ఒక వేపు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్కు మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుండగా మరో వేపు ఇండియా భాగస్వామ్య పక్షాలే పరస్పరం పోటీ పడే పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచే సీపీఐ అభ్యర్థిగా అనీ రాజా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయడాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇదివరకే అభ్యంతర పెట్టాయి. దీనివల్ల బీజేపీని ఎదిరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి.
బీజేపీతో పోరాడాలో, ఇండియా భాగస్వామ్యపక్షాలైన కమ్యూనిస్టులతో పోరాడాలో కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని అనీ రాజా ‘‘ది వైర్’’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘‘వాయనాడ్ నుంచి పోటీ చేయాలో లేదో కాంగ్రెసే నిర్ణయించుకోవాలి. అది వారి విశిష్టాధికారం. కాంగ్రెస్ ఒక స్వతంత్ర పార్టీ. మాదీ ఒక స్వతంత్ర పార్టీ అని ఆమె చెప్పారు. మేం మా అభ్యర్థులను ప్రకటించాం. ఫాసిస్టు శక్తులను ఎదిరించాలంటే మేం ముందు పీఠిన ఉండి పోరాడాలి అని ఆమె అన్నారు. కేంద్రంలో మిత్ర పక్షాలు కావాలో లేదో, లేదా కేరళలో మిత్ర పక్షాలతోనే పొరాడుతారో కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు. ఫాసిస్టులను ఓడిరచడానికి కాంగ్రెస్ ఇతరులను పోటీ చేయనిస్తుందా లేదా తమ అగ్ర నాయకులను తీసుకొచ్చి పోటీ పెడ్తుందో నిర్ధారించుకోవాలన్నారు. అనీ రాజా నాలుగు దశాబ్దాల నుంచి పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఆమె భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఇండియా ఐక్య సంఘటన సామరస్యంగా సీట్లు సర్దుబాటు చేసుకోగలిగితే సానుకూలమైన ఫలితాలు వస్తాయని ఆమె చెప్పారు. ఆమెతో ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు:
వాయనాడ్ నుంచి పోటీ ద్వారా మీరు మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ కొత్త పాత్ర ఎలా ఉంటుంది? మీ బాధ్యతలు ఎలా ఉంటాయి.
గత 40-45 సంవత్సరాల నుంచి పార్టీ నాకు సంస్థాగత బాధ్యతలు అప్పగించింది. దేశంలోని మహిళలను సంఘటితం చేయమని చెప్పింది. ఇప్పుడు కొత్త బాధ్యత అప్పగించింది. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ బాధ్యతా నిర్వర్తిస్తాను. ఇది నేను చేసిన పనికి ఓ గుర్తింపు. కేరళలో మహిళా నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ పార్టీ నన్ను ఎంపిక చేసింది. ఇది నాకు గర్వ కారణం.
రాహుల్ గాంధీ వాయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీపీఐ, సీపీఐఎం కాంగ్రెస్తో పాటు ఇండియా ఐక్య సంఘటనలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. మీ పార్టీ మొదట అభ్యర్థులను ప్రకటించింది. అంటే రాహుల్ గాంధీని మరో నియోజకవర్గం చూసుకోవాలన్న సందేశమా ఇది?
దేశంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీజేపీ-ఆర్.ఎస్.ఎస్. నాయకత్వంలోని ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నింటినీ బలహీన పరుస్తున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. ఈ దేశ లక్షణాలనే మార్చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు. ఇలాంటి స్థితిలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పరిరక్షించడానికి కంకణబద్ధమైన పార్టీలన్నీ ఏకం కావడానికి ప్రయత్నించాలి.
కేరళలో పోటీ ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్.కు, యు.డి.ఎఫ్.కు మధ్య ఉంది. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ సీపీఐ అభ్యర్థిని ఓడిరచారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటోంది? ఫాసిస్టు శక్తులను నిరోధించడానికి మరిన్ని మిత్ర పక్షాలు కావాలనుకుంటోందా? లేక కమ్యూనిస్టులను ఓడిరచాలనుకుంటోందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది కాంగ్రెసే.
ఒక సీటు ఇక్కడ, మరో సీటు మరోచోట వస్తే మాకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. మా స్థాయిలో మేం పోరాడడానికి శక్తి మేరకు పోరాడతాం. ఎంతటి త్యాగానికైనా వెనుకాడం. మమ్మల్ని ఎవరూ కొనలేరు. ఎవరూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి బెదిరించలేరు. ఇదే వామపక్ష సిద్ధాంత బలిమి. కేంద్ర స్థాయిలో ఇలాంటి మిత్ర పక్షాలు కావాలో లేక వామపక్ష శక్తులను ఓడిస్తారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతోందో చూడండి. ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి తప్ప వామపక్ష శక్తులను ఓడిరచడం మీద దృష్టి పెట్టడం కాదు.
రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయకూడదని, దీనివల్ల బీజేపీ వ్యతిరేక పోరాటం బలహీన పడ్తుందని ఇంతకు ముందే సీపీఐ, సీపీఎం చెప్పాయి. అప్పుడే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి కాకుండా మరో చోటినుంచి పోటీ చేసి ఉండాల్సిందా?
ఈ విషయం తేల్చుకోవాల్సింది కాంగ్రెసే. వారిది ఒక స్వతంత్ర పార్టీ. మాది మరో స్వతంత్ర పార్టీ. మేం మా అభ్యర్థులను ప్రకటించాం. ఫాసిస్టు శక్తులను ఎదిరించడానికి ముందుంటాం. నిర్ణయించుకోవలసింది కాంగ్రెసే.
ఇండియా ఐక్య సంఘటనలో నుంచే బహుళ అభ్యర్థులు ఉంటే ఇది ఇండియా ఐక్య సంఘటన సమైక్యతను దెబ్బ తీయదా! దీనివల్ల అసంతృప్తి పెరుగుతుంది కదా?
ఇండియా ఐక్య సంఘటన ఏర్పడుతున్నప్పుడు, దీని గురించి సంవాదాలు, చర్చలు జరుగుతున్నప్పుడు రెండు విషయాలు స్పష్టంగా ఉండాలనుకున్నాం. మొదటిది రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ ఐక్య సంఘటన ఏర్పాడాలి. రెండోది, కేరళలో ఎల్.డి.ఎఫ్., యు.డి.ఎఫ్. రెండూ పోటీ పడతాయి అని ముందు నుంచీ అనుకున్నారు. ముందు నుంచి ఇది స్పష్టంగానే ఉంది. అలాంటప్పుడు కేరళలో ఇతరులను పోటీ చేయనిస్తారో లేక తమ పార్టీ అగ్ర నాయకులను దిగుమతి చేస్తారో కాంగ్రెసే తేల్చుకోవాలి.
ఇండియా ఐక్య సంఘటనలో సీట్ల సర్దుబాటులో అవాంతరాలు ఎదురవుతున్నయి. బీహార్ లో జె.డి. (యు) ఐక్య సంఘటనలోంచి వెళ్లి పోయింది. బెంగాల్ లో తృణమూల్ పార్టీ కాంగ్రెస్ తో సర్దుబాట్లు చేసుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పంజాబ్లో కాంగ్రెస్తో సర్దుబాట్లకు ఆమ్ఆద్మీ పార్టీ సిద్ధంగా లేదు. కేరళలో కూడా అలాంటి పరిస్థితే ఉండబోతోందా?
ఇవన్నీ స్వతంత్రమైన పార్టీలు. ఏ పార్టీ సిద్ధాంతాలు వాటికున్నాయి. వివిధ అంశలు, సమస్యలపై ఏ పార్టీకి ఉండే అభిప్రాయాలు వాటికి ఉన్నాయి. కొన్ని అంశాలలో భిన్నమైన ఆలోచనా ధోరణి ఉండొచ్చు. చర్చలు, సంవాదాలు, సంభాషణల ద్వారా వీటిని పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇంతకు ముందు ఇండియా భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాదనుకునే వారు. అది ఇప్పుడు గత చరిత్ర. ఇప్పుడు పొత్తులు ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో సామరస్యంగా వివాదాలు పరిష్కారం అవుతాయనుకుంటున్నాం.
వచ్చే ఎన్నికలలో ఇండియా ఐక్య సంఘటన అవకాశాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు?
ప్రజలకు నచ్చ చెప్పగలం అనుకుంటున్నాం. మోదీ ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ పరిస్థితికి పోలికే లేదు. అభివృద్ధి, ఆర్థిక పురోగతి పేరుతో ప్రజల్ను మోసగిస్తున్నారు. కుల అంతరువులు లేవని ప్రధాని మోదీ అంటున్నారు. ఆ రకంగా కుల వివక్షను చాప కింద తోసేయాలనుకుంటున్నారు. ఉన్నది మహిళలు, యువత, రైతులు అనే కులాలేనంటున్నారు. వారు అడుగుతున్నది చిన్న కోరిక. కానీ రైతుల విషయంలో ఏం చేస్తున్నారో చూడండి. ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదు. మోదీ యువశక్తి గురించి మాట్లాడుతారు. కానీ ఉపాధి సంగతేమిటి? తమ సామాజిక మాధ్యమాల కోసం వేలు, లక్షల మందిని నియమిస్తున్నారు. మరి ప్రభుత్వోద్యోగాల మాటేమిటి? అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. దళితులు, గిరిజనులు ప్రభుత్వ రంగంలోకి అడుగు పెట్టే అవకాశాలు సన్నగిల్లేట్టు చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలే. ఈ వాస్తవం చెప్పడానికి ఇండియా ఐక్య సంఘటన పక్షాలు ప్రజల దగ్గరకు వెళ్తే ప్రజలు తమ బాధలూ చెప్పుకుంటారు.
సామరస్యపూర్వకంగా సర్దుబాట్లు కుదిరితే మేం ప్రజల దగ్గరకు వెళ్తే తప్పకుండా ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నాం అని అనీ రాజా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.