ఇజ్రాయిల్ వెల్లడి
టెల్అవీవ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను చంపిన నేపథ్యంలో ఇజ్రాయిల్పై ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్లోని హెజ్బుల్లా ఇటీవల హెచ్చరించింది. దీంతో మరింత భీకర పోరుకు సిద్ధమైన ఇజ్రాయిల్ సైనికదళం ఐడీఎఫ్… ఈసారి హెజ్బుల్ల్లా ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా ఈ మిలిటెంట్ గ్రూప్నకు చెందిన ఓ సీక్రెట్ బంకర్ను తాము గుర్తించినట్లు సంచలన ప్రకటన చేసింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ రహస్య సొరంగంలో భారీగా నోట్ల గుట్టలు, బంగారం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ టెలివిజన్ ప్రసంగంలో వెల్లడిరచారు. ‘హెజ్బుల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడులు చేస్తున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్ను ధ్వంసం చేశాం. అందులో లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించాం. ఇజ్రాయిల్పై దాడికి ఈ నగదును వినియోగిస్తున్నారు. ఈ ఉగ్రవాద గ్రూప్నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న ఆ బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. దానిపై మేం ఇంకా దాడి చేయలేదు’ అని హగారీ వెల్లడిరచారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం… ఆ బంకర్లో 500 మిలియన్ డాలర్ల నగదు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,200కోట్లకు పైమాటే), బంగారం గుట్టలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని హగారీ తెలిపారు. ఈ బంకర్ను హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించేవాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్ను ఆయన చూపించారు.
ఈ ప్రాంతంపై తాము దృష్టిపెట్టినట్లు తెలిపారు. అయితే, తమ యుద్ధం హెజ్బుల్లాతో మాత్రమేనని, లెబనాన్ పౌరులతో కాదని మరోసారి స్పష్టం చేశారు. బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిపై తాము దాడి చేయబోమని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ‘హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని ఇప్పటికే ఐడీఎఫ్ ప్రకటించింది.