ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు ప్రజల్ని బెంబేలేత్తిస్తున్నాయి. వడగాడ్పుల బారినపడి గడిచిన 24 గంటల్లో 17 మంది మరణించినట్లు సంబంధిత అధికారులు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలిపారు. అలాగే వడదెబ్బ తగిలి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు. సప్దర్జంగ్ ఆసుపత్రిలో వడదెబ్బ సంబంధిత సమస్యలతో 33 మంది చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో గత 24 గంటల్లో 13 మంది చనిపోయారన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 22 మంది చేరారని, వారిలో నలుగురు మరణించినట్లు చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల్లో కూడా వడదెబ్బ బాధితులు గణనీయంగా చేరుతున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి వేడి గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో గురువారం ఉదయం వర్షం కురియడంతో కాస్త ఉపశమనం లభించింది.