–దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులను కఠినంగా శిక్షించాలి
–సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య
విశాలాంధ్ర-ఆస్పరి (కర్నూలు జిల్లా) : రెన్యూ,గ్రీన్ ఇన్ఫ్రా గాలిమర్ల కంపెనీ ల కార్యాలయాలపై దాడులు చేసిన ఎమ్మెల్యే తమ్ముడు, వారి అనుచరులను కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, మొలగవల్లి, దేవనకొండ లో ఉన్న రెన్యూ విండ్ పవర్,గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీ కార్యాలయాలు (సబ్ స్టేషన్లు) లపై ఎమ్మెల్యే విరుపాక్షి తమ్ముడు,వారి అనుచరులు దాడులకు పాల్పడడం చాలా దారుణమన్నారు. సబ్ స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బంది, కార్మికులను చితకబాది కంప్యూటర్లు, డిస్కులు, కుర్చీలు పగలగొట్టడం దుర్మార్గమని, ఈ సంఘటన ను తీవ్రంగా ఖండించారు. ఆలూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతమని ఇలాంటి ప్రాంతంలో ఉన్న కంపెనీలకు భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే నే తన తమ్ముళ్లు అనుచరులతో దాడులకు తెగబడటం చూస్తుంటే కంచే చేను మేసినట్లు ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పిలిస్తే రాలేదని ఆయన సూచించిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని అడిగిన గుడ్ విల్ డబ్బులు ఇవ్వలేదనె ఉద్దేశంతో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడం మంచిది కాదని ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి నూతన పరిశ్రమల ఏర్పాటు చేయడానికి పూనుకొని యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాల్సింది పోయి,ఇక్కడ ఉన్న గాలిమర్ల కంపెనీలపై దాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై నాన్ బైబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, దాడులకు పాల్పడిన అరాచక శక్తులపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపాలని జిల్లా ఎస్పీ ని కోరారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, రైతు సంఘం మండల నాయకులు అంజనేయ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.