Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

క్షమించండి… తప్పుకుంటున్నా: అక్షయ్‌

ముంబై: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కొన్నిరోజులుగా అభిమానుల నుంచి వస్తోన్న ప్రతిస్పందన తననెంతగానో బాధపెట్టిందన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అసలేం జరిగిందంటే.. వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న అక్షయ్‌కుమార్‌ అప్పుడప్పుడూ కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తుంటారనేది తెలిసిందే. అయితే, యువత భవిష్యత్తును నాశనం చేసే ధూమపానం, మద్యపానం వంటి ప్రకటనలు తాను చేయనని గతంలో అక్షయ్‌ చెప్పారు. తాజాగా ఆయన, అజయ్‌దేవ్‌గణ్‌, షారుఖ్‌ఖాన్‌లతో కలిసి ఓ పొగాకు బ్రాండ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ ప్రకటన కొన్నిరోజుల నుంచి ప్రసారమవుతోంది. అది చూసిన అక్షయ్‌ అభిమానులు, నెటిజన్లు అసహనానికి గురయ్యారు. సోషల్‌మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలిపారు. వెంటనే కమర్షియల్‌ నుంచి తప్పుకోవాలని కోరారు. అభిమానుల నుంచి వస్తోన్న ప్రతికూల స్పందనలపై అక్షయ్‌ పెదవి విప్పారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తోన్న ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెప్పారు. ‘ఎన్నో ఏళ్ల నుంచి నన్నెంతగానో ఆదరిస్తోన్న అభిమానులు, శ్రేయోభిలాషులకు నా క్షమాపణలు. కొన్నిరోజులుగా మీ నుంచి వస్తోన్న ప్రతికూల స్పందన నన్నెంతగానో కలచివేసింది. నేనెప్పటికీ పొగాకు వ్యతిరేకినే. మీ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని ఆ యాడ్‌ నుంచి తప్పుకుంటున్నాను. అలాగే ఈ యాడ్‌ కోసం నాకు లభించిన మొత్తాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగించాలనుకుంటున్నా. కాంట్రాక్ట్‌ ఉన్న కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ యాడ్‌ ప్రసారం అవుతూనే ఉంటుంది. ఇక భవిష్యత్తులో ప్రతి విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాటిస్తున్నా’’ అని అక్షయ్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img