హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. జూలై 5వ తేదీన న్యాకో జారీ చేసిన సర్కులర్ నంబర్ 11025 పట్ల ఆ సంస్థ సిబ్బంది ఆందోళనలో పడుతున్నారు. ఎయిడ్స్ రోగులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిరచిన మహమ్మారిగా పేరున్న హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారదోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కౌన్సిలింగ్ ద్వారా కల్పిస్తున్నారు పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలు లేకపోవడం వల్ల, హెచ్ఐవీ, అనుమానిత, హై రిస్క్ గ్రూప్, వ్యాధి సోకిన వ్యక్తుల ద్వారా చాప కింద నీరు లాగా సమాజంలో మరింతగా ఎయిడ్స్ వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది.
భారతదేశం మొత్తమ్మీద వివిధ రాష్ట్రాలలో 593 ఐసిటిసి కేంద్రాలు ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 40 సమీకృత సలహా, పరీక్ష కేంద్రాలు(ఐసిటిసిలు) మూతపడ నున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేసి అందులో ఉన్న కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని ఐసీటీసీ కేంద్రాలలో సర్దుబాటు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లెవేసే ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడంపై ఉద్యోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి దాదాపు ఇరవై ఎండ్లుగా ప్రతి సామాజిక ఆరోగ్య ఆసుపత్రిలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, సలహాలు, సూచనలతో పాటు ఇతర రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ, కౌన్సిలర్లు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు మూడు దశలలో వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తారు. పల్లెల్లోని ఐసిటీసి కేంద్రాలలో గల కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలో గల ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసీటీసీ కేంద్రాలలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, ల్యాబ్ టెక్నీషియన్లను జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పథకాలు అవగాహన, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. భూపాలపల్లి జిల్లాలో మహదేవ్పూర్, చిట్యాలలోని రెండు ఐసీటీసీ కేంద్రాలను హేతుబద్ధీకరణ పేరిట ఎత్తి వేయనుండడంతో ఆ జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ సేవలు శూన్యం కానున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ మూడు రాష్ట్రాలకు సరిహద్దులో కాళేశ్వరం అంతర్ రాష్ట్ర త్రివేణి వంతెన మీదుగా దట్టమైన దండకారణ్య గిరిజన తాండవాసులకు మహాదేవ పూర్ ఐసీటీసీ కేంద్రం సేవలు అందిస్తున్నది. భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ కాలేజీగా అవతరించనున్నప్పటికీ భూపాలపల్లిలో ఐసీటీసీ కేంద్రం సేవలు లేకపోవడం గమనార్హం.
రావుల రాజేశం, 9848811424