వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం మరింత ఊపందుకుంది. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. అయితే ఎన్నికల సర్వేల ప్రకారం డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఇప్పటికీ ముందంజలో ఉన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్లి కీవ్లో కూర్చుంటారని కమలా హారిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ‘రష్యా-ఉక్రెయిన్ సమస్యను ఒక్కరోజులో పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పారు. ఆ మాటలను పూర్తిగా అర్థం చేసుకోండి. తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోన్న దురాక్రమణదారుడికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో ఉక్రెయిన్ను లొంగిపోయేలా చేస్తారు’ అని హారిస్ విమర్శించారు. రష్యా, ఉత్తరకొరియా విషయంలో ట్రంప్ వైఖరిని గతంలోనూ హారిస్ దుయ్యబట్టారు. ‘ట్రంప్ నియంతలను ఆరాధిస్తారు. కిమ్ జోంగ్ ఉన్కు ఆయన ‘ప్రేమలేఖలు’ రాశారు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే… రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)లో కూర్చునేవారు. ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారు. అమెరికా ప్రజలను విభజించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అని ఆమె విమర్శించారు.
ఇదిలా ఉంటే.. రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇటీవల సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మాత్రం మంచి సేల్స్మెన్ అంటూ అభివర్ణించారు.
మరోమారు హారిస్ ముందంజ
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే అనేక సంస్థలు నిర్వహిస్తోన్న సర్వేల్లో మాత్రం ట్రంప్ను దాటి కమల ముందు వరుసలో ఉంటున్నారు. నెల రోజులుగా వారిద్దరికీ లభిస్తోన్న మద్దతు విషయంలో నిలకడ కనిపిస్తోంది. తాజాగా రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో మూడు పాయింట్లతో ఆమె ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 2020 నాటి ఎన్నికల సమయంతో పోల్చుకుంటే… ఈసారి డెమోక్రాట్లు మరింత ఉత్సాహంగా ఉండొచ్చని ఆ సర్వే అంచనా వేసింది.