తొమ్మిది మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోని న్యూవో లియాన్ రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈదురు గాలులకు సభా వేదికలోని ఓ భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఓ చిన్నారితో సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు కోసం సెంటర్`లెఫ్ట్ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వరేజ్ మయ్నెజ్ ప్రచార ర్యాలీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో గాలి బాగా వీయడంతో వేదిక ఓ వైపుకు ఒరిగిపోయింది. దాని మీద ఉన్న వారితో సహా వేదికకు దగ్గరగా ఉన్న వారంతా గాయపడ్డారు. ఐదు వేల మంది కార్యక్రమానికి హాజరయ్యారు.గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించగా చాలా మందికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలిసింది. వర్షం, ఈదురు గాలి కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.