డా. యం. సురేష్ బాబు
ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే అంటాడు సినారె, అధ్యాపకులు లేక, రీసర్చ్ గ్రాంటులు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాలలో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లని యూజీసీ ప్రకటించింది. పది సంవత్సరాలుగా దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చలనం లేకుండాపోయింది. విశ్వవిద్యాలయాల పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడులు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలు లేకపోవడం అని గ్రహించగలం. బోధన, పరిశోధన, క్రమశిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అధ్యాపకులను నియమించాల్సిందే. విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది, విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి. అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితంచేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు ఉన్నతీకరించుకోవాలి. విశ్వవిద్యాలయం పరీక్షల్లో అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరంఉంది. వివిధవర్శిటీల్లో అమలులోఉన్న పరీక్షలవిధానం సమగ్ర అధ్యయనంచేసి విద్యార్థులకు లాభం చేకూర్చే పద్ధతిని అవలంబించుకోవాలి.
విద్యా విధానంలో నాణ్యత తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పాలన, ఆర్థిక వనరుల కేటాయింపు, పరిశోధన ప్రగతి, ఏపీఐ స్కోర్, సాధన ఆధారిత అకడమిక్ స్కోర్ వంటి కీలకాంశాలు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉన్నత విద్యాధికారులు ప్రైవేటు విశ్వవిద్యా లయాలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలుఇస్తూ వీటిలో సీట్లు భర్తీఅయిన తర్వాత మొక్కుబడిగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో సీట్ల భర్తీ జూన్ నెలలో ముగుస్తుంది. ప్రభుత్వ వర్సిటీలలో సెప్టెంబర్ అయినా అడ్మిషన్ ప్రక్రియ మొదలవదు. పరిస్థితి ఇలాగేఉంటే 2030నాటికి దేశంలో 80శాతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. ఇప్పటికే గ్రామీణప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలలు కనీసం 30శాతం సీట్లు భర్తీకాక మూసివేశారు. డిప్లొమావిద్య ఇంకా దారుణంగా కేవలం 35శాతం అడ్మిషన్లు అయింది అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. విశ్వవిద్యాలయాలకు మరింత స్వేచ్ఛను అందించినప్పుడే ఉన్నత విద్య, పరిశోధన రంగంలో నాణ్యత మెరుగుపడుతుంది అలాగే దేశీయ విశ్వవిద్యాలయాలలో విద్య పరిశోధన రంగంలో అంతర్జాతీయవిద్య సంస్థలతో పోటీపడాలంటే రీసెర్చ్ గ్రాంట్లు, మైనర్, మేజర్ ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విభాగాలు ఒక్కటీలేదు. దేశంలో ఉన్నత విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు ఇతర అన్ని రంగాలకంటే అత్యల్పంగాఉంది. దేశ స్థూలజాతీయ ఉత్పత్తిలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధులు పెంచడంతోపాటు వివిధ మార్పులకు అవకాశం కల్పించాలి. విశ్వవిద్యాలయాలు గుర్తింపులు ఇవ్వడాన్ని రద్దుచేసి, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకు వచ్చినప్పుడు విద్యారంగంలో నాణ్యతతో కూడిన ప్రమాణాలు మెరుగుపడతాయి.
విద్యారంగానికి దశాబ్దం క్రితం వరకు ఎంతో ప్రాధాన్యం ఉండేది, విశ్వవిద్యాలయాలు సమాజ ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, సిలబస్ నిర్ణయించడంలో, అమలులోకి తీసుకురావడం అధ్యాపకుడిపాత్ర ప్రధానంగా ఉండి, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విలువలు పెంచేదిగా విద్య ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగాఉంది. అధ్యాపకులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలు ఉన్నాయి. లోపం ఎక్కడుంది అనేది గ్రహించకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థిని కేంద్రీకృతం చేసుకొనే పద్ధతి ఈనాడు అవసరం. పారదర్శక విద్యా విధానాన్ని విస్తృతపరిస్తే విద్యార్థి విజ్ఞాన స్థాయి మెరుగుపడుతుంది. సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా ప్రవేశ పెడుతున్న కృత్రిమ మేధ, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అంశాలు అధ్యాపకులు బోధించడానికి అకడమిక్ స్టాఫ్ కాలేజీలులేవు, అధ్యాపకులకు వీటిపై నైపుణ్యత పెంపొందించుకొని బోధిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. పరిశోధన ప్రాజెక్టులు కొన్ని మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి, వాటికి కారణం నిధులు నిలిపివేయడం లేదా తగ్గించడం జరుగుతుంది. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవంలేని విద్య ప్రమాణాలతో నైపుణ్యంలేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెరుగైన జీతాలులేక ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాలే లేక ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు. అజ్ఞాన సమాజంలో వికృత రూపాలతో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, విద్యా రంగంలో నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలుఇచ్చి పర్యవేక్షణ ఏర్పాటుచేసి విలువలతో కూడిన విద్య ప్రమాణాలను తీసుకొని రావాలి.
విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలులేవు. అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీలు మూతపడి దశాబ్దం అవుతుంది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవెలప్మెంట్ కోర్సులుఅన్నీ టీవీలు, కంప్యూటర్ల ద్వారా బోధిస్తున్నారు. విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలానడుపుతారో బోధపడటంలేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడిరచరు, పిహెచ్డీ, వైవా జరపరు. పరిస్థితి ఇలాఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వతంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది. కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ ప్రధానంగా సమాన విద్యావకాశాలులేని నూతన విద్యావిధానం ప్రవేశపెట్టారు. నాలెడ్జ్ సొసైటీలలో ఉన్నత విద్యావ్యవస్థలో విద్యా పరిశోధన అంతర్భాగమని వాస్తవాన్ని సరిగ్గా అంగీకరించింది. ఎప్పటికప్పుడు పరిశోధన తాజా జ్ఞానం కొత్తరంగాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, ఇది బోధనకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షులు