విపక్షాల ఆగ్రహం
న్యూదిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షం నీరు లీక్ కావడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగూర్ గురువారం లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ ప్రభుత్వంపై ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ భవనం ప్రారంభించిన ఏడాదికే వర్షపు నీరు లీక్ కావడం ఏమిటని మోదీ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ… పార్లమెంట్ పాత భవనానికి మార్చాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశాలు అందులో నిర్వహించాలని సూచించారు. వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన ఈ పార్లమెంట్ భవనంలో వర్షం నీరు లీకేజ్ ఆగే వరకు అయినా పాత భవనంలో ఈ సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. ఈ కొత్త పార్లమెంట్ భవనం కంటే పాత పార్లమెంట్ భవనం చాలా అత్యుత్తమమైనదని ఈ సందర్భంగా అఖిలేశ్ పేర్కొన్నారు. బీజేపీ హయాంలో నిర్మించి ప్రతి భవనం నుంచి ఇలా నీరు లీక్ అవుతుందంటూ మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు.