సురవరం సుధాకరరెడ్డి
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
కామ్రేడ్ బర్ధ్దన్ చాలా నిరాడంబర జీవి. ఆయనా నేను ఇద్దరం వివిధ రాష్ట్రాలలో పర్యటన చేస్తున్న సందర్భంగా, పాట్నాలో మన పార్టీ శాసనసభ్యుడి ఇంట్లో ఉండేవారం. అక్కడ మేము పార్టీ ఆఫీస్కి వెళ్లి తిరిగి సాయంకాలంవచ్చి వారి ఇంట్లో విశ్రాంతి తీసుకునేవారం. ఆ సందర్భంగా బర్ధన్ అనేకమంది ఇతర కమ్యూనిస్టు నాయకుల్లాగా తన బట్టలు తనే ఉతుక్కునేవారు. మేమిద్దరం బట్టలు ఉతుక్కుని ఆరేసి వెళ్లి వచ్చేవారం. ఒకసారి బర్ధన్ గారి బనియన్ కనబడలేదు. ఆయన వాళ్ళ అమ్మాయిని అడిగారు. వారి అమ్మాయి, ‘బనియన్ పడేశాను, చినిగిపోయిన బనియన్లు ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ‘‘అంకుల్ ఇది నాకేమీ బాగోలేదు మార్కెట్కెళ్లి ఒక మూడు కొత్త బనియన్లు కొనుక్కుని వచ్చాను’’ అని తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే మేము దిల్లీలో ఉన్నప్పుడు, బర్ధన్కి అవసరమైన బట్టలు కొన్ని నా భార్య విజయలక్ష్మి తీసుకొచ్చి ఆయనకు ఇచ్చేది. ఎందుకమ్మా ఇవన్నీ తెస్తారు ‘ఇవన్నీ ఇంకా బాగున్నాయి, పాత బట్టలను పడేయాల్సిన అవసరం లేదు’ అని ఎప్పుడూ అనేవారు. మా కుటుంబాలతో ఆయన చాలా ఆప్యాయంగా వుండేవారు. మా కుమారుల వివాహానికి హైదరాబాద్ వచ్చి ఆయన, చంద్రబాబు సాక్షి సంతకాలు చేశారు.
ఏబీ బర్ధన్ (అర్ధేందు భూషణ్ బర్ధన్) జన్మించి 100 సంవత్సరాలు అయింది. వారి కుటుంబం రెండు తరాల ముందు బంగ్లాదేశ్ నుంచి ఆనాటి మధ్యభారత్లోని నాగపూర్కు వచ్చి అక్కడ స్థిరపడ్డారు. విద్యార్థిగా ఉండగానే బర్ధన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు నాగపూర్ పట్టణ పార్టీ కార్యదర్శి హెచ్.కె.వ్యాస్ నుంచి పార్టీలో సభ్యత్వం పొందారు. బర్ధన్ నాగపూర్్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్, లా డిగ్రీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ నాయకుడిగా పనిచేశారు. అనేక దశాబ్దాల పాటు ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేశారు. లోతైన సిద్ధాంతపరమైన పరిజ్ఞానం కలిగిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేసేవి. మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు వెళ్లమని కోరినప్పుడు ఆయన నిరాకరించారు. జీవితమంతా పార్టీకి అంకితం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
బర్ధన్తో దాదాపు 20 సంవత్సరాలపాటు కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆయన భార్య చనిపోయిన తర్వాత, పూర్తి కాలం అజయ్ భవన్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండేవారు. ఆయన కుమార్తె డాక్టర్ అల్కా, అల్లుడు అహ్మదాబాదులో ఐఐటి డైరెక్టర్. కుమారుడు అశోక్ బర్ధన్ ప్రొఫెసర్. ఒకసారి ఆయనకు ఆపరేషన్ జరిగినప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఉన్న క్వార్టర్స్లో ఉండమని కోరితే, ఆయన అంగీకరించారు. దాదాపు ఐదారు సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. నేను వీపీ హౌస్లో సింగిల్ రూమ్కు మారేవరకు కలిసే వున్నాం. ఆయన ఎంత నిరాడంబర జీవితం గడుపుతారో ఆ రోజుల్లో బాగా అర్థమైంది. మేము కార్యాలయంలోనూ, సాయంకాలం ఇంట్లోనూ సైద్ధాంతిక రాజకీయ సమస్యలపై నిరంతరం చర్చించుకునేవాళ్లం. ఆయన దగ్గర నేను అనేక విషయాలను నేర్చుకున్నాను. ఆయన మార్క్సిజం, భారత రాజకీయాల గురించి నాకు అనేక విషయాలు వివరించేవారు.
‘‘భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ గడ్కరి ఒక రోజు, హఠాత్తుగా మా ఇంటికి వచ్చారు. ఆర్.ఎమ్.ఎల్. హాస్పిటల్ ఎదురుగా మాకు కేటాయించిన ఇంట్లో నేను ఆశ్చర్యపోయి చూస్తుండగా, ఆయన ‘నేను బర్ధన్ గారికి శిష్యుడ్ని. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను’’ అని అన్నారు. ఆయన బర్ధన్ గారికి పాదాభివందనంచేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు ఒక గంటసేపు విభిన్న విషయాలపై చర్చించారు. ఆయన వెళ్తూ నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఈ విధంగా, బర్ధన్ గారు విభిన్న రాజకీయ పార్టీల నాయకుల గౌరవాన్ని పొందినటువంటివారు. ఎన్సీపీ నాయకులు శరద్ పవార్ ఆయనకు సన్నిహిత మిత్రులు. చాలా సరదాగా అనేక జోక్స్ చెప్పుకునేవారు.
కామ్రేడ్ సూర్జిత్ గారు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు మరొక స్నేహితుడు మాజీ ప్రధానమంత్రి వీపీి సింగ్. వీపీ సింగ్ని కలవడానికి అనేకసార్లు బర్ధన్ నన్ను కూడా వెంట తీసుకెళ్లేవారు. యూపీఏ ప్రభుత్వాన్ని సిపిఐ, సిపిఎం బయట నుండి బలపరుస్తున్న రోజుల్లో, ఆయన మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించడానికి వామపక్ష, సెక్యులర్ ప్రజాతంత్ర పార్టీల ఐక్యత అవసరమని వివరించి యూపీఎ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు పార్టీని ఒప్పించారు. వామపక్షాల ఐక్యతకోసం ఆయన తీవ్రమైన కృషి చేశారు. సీపీిఎం నాయకులు ప్రకాశ్ కరాత్, సీతారాం ఏచూరి, ఇతర నాయకులు కూడా ఆయనను చాలా గౌరవించేవారు. అనేక సమస్యలపై ఆయనతో చర్చించి సలహాలు తీసుకొనేవారు. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వామపక్షాలు బయట నుంచి మద్దతిచ్చాయి. దానికి షరతు కనీస ఉమ్మడి కార్యక్రమం. ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరపున బర్ధన్, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, డి. రాజా ఆ కమిటీలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా కమిటీలో ఉన్నారు. ముసాయిదా తయారుచేయడంలో బర్ధన్, సీతారాం ఏచూరి ప్రధాన పాత్ర వహించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు, గృహహింస నిరోధక చట్టం, అటవీ హక్కుల చట్టం తదితరాలు. దాని వల్ల యూపీఏ ప్రభుత్వ గౌరవం పెరిగింది.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఎవరైనా మహిళపేరు సూచించమని సోనియా గాంధీ వామపక్షాలను కోరారు. సీపీఎం ఆ బాధ్యత బర్ధన్ మీద పెట్టింది. ఆయన రెండు, మూడుపేర్లు సూచించారు. ఆఖరికి ఆయన సూచించిన ప్రతిభా పాటిల్ పేరును సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అంగీకరించారు.
కేరళలో పార్టీ రాష్ట్ర మహాసభలకు వెళ్లినప్పుడు, మా ఇద్దరికీ, ఒక స్టార్ హోటల్లో గదులు ఇచ్చారు. ఒక రాత్రి ఉన్న తర్వాత ఆయన మహాసభ ప్రతినిధులు ఉన్న బసకు మార్చమని కోరారు. ఆ హోటల్ గదులు ఉచితంగా ఇచ్చారని చెప్పినా, అది మరీ విలాసవంతంగా ఉందని బస మార్పించారు. అజయ్ భవన్ గేటు ముందు మంగలితో క్షవరం చేయించుకునేవారు. గేటు పక్కన చెప్పులు కుట్టుకునే కామ్రేడ్ తార వచ్చి పార్టీ ఆఫీస్ క్యాంటీన్లో మాతోపాటు భోజనం చేసేవాడు. అతడు పార్టీ సభ్యుడు. అతను షూస్కుడితే అందంగా, మన్నికగా ఉండేవి. సాయంకాలం పూట బర్ధన్ అజయ్ భవన్ గ్రౌండ్ ఫ్లోర్లో రెడ్ గార్డులతో కూర్చొని టీ తాగుతూ మాట్లాడేవాడు వారి కుటుంబ ఫంక్షన్లకు బర్ధన్, పల్లబ్, నేను వెళ్లే వారం.
బర్ధన్ అనేక సంవత్సరాలపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తర్వాత, హైదరాబాదులో 2008లో జరిగిన పార్టీ మహాసభలో నన్ను ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంతకుముందు గిరిప్రసాద్ ఆ బాధ్యతలు నిర్వహించారు. అప్పటినుంచి మేము కలిసి పని చేశాం. అంతకుముందు, నేను పార్టీ సెక్రటేరియట్లో దాదాపు పది సంవత్సరాలు పనిచేశాను. 2012లో పాట్నాలో జరిగిన పార్టీ మహాసభ సందర్భంగా, ఆయన నన్ను ప్రధాన కార్యదర్శి పేరుకు ప్రతిపాదించినప్పుడు, నా ఆరోగ్యం రీత్యా, తర్వాత నాకు ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా బాధ్యత నెరవేర్చలేనని ఆయనతో చెప్పాను. కానీ, ఆయన, ‘‘నేను నీ సలహా అడగలేదు, నీ అనుమతి అడగలేదు’’ అన్నారు. సహజంగా, నాకంటే సీనియర్లు పార్టీ నాయకత్వంలో ఉండేవారు. వారందరినీ ఒప్పించి, ఆయన నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి, ఆ తర్వాత నేను నా బాధ్యతలు కొనసాగించేందుకు అవసరమైన నిరంతర సహాయం చేసేవారు. ఇతర కామ్రేడ్స్ను వ్యాసాలు, బుక్లెట్స్ రాయమని ప్రోత్సహించేవారు. డి.రాజాతో దళిత సమస్యలపై, షమీమ్ ఫైజితో మైనారిటీ సమస్యలపై బుక్లెట్స్ రాయించారు. వివిధ అంశాల మీద వ్యాసాలు రాయమని నాకు సలహా ఇచ్చేవారు. ఆయన బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు.
పార్టీ ఆఫీసులోనే మేము పక్కపక్క గదుల్లోనే ఉండేవారం. ఆయనతో చర్చించే చాలా విషయాలు నిర్ణయించే వారం. కొంతకాలం తర్వాత, ఆయన నిర్ణయాలు ప్రతిసారి నాతో చర్చించాల్సిన అవసరం లేదు. అత్యవసరమైనప్పుడే నాతో చర్చించండి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పారు. అయితే, మా కోరిక మీద ఆయన పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గంలో కొనసాగారు. ఆ తర్వాత, పార్టీ ప్రోగ్రాం కమిషన్ శాశ్వతచైర్మన్గా ఆయనను ఎన్నుకు న్నాం. వాస్తవానికి, కమ్యూనిస్టు పార్టీకి చాలాకాలం పార్టీ ప్రోగ్రాం మీద ఒక సమస్య ఉండేది. మారుతున్న పరిస్థితులను బట్టి, పార్టీ కార్యక్రమం పదేళ్లకు ఒకసారి లేదా 15 సంవత్సరాలకు ఒకసారి మారాలి.
హైదరాబాదులో జరిగిన పార్టీ కాంగ్రెస్లో పార్టీ ప్రోగ్రాంకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ను మాత్రమే తయారుచేశాం, కానీ పూర్తి ప్రోగ్రాం తయారు కాలేదు. పార్టీ కార్యవర్గం కోరిక మేరకు బర్ధన్ పార్టీ ప్రోగ్రాం తయారుచేసి, దానిని కార్యవర్గం, కౌన్సిల్ ముందుంచారు. ఆఖరికి పుదుచ్చేరిలో జరిగిన జాతీయ మహాసభలో కూలంకషంగా చర్చించి, దాన్ని అంగీకరించారు. నేను, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, డి.రాజా, అతుల్ కుమార్ అంజన్, పలవ్సేన్ గుప్తా ప్రోగ్రాం కమిషన్లో వున్నప్పటికీ ప్రధాన డ్రాఫ్ట్ బర్ధన్ తయారుచేశారు. ఈ ప్రోగ్రాం కమ్యూనిస్టు పార్టీకి మరింత స్పష్టతను తెచ్చింది. బర్ధన్ పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్లో ఇదొక ప్రధానమైన అంశం.
ఉత్తర భారతదేశంలో పార్టీ నిర్మాణం మీద ఆయన ప్రతేక శ్రద్ద పెట్టారు. బీహార్ ఒకప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీకి ఒక బలమైన కేంద్రం. అయితే, విభిన్న కారణాలవల్ల, ముఖ్యంగా కుల రాజకీయపార్టీల వల్ల పార్టీ బలహీనపడిరది. ఆయన బీహార్లో పార్టీ మహాసభ జరుపుదామని నిర్ణయించారు. బీహార్లో పార్టీ నిర్మాణం బాగోలేదని, చేయగలమా అని అందరికీ అనుమానం కలిగింది. సంవత్సరంపాటు ఆయన నెలకు ఒక వారం పది రోజులు బీహార్ వెళ్లి, జిల్లాల్లో కూడా పర్యటించి స్థానిక నాయకులకు మార్గనిర్దేశం చేసి, వారికి ఆత్మవిశ్వాసం కలిగించారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆయన జిల్లాలకు బస్సుల్లో, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేవారు. ఒక పర్యాయం దిల్లీ నుంచి మేము రైలులో మధుబని వెళ్లేందుకు స్టేషన్కు వెళ్తే మా ట్రైన్ రద్దయింది. ఎండాకాలం 43 డిగ్రీల వేడి. తర్వాత రైలుకు వెళ్దామనీ, రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు అని ఆయన పట్టుబట్టారు. కాసేపటికి వడగాలికి ఆయన స్పృహ తప్పారు. నేను చాలా భయపడ్డాను. కొద్ది నిమిషాల్లోనే తేరుకున్నారు. అయినా ప్రయాణం చేయాలన్నారు. ఆ రైల్లో రద్దీవల్ల ఎక్కలేకపోయాం. ఆయనను గుర్తుపట్టిన ఒక ఫాదర్ చక్రాల కుర్చీ తెప్పించి బయట టాక్సీలో ఆఫీస్కు పంపించారు. ఆ రాత్రి విమానంలో పాట్నా వెళ్లాం. ఆ పార్టీ కాంగ్రెస్ విజయవంతంగా జరిగింది. 1967లో జరిగిన పాట్నా మహాసభలకు ధీటుగా ప్రజలు లక్షల సంఖ్యలో బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం మెరుగుపడిరది. ఆ మహాసభల్లోనే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినుంచి రిలీవ్ అయ్యారు. దళితులు, గిరిజనుల సమస్యల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధపెట్టారు. పాట్నాలో మహాసభ తర్వాత, ఆయన సూచన మేరకు, నాగపూర్లో దళితుల సమస్యలమీద ఎస్సీ కాంపోనెంట్ గురించి జాతీయసదస్సు ఏర్పాటు చేశాం. గిరిజనుల సమస్యలమీద ఆయన చాలా మంచి పుస్తకాలు రాశారు. మైనారిటీల సమస్యల మీద ఆయన రాసిన పుస్తకాలు పార్టీ కార్యకర్తలకు శిరోధార్యం అయ్యాయి. గిరిజన సంఘాన్ని పునరుద్ధరించారు
బర్ధన్ లాంటి నాయకులు పార్టీకి నాయకత్వం వహించడం గర్వకారణం. ఆయన కోరుకున్న శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష పునర్ ఐక్యత సాధించడానికి మనం ఈ శతాబ్ది ఉత్సవం సందర్భంగా మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం.
కామ్రేడ్ బర్ధన్కు రెడ్ సెల్యూట్!
ఒక పర్యాయం, జనరల్ ఎన్నికల ముందు, టాటా ఎన్నికల ట్రస్ట్ నుంచి విరాళంగా డ్రాప్టు తీసుకుని వచ్చారు. దాదాపు 15, 20 లక్షలని గుర్తు. బర్ధన్ వారికి టీ ఇప్పించి కార్పొరేట్ల దగ్గర పార్టీ నిధులు తీసుకోవద్దని, చెప్పి డ్రాప్ట్ వారికి తిరిగి ఇచ్చి పంపేశారు.