మాజీ గూఢచారి తీవ్ర విమర్శలు
టెల్అవీవ్ : ముందుగా తమ దేశంపై హమాస్ జరిపిన దాడితో గాజాపై ఇజ్రాయిల్ యుద్దం ప్రారంభించింది. ప్రధానమంత్రి నెతన్యాహు పోరాటానికి కొందరు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం తరపపున గూఢచర్యంలో పాల్గొన్న మాజీ అధికారి గొనెన్ బెన్ ఇట్జక్… నెతన్యాహు వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఆయన ఇజ్రాయిల్కు అతిపెద్ద ప్రమాదకారి అని ఘాటుగా విమర్శించారు. ‘నేను ఎంతోమంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేశాను. ఉగ్రవాదం అంటే నాకు తెలుసు. కానీ నెతన్యాహు ఇజ్రాయిల్ను విధ్వంసంలోకి నెడుతున్నారని నాకు అనిపిస్తోంది. దేశానికి ఆయన అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మన దేశానికి అతిపెద్ద మద్దతుదారు. నెతన్యాహు మాత్రం ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అగ్రదేశంతో మనకున్న సుదీర్ఘ బంధాన్ని నాశనం చేస్తున్నారు’ అని మాజీ గూఢచారి నిరసన తెలిపారు. రఫాపై దాడికి సిద్ధపడొద్దని అమెరికా కొంతకాలంగా హెచ్చరికలు చేస్తోంది. అయినా ఇజ్రాయిల్ పెడచెవినపెడుతోంది. దీంతో ఆ దేశం నుంచి ఆయుధాల సరఫరా తగ్గిపోయిందని నెతన్యాహు ఇటీవల వెల్లడిరచారు. నాలుగు నెలల క్రితం నుంచి ఈ తగ్గుదల కనిపించిందని, కొన్నిరకాల ఆయుధాలను అమెరికా నిలిపివేసిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గొనెన్ ప్రస్తావించారు. ఆయన దిగిపోవాలని అంతా కోరుకుంటున్నారని, అందుకు ఈ పరిస్థితే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఈ స్థాయి నిరసన వ్యక్తమవుతున్నా… పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని నెతన్యాహు వెల్లడిరచిన సంగతి తెలిసిందే. హమాస్ అంతమయ్యేవరకు గాజాలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని అన్నారు. పాక్షిక ఒప్పందానికి మాత్రమే తాను సానుకూలమని తెలిపారు.