విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రితో పలుకుబడి ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. పేరుకేమో రైతే రాజని, కానీ రైతుకుమాత్రం పూర్తిగా నడ్డి విరిచే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మిర్చి రైతులు లక్షలకు లక్షలు పెట్టుబడి పెడుతూ పండించిన పంటలకు ఇంతవరకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20000 ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మార్కెట్లో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్డీఎస్ కుడి కాలువకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బికెఎంయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర, నాయకులు తిక్కన్న, లక్ష్మన్న, వీరేష్, నాగరాజు , గూడు కాజా, బాబు, కుంటెన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.