గాజా ప్రజలకు ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు
జెరూసలేం: ప్రపంచ దేశాలు ఆక్షేపిస్తున్నాగానీ గాజా విషయంలో ఇజ్రాయిల్ తీరు మారడం లేదు. యుద్ధ నేరాలకు పాల్పడుతూనే ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలను సైతం బేఖాతరు చేస్తూ దురాక్రమణను కొనసాగిస్తోంది. నరమేధాన్ని సృష్టిస్తోంది. అమాయక ప్రజలు, అభంశుభం తెలియని పసివారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది. వైమానిక దాడులు, భూతల దాడులతో గాజా నగరాన్ని పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేర్చింది. అక్కడి ప్రజలకు రక్షిత నీళ్లు, ఆహారం లభించకుండా అత్యంత దయనీయ పరిస్థితులను నెలకొల్పింది. పారిశుద్ధ్యం లోపించడమే కాకుండా తగిన వైద్యసౌకర్యాలు లేక రకరకాల వ్యాధులు ప్రబలుతున్నా, పోలియో ముప్పు పొంచివున్నాగానీ తమ దళాలు మరింతగా జనవాసాల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆత్మరక్షణగా చెప్పుకొని పశ్చిమ దేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు విర్రవీగుతున్నారు. ఖాన్ యూనిస్లోని దక్షిణ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ గాజా ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తమ దాడులకు అడ్డు రాకుండా అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ స్థానికులకు ఇజ్రాయిల్ సైన్యం శనివారం సూచనలు చేసింది. అల్ మవాసీలోని మానవతా క్షేత్రానికి తరలిపోవాలని పేర్కొంది. ఆ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలను గుర్తించినట్లు ఇజ్రాయిలీ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఒక ప్రకటన చేసింది. ఈ ప్రాంతం నుంచే ఇజ్రాయిల్పైకి క్షిపణి దాడులు జరిగినట్లు పేర్కొంది. పలస్తీనా సాయుధలపై పోరులో భాగంగా ఖాన్ యూనిస్లోని సొరంగాలు, మౌలిక వసతులను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడిరచింది. ఫిరంగులతో తమ దళాలపై దాడులు చేసే చిన్న సాయుధ శాఖలను అణచివేసినట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40వేల మంది పలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. చనిపోతున్నది సాయుధాలా, నిరాయుధులా అన్నది కూడా దళాలు పట్టించుకోవడం లేదని, విచక్షణ కోల్పోయి మారణహోమాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించింది. కాగా, హమాస్, ఇస్లామిక్ జిహాద్ సహా ఉగ్ర సంఘాలకు చెందిన 14వేల మందిని మట్టుపెట్టినట్లు ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు. అలాగే వేల మందిని అదుపులోకి తీసుకొని జైళ్లలో నిర్బంధించినట్లు కూడా వెల్లడిరచారు.
స్కూలుపై దాడిలో 30 మంది
పలస్తీనియన్ల మృతి
సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బలా స్కూలుపై ఇజ్రాయిల్ శనివారం జరిపిన దాడుల్లో 30 మంది పలస్తీనియన్లు మరణించారు. 100 మందికిగాపై గాయపడ్డారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ, హమాస్ ప్రభుత్వం ప్రకటించాయి. అయితే హమాస్ కమాండ్ సెంటర్ కాబట్టే స్కూలుపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించుకుంది.