విశాలాంధ్ర – పెద్దకడబూరు:(కర్నూలు) : హోటళ్ల యజమానులు రోడ్డుపై చెత్త చెదారాన్ని వేస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామ సర్పంచ్ రామాంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం పెద్దకడబూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని అలాగే పోలీసు స్టేషన్ నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే డ్రైనేజీ కాలువ పూడిక తీసి వేయించారు. బస్టాండ్ ఆవరణంలో ఉన్న హోటళ్ల యజమానులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిపై చెత్త చెదారాన్ని వేయొద్దని పంచాయతీ అధికారులు ఎన్నిమార్లు చెప్పినా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు ప్రతి హోటల్ యజమాని సామాజిక బాధ్యతగా తీసుకొని గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు.