చత్తీస్గఢ్లోని అతి చిన్న పోలింగ్ బూత్ ‘షెరాదండ్’. ఇక్కడ ఐదుగురే ఓటర్లు. అవిభక్త కొరియాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల విభజన తర్వాత 2008లో కొత్త అసెంబ్లీ స్థానం భరత్పూర్-సోన్హట్ ఉనికిలోకి వచ్చింది. షెరాదండ్ను కూడా పోలింగ్ కేంద్రంగా మార్చారు. జిల్లా కేంద్రమైన కొరియా నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. అక్కడకు చేరుకోవాలంటే ముద్కి నదిని దాటుకుంటూ అడవి, పర్వతాల గుండా వెళ్లాలి. ప్రతి ఎన్నికల్లో ఈ కేంద్రంలో 100 శాతం ఓటింగ్ జరుగుతుంది. తాజాగా మూడవ దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకే ఈ బూత్లో పోలింగ్ ముగిసింది. ఐదుగురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ చందా నుంచి ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను సిబ్బంది నిర్వహించారు.