భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండేళ్ల తర్వాత రైళ్ల రాకపోకలు ఇటీవలే ప్రారంభం కాగా.. తాజాగా ఇరు దేశాల మధ్య మూడో రైలు ‘మిథాలీ ఎక్స్ప్రెస్’ను ఇరు దేశాల రైల్వే మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉత్తర పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య వారానికి రెండుసార్లు రాకపోకలు సాగిస్తుంది. ఏడాది క్రితమే ఈ రైలును ప్రారంభించినప్పటికీ.. కరోనా కారణంగా రైలు సేవలు ఆలస్యంగా మొదలయ్యాయి.
కరోనా కారణంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేళ్లపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మార్చి 28, 2020 తర్వాత తొలిసారి మే 29, 2022న ఇరు దేశాల మధ్య ప్రయాణికుల రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోల్కతా-ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్ప్రెస్, ఢాకా-కోల్కతా మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ రాకపోకలు ఆదివారం మొదలయ్యాయి. ఇరు దేశాల రైల్వే మంత్రులు కలిసి బుధవారం ‘మిథాలీ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించారు. ఈ రైలు భారత్లోని న్యూ జల్పాయ్గురి, బంగ్లాదేశ్లోని ఢాకా మధ్య 513 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగిస్తుంది. ఈ మూడు రైలు సేవల ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పర్యాటక రంగానికి కూడా ఈ రైలు సేవల వల్ల లబ్ధి చేకూరనుంది. ప్రతి ఆదివారం న్యూ జల్పాయ్గురి నుంచి బయల్దేరి వెళ్లే మిథాలీ ఎక్స్ప్రెస్.. తిరిగి సోమవారం ఢాకా కంటోన్మెంట్ నుంచి బయల్దేరి వస్తుంది. మళ్లీ బుధవారం భారత్ నుంచి బయల్దేరి వెళ్లి.. గురువారం బంగ్లాదేశ్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది.ఈ రైలును భారత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బంగ్లా రైల్వే మంత్రి నూరుల్ ఇస్లామ్ సుజన్ జెండా ఊపి ప్రారంభించారు. వాస్తవానికి ఈ మిథాలీ ఎక్స్ప్రెస్ను ఇరు దేశాల ప్రధానులు 2021, మార్చి 26న ప్రారంభించారు. కానీ కరోనా కారణంగా ఈ రైలు సేవలు ప్రారంభం కాలేదు.ఉత్తర పశ్చిమ బెంగాల్ నుంచి ఉదయం 11.45కు బయల్దేరి వెళ్లే ఈ రైలు బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఢాకా చేరుకుంటుంది. ఈ రైలులో నాలుగు ఏసీ క్యాబిన్ కోచ్లు, నాలుగు ఏసీ చైర్ కార్లు ఉంటాయి. ఏసీ క్యాబిన్ బెర్త్ టికెట్ ధర రూ.4905 ఉండగా.. ఏసీ క్యాబిన్ చైర్ కారు టికెట్ ధరను రూ.3805గా నిర్ధారించారు. ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ.2707గా ఉంది. భారత్లోని చివరి స్టాప్ అయిన హల్దిబరీ, బంగ్లాదేశ్లోని మొదటి స్టేషన్ అయిన చిలహతిలో ఈ రైలు కేవలం పది నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలోనే లోకోపైలెట్లు మారతారు. ఈ రైలులో ప్యాంట్రీ కారు సదుపాయం లేదు. ఈ రైలు బయల్దేరి వెళ్లే ప్లాట్ఫామ్లో భారీ సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు.. పెద్ద సంఖ్యలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు హల్దీబరి స్టేషన్ నుంచి ఈ రైలును జీరో లైన్ వద్ద బంగ్లాదేశ్కు అప్పగిస్తారు.