విశాలాంధ్ర- కర్నూలు సిటీ:ఈనెల 24, 25, 26 తేదీలలో అన్నమయ్య జిల్లా మదనపల్లి హార్స్ లీహిల్స్లో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునెప్ప, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పులిగం మద్దిలేటిలు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న డీఏ అరియర్స్, కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ, సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు ప్రధాన సమస్యలపై శిక్షణ తరగతులలో చర్చించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులకు కర్నూలు, ఆదోని, ఎమగనూర్ ,గూడూరు ప్రాంతాల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.సమావేశంలో ఏఐటియూసీ నగర కార్యదర్శి జి. చంద్రశేఖర్, నగర ఉప ప్రధాన కార్యదర్శి టి. రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.