విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారైనా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని, అర్చకులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో పూజారులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని వెల్లడిరచింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని చెప్పింది. ఆయా ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని వివరించింది. పూజలు, సేవలు, యాగాలు, కుంబాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల ప్రభుత్వం ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది. నిధుల పెంచడంతో ఆలయాల్లో నిత్యం విశేష పూజలు జరగబోతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో 5400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన రూ.10వేలు, రూ.7వేలు అర్చకుడి భృతిగానూ, రూ.3వేలు పూజలకు వినియోగించాలని తెలిపింది. ధూప, దీప, నైవేద్యాల పెంపు సాయం వల్ల అదనంగా ప్రతి సంవత్సరం రూ.3240 కోట్ల భారం పడనుంది. ఈ మొత్తాన్ని దేవాదాయశాఖకు సర్వే శ్రేయోనిధి నుంచి వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడం పట్ల పూజారులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.