కారకాస్: వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో వరుసగా మూడోసారి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈవిషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 80శాతం ఓట్లను లెక్కించగా మడురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02శాతమే లభించాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా లో 25 ఏళ్ల సోషలిస్టు పాలనను కూలదోసేందుకు పశ్చిమ దేశాలు పన్నిన అనేక కుట్రలు, కుతంత్రాలను దేశ ప్రజలు పారనివ్వలేదు. అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల బహుళజాతి, కార్పొరేట్ ప్రచార బాకాలు అసత్య ప్రచారాన్ని అదే పనిగా సాగించినా దేశ ప్రజలు మదురోకు మరోసారి అధికారం అప్పగించారు. ఈ ఎన్నికల్లో పది మంది దాకా అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ ప్రధాన పోటీ అధ్యక్షుడు మదురో, యూనిటరీ డెమొక్రటిక్ ప్లాట్ఫామ్కు చెందిన ఎడ్మండో గొంజాలెజ్ మధ్యే సాగింది. బూజుపట్టిన నిరంకుశ కులీన వర్గాల ప్రతినిధి గొంజాలెజ్. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే గొంజాలెజే విజయం సాధిస్తారని విసృతంగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికలు ఎంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వెనిజులా ఎన్నికల సంఘం అంతర్జాతీయ పరిశీలకులను ఆహ్వానించి గట్టి సమాధానం చెప్పింది. కాగా ఈ ఎన్నికల లెక్కింపులో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని తెలిపాయి. కాగా ఈ ఎన్నికల ఫలితాలు వెనిజులా ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బింక్లెన్ వ్యాఖ్యానించారు. కాగా అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో వెనిజులా అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 6 గంటలకు మొదలైన పోలింగ్ 12 గంటలపాటు సాగింది. ఓటింగ్ మెషిన్లు మొరాయించడం కానీ, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు కానీ సమాచారం లేదని ఆ దేశ ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఎల్విస్ అమోరసో తెలిపారు. 2.1 కోట్ల మంది అర్హులైన ఓటర్ల కోసం దేశవ్యాప్తంగా 15,767 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.