దక్షిణ గాజాలోకి సహాయ సామాగ్రి చేర్చేందుకు: ఇజ్రాయిల్ ప్రకటన
జెరూసలేం: ఐరాస, ఇతర సహాయ సంఘాల ద్వారా చేరుకున్న సామాగ్రిని దక్షిణ గాజాలోకి పంపేందుకుగాను దాడులకు వ్యూహాత్మక విరామమిచ్చినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. గాజా స్ట్రిప్లో ఆహారంతో పాటు ఇతర అత్యవసర వస్తువుల తీవ్ర కొరతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఆదివారం నుంచి దాడులకు విరామమిస్తున్నట్లు తెలిపింది. సలా అల్ దిన్ రోడ్డుకు వెళ్లే కరీం షాలోమ్ క్రాసింగ్ దిశగా ఉత్తరం వైపునకు వెళ్లే మార్గంలో ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు సైనిక చర్యలకు వ్యూహాత్మక విరామిస్తున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడిరచింది. ఈ మానవతా సహాయ మార్గం కరీమ్షాలోం నుంచి 10 కిమీలు… రఫా యూరోపియన్ హాస్పిటల్ వరకు ఉంది. ఇద్అల్
అదా (బక్రీద్) సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. ఉదయం నుంచి ఎక్కడ దాడులు జరగలేదని గాజాలోని పాత్రికేయులు తెలిపారు.
లక్ష్యం నెరవేరే వరకు ఆగొద్దు: నెతన్యాహు
ఇజ్రాయిల్ సైనికులు ఎనిమిది మంది శనివారం రఫా సమీపంలో ఆయుధాలు ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న సందర్భంగా యాంటీ ట్యాంక్ మిసైల్ పేలడంతో మరణించారు. మరో ఇద్దరు ఉత్తర గాజాలో సాగిన పోరులో చనిపోయారు. దీంతో సైనిక మృతులు 309కు పెరిగాయి. సైనికుల మరణాలపై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తున్నాగానీ యుద్ధ లక్ష్యానికి కట్టుబడాల్సిందేనని పిలుపునిచ్చారు. లక్ష్యం నెరవేరే వరకు ఆగేది లేదని, హమాస్ను తుడిచిపెట్టేంత వరకు తమ పోరు సాగుతుందని మరోమారు స్పష్టంచేశారు.
స్వాగతిస్తున్నాం: ఐరాస
దక్షిణ గాజాలోకి సహాయ సామాగ్రిని చేర్చే ఉద్దేశంతో దాడులకు విరామివ్వాలన్న ఇజ్రాయిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఐరాస ఒక ప్రకటన చేసింది. మరింతగా మానవతా స్పందనకు ఆస్కారం కలిగిస్తూ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరింది. గాజాకు సాయం అందించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరింతగా కృషి చేసేందుకు ఐరాస, దాని భాగస్వామ్య సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడిరచింది. గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయని, తినడానికి తిండి, తాగడానికి నీళ్లే లేవని, ఆకలి కేకలు వినిపిస్తున్నాయని ఐరాస అధికారి లార్కె అన్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించి రోగాలు ప్రబలుతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితులు పూర్తిగా చేయి దాటకముందే తగు చర్యలు తీసుకోవాలని, మరింతగా సాయాన్ని గాజాకు చేర్చాలని ఐరాస పిలుపునిచ్చింది.