. అన్నీ పరిశీలించాకే ‘రీ టెస్ట్’పై నిర్ణయం
. సమగ్ర దర్యాప్తు జరపాల్సిందే: సుప్రీంకోర్టు
. కేంద్రం, ఎన్టీఏపై ప్రశ్నల వర్షం
. మరోసారి అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశం
న్యూదిల్లీ : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశపరీక్ష ‘నీట్- యూజీ 2024’ నిర్వహణలో అంతులేని అక్రమాలు బయటపడటం… ఎన్టీఏ, మోదీ సర్కారు తీరుపై పార్లమెంటులోనూ, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఈ క్రమంలో నీట్ పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నీట్ యూజీ 2024’ ప్రశ్నాపత్రం లీక్ కావడం వాస్తవమే అని సుప్రీంకోర్టు తేల్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని పేర్కొంది. దోషులను గుర్తించలేకపోయినా, పరీక్ష విశ్వసనీయత కోల్పోయినా, ప్రశ్నాపత్రం సోషల్ మీడియా ద్వారా లీక్ అయినా తిరిగి పరీక్ష నిర్వహించేందు (రీ` టెస్ట్)కు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం, ఎన్టీఏపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్కు ఎలా పంపించారు? ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు? ఏ తేదీలతో ఈ ప్రక్రియ జరిగింది? లీకైన పేపరు ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేశారు? వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరాగలని ధర్మాసనం పేర్కొంది. అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరో మార్గం లేదని తెలిపింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశం. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ నీట్ అవకతవకల వ్యవహారంపై వాదనలు విన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
మరోసారి అఫిడవిట్ దాఖలు చేయండి…
విచారణ సందర్భంగా ఒకే సెంటర్లో పేపర్ లీక్ అయిందని ప్రభుత్వం, పరీక్షకు మూడు గంటలకు ముందు పేపర్ లీక్ అయిందని ఎన్టీఏ కోర్టుకు విన్నవించాయి. లోపాలను పగిగట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, సీబీఐ, ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది. జులై 10వ తేదీలోగా అఫిడవిట్ దాఖలను చేయాలని స్పష్టం చేసింది. నీట్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను అందించాలని సీబీఐని ఆదేశించింది. 67 మందికి 720 మార్కులు ఎలా వచ్చాయో విచారణ చేయాలని, ఎక్కడ పేపర్ లీకేజీ జరిగింది, పరీక్షా సమయం కంటే ఎన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది, పేపర్ ఎలా లీక్ అయ్యిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నీట్ పరీక్షను రద్దు చేయకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్టీఏ) నిరోధించాలని కోరుతూ గుజరాత్కు చెందిన 50మందికి పైగా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది.
కేసు పూర్వాపరాలు…
ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్ వచ్చింది. పరీక్ష పేపర్ లీక్ కావడం సహా పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనుమానాలు వచ్చాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలతో కేంద్రం 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేసింది. అనంతరం రీ-టెస్ట్ లేదా గ్రేస్ మార్కులు వదులుకోవాలని నీట్ అభ్యర్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఏ జూన్ 23న రీ-టెస్ట్ నిర్వహించి జులై 1న సవరించిన మార్కుల లిస్ట్ను ప్రకటించింది.
సీబీఐ దర్యాప్తు
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిం చింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మరోవైపు ఈ కేసులో మధ్య వర్తులు, విద్యార్థులు సహా 14మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.