బైడెన్ స్థానంలో రంగ ప్రవేశానికి ఏర్పాట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ దేశంలో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ దూకుడు ప్రదర్శించగా బైడెన్ తడబడ్డారు. వయస్సు మీద పడటం, ఆరోగ్య సమస్యలు ఉండటం, కొన్ని విషయాల్లో తగిన విధంగా స్పందించలేకపోతుండటం వల్ల బైడెన్ స్థానంలో వేరొకరిని బరిలోకి దించాలన్న యోచన డెమొక్రాట్లలో ఉంది. సొంత పార్టీ నుంచి బైడెన్కు వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బైడెన్ స్థానంలో డెమొక్రాట్ల తరపున అధ్యక్ష రేసులో నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు అంటే ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ను స్థానంలో మిషెల్ ఒబామాను తీసుకు వస్తారని క్రూజ్ తెలిపారు.డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో మరో ఐదుగురు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చన్ విట్మెర్, బైడెన్ కేబినెట్లోని మంత్రి పెటే బుట్టిజియాజ్, సెనేటర్ ఎలిజిబెత్ వారెన్ కూడా పోటీలో ఉంటారని తెలుస్తోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
నా తడబాటుకు అదే కారణం: బైడెన్
తన స్థానంలో వేరొకరిని అధ్యక్ష రేసులో నిలబెట్టేందుకు పార్టీలో ప్రయత్నాలు జరుగుతుండటంతో ట్రంప్తో డిబేట్లో తన తడబాటుకు కారణం లేకపోలేదంటూ బైడెన్ వివరణ ఇచ్చుకున్నారు. తన సిబ్బంది వద్దని చెప్పినా వినకుండా విదేశీ పర్యటనలు పెట్టుకున్న క్రమంలో అలసట కారణంగా వేదికపై నిద్రావస్తలోకి జారుకున్నానని, ట్రంప్ వాదనలను దీటుగా బదులు ఇవ్వలేకపోయానని బైడెన్ వెల్లడిరచారు. చురుగ్గా వ్యవహరించలేకపోయినందుకు తన మద్దతుదారులందరికీ ఆయన క్షమాపణలు చెప్పారు.
తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం లేదని, సాకులు చెప్పడం లేదని, వివరణ మాత్రమే ఇస్తున్నానని వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే ట్రంప్ ముందర బైడెన్ డీలా పడటం వాస్తవమేగానీ ఆయన అధ్యక్షుడిగా అసమర్థుడని భావించడం సరికాదని శ్వేతసౌధం పేర్కొంది. మరో నాలుగేళ్ల పాటు దేశాన్ని సమర్థంగా నడిపించగల సమర్థుడు బైడెన్ అని పేర్కొంది. డిబేట్ రోజు బైడెన్ ఆరోగ్యం సరిగ్గా లేదని, జలుబు, గొంతు నొప్పితో ఆయన బాధపడ్డారని ఓ అధికారి తెలిపారు. బైడెన్ పాలన సమర్థంగా సాగిందని, అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని, ప్రజలకు మెరుగైన సేవలందించారని, ఎక్కడా బాధ్యతల నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. డిబేట్ ముఖ్యం కాదని అధ్యక్షుడిగా ఎలా పనిచేయగలరన్నదే ప్రధానమని నొక్కిచెప్పారు.