీశ్ ఆశించారు. కానీ ఆ శాఖ మోదీకి ఇష్టుడైన అశ్వినీ వైష్ణవ్ కు కట్టబెట్టారు. అదానీకి ఉపకారం చేయడమే మోదీ పరమోద్దేశం కనక ఆ శాఖ తమ దగ్గరే ఉండాలని మోదీ భావించారు. అప్పుడే అదానీకి మీగడ తరకలు దోచి పెట్టడం సాధ్యం. ఒకవేళ రైల్వే శాఖను జె.డి. (యు)కు ఇస్తే అదానీ ఆటలు నితీశ్ కుమార్ సాగనివ్వరన్న భయం మోదీకి ఉంది. మంత్రిత్వ శాఖల కేటాయింపును బట్టి చూస్తే పేరుకు మాత్రమే ఇది ఎన్.డి.ఎ. ప్రభుత్వం. ఆచరణలో గత పదేళ్ల లాగే మోదీ ప్రభుత్వమే. జె.డి. (యు)కు మంత్రివర్గంలో కూర్చోవడానికి కాసింత చోటు ఇచ్చారు తప్ప ప్రాధాన్యత ఏ మాత్రంలేదు. మోదీ వ్యవహార ధోరణిలో మిత్ర పక్షాలకు ఆట్టే చోటు ఉండదని బీజేపీ సీనియర్ నాయకులే అంటున్నారు. జె.డి. (యు) ను చీల్చడానికి మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని కూడా ఈ నాయకులు చెప్తున్నారు. బీహార్ లోనూ ‘‘ఆపరేషన్ లోటస్’’ ఖాయంలా కనిపిస్తోంది. అదే జరిగితే సాధించిన సీట్లతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటున్న నితీశ్ కుమార్ పని ఖాళీ. మోదీ పన్నాగాలకు గతంలో కూడా చంద్రబాబు, నితీశ్ బలయ్యారు. బీజేపీతో తెలుగు దేశం 2019లో తెగదెంపులు చేసుకున్న తరవాత నలుగురు తెలుగు దేశం రాజ్యసభ సభ్యుల్ని మోదీ లాగేశారు. అలాగే జె.డి. (యు) నాయకుడు ఆర్.పి.సింగ్ ను లాగేసి మంత్రిపదవి కట్టబెట్టారు. అప్పుడే నితీశ్ ఎన్.డి.ఎ. నుంచి బయటకు వచ్చారు. మోదీని చూసి నితీశ్ ఎందుకు భయపడుతున్నారో జె.డి. (యు) నేతలకు అంతుపట్టడం లేదు. నితీశ్ కుమార్ ను మోదీ తోసెయ్యక ముందే తాము ఆర్.జె.డి.లో చేరిపోవడం మేలని జె.డి. (యు) నాయకులు ఆలోచిస్తున్నారు. అదే జరిగితే మోదీది మూణ్నాళ్ల ముచ్చటే.