గుటెర్రస్ పిలుపు
న్యూయార్క్: శాంతి కోసం సమ్మిళిత కృషి ఎంతో అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ప్రపంచ దేశాలు ఇందుకోసం ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సుస్థిరత, శాంతి నెలకొల్పే పథంలో కలిసి నడవాలని సూచించారు. ఘర్షణలు పెరుగుతున్న వేళ ప్రపంచ శాంతి, సుస్థిరత అత్యవసరమని నొక్కిచెప్పారు. వీటి సాధన కోసం ఐరాస చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు లోబడాలని కూడా సూచించారు. న్యూయార్క్లోని ఐరాస కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో 2024 సంవత్సరంలో ప్రధానాంశాలను గుటెర్రస్ వివరించారు. వీటిపై సర్వసభ్య సమావేశం భేటీ అయినట్లు చెప్పారు. సుదీర్ఘమైన, సమగ్ర అజెండాపై చర్చించామన్నారు. మన ముందున్నా క్లిష్టమైన సవాళ్లలో ప్రపంచ శాంతిని ముఖ్యమైనదని అన్నారు. పెరుగుతున్న అసమానతలు, ఘర్షణలు, భౌగోళిక రాజకీయ విభజనలతో శాంతి`సామరస్య, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు విఘాతం కలుగుతోందని గుటెర్రస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో పరిస్థితి సంక్లిష్టమైందన్నారు. ప్రస్తుతం వ్యవస్థలు, న్యాయకులు, ప్రభుత్వాలు, బహుళపాక్షిక వ్యవస్థల మధ్య నమ్మకం పెద్ద సమస్యగా ఉందని, పరస్పరం నిందించుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కాబోవని గుటెర్రస్ హితవు పలికారు. అణు ముప్పు, పర్యావరణ ఎమర్జెన్సీ, కృత్రిమ మేథస్సు (ఏఐ)తో పొంచివున్న ముప్పు వంటి పెద్ద సవాళ్లు మన ముందున్నాయని తెలిపారు. ఐక్యంగానే వీటిని అధిగమించగలమని చెప్పారు. శాంతి కోసం కొత్త అజెండా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ), గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ తదితర అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్, గాజా సమస్యలకు పరిష్కారం తక్షణావశ్యమన్నారు. ప్రపంచం ఇంకా నిరీక్షించలేదని గుటెర్రన్ చెప్పారు. సవాళ్లు క్లిష్టమైనవిగా మారుతుండగా వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన పథం మరింత సంక్లిష్ఠమైనదిగా ఉందని అన్నారు. శాంతి, ఐక్యత కోసం ఐక్యంగా కృషి చేయడం అవశ్యమని గుటెర్రస్ సూచించారు.