విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ సభ్యులు కీలకపాత్ర అని ఎంపీడీఓ జయరాముడు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి, గ్రామ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో సభ్యులదే కీలకపాత్ర అని తెలిపారు. గ్రామ పంచాయతీలలో సాధారణ కనీస పరిపాలన విధానం, ఏపిపిఆర్ చట్టం 1994 యొక్క ముఖ్య నిబంధనలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం మరియు వ్యర్ధాల నిర్వహణ, త్రాగునీరు సరఫరా ఎలా చేయాలో వివరించారు. అలాగే లే ఔట్ మరియు బిల్డింగ్ ప్లాన్ నిబంధనలు, పంచాయతీ ఆస్తులు, వీది దీపాలు మరియు విద్యుత్ బిల్లుల నిర్వహణ, గ్రామ పంచాయతీలలో ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై శిక్షణా తరగతులలో వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.