విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం డివిజనల్ పంచాయతీ అధికారిణి నూర్జహాన్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేపై పంచాయతీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఇంటింటి సర్వే 18 పంచాయతీలకు గాను 6 పంచాయతీల్లో సర్వే పూర్తయినట్లు తెలిపారు. మిగతా 12 పంచాయతీల్లో సర్వే జరుగుతుందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా గ్రామంలోని గ్రామ కంఠం, ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీలను కొలతలు తీయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఆబాది ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఇళ్లకు సంబంధించిన కొలతల్లో సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం సర్వే చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ల కొలతలలో ఇంటి యజమానికి ఏవైనా సమస్యలు ఉంటే మొదటగా ఈఓఆర్డికి, మండల సర్వేయర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అక్కడ కూడా సమస్య తీరకపోతే రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ సభలు నిర్వహించి ఇళ్లకు సంబంధించిన కొలతలను చదివి వినపించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.