రావుశ్రీ
దాదాపు గత ఐదు దశాబ్దాలుగా ధరిత్రి దినోత్సవం అని, ప్రపంచ జల దినోత్సవం అని, పర్యావరణ దినోత్సవం అని ప్రపంచ దేశాలతో సహా మన భారతదేశంలోనూ జరుపుకుంటున్నారు. కానీ ఆ దినోత్సవాల ఆశయాలు దిశగా పయనం ఉన్నదా… అంటే దాదాపు లేనట్లే కనపడుతుంది. దీంతో భూమి మీద అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. పారిశ్రామికీకరణ వలన అడవులు నరికివేత, వివిధ రకాల కాలుష్యాలు పెరగటం, ఆధునీకరణ పేరుతో పట్టణాలు నగరాలు జనాభాతో కిటకిట, హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడులు నిమిత్తం వాడే ఎరువులు, పురుగుమందులు వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. అవసరాలకు మించి భూగర్భ జలాలు తోడివేయటం, ప్లాస్టిక్ వాడకం పెరుగుట ద్వారా మొత్తం జల వ్యవస్థని ప్రశ్నార్థకం చేస్తుంది.. దీనికి తోడు చెరువులు, కుంటలు, బావులు అక్రమణలకు గురవడం వల్ల భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో మొత్తం మెట్రో నగరాల్లో తాగునీటికి కటకట ఏర్పడిరది… బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి. దీనికి కారణం మానవ తప్పిదాలే అని ఇకనైనా అందరూ గుర్తించాలి.
దక్షిణ ఆఫ్రికా రాజధాని కేప్టౌన్ ఎంత నీటి ఎద్దడిని అనుభవిస్తుందో… త్వరలో మనదేశంలో చాలా నగరాలు, పట్టణాలు నీటి బాధిత నగరాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, దేశ రాజధాని న్యూదిల్లీలో మంచినీరు కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం… దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటి పోవడమే. మితిమీరిన జనాభా, అవసరాలకు మించి నీటి వినియోగం, బోరుబావులు ఎక్కువగా వేయడం. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు పెరగడం వలన వాతావరణ మార్పులు సంభవిస్తూ, కాలాలు గతులు తప్పుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూదిల్లీలో కూడా గత 120 సంవత్సరాల క్రితం రికార్డు అయిన ఉష్ణోగ్రతలను బ్రేక్ చేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. భవిష్యత్తులో మరింత నీటి ఎద్దడిని ఎదుర్కోనే పరిస్థితులు కనపడు తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు, స్థానిక పాలనా యంత్రాంగం, నీటి వనరులశాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా అడవులు రక్షించుకోవాలి. మొక్కలు పెంచాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. బోరు బావులుపై నియంత్రణ ఉంచాలి. పట్టణ పరిపాలనశాఖ, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా పనిచేయాలి. ప్రతీ పౌరుడు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. నీటిని వృధా చేయరాదు. చెరువులు కుంటలు పూడికలు తీయాలి. అక్రమాలను తొలగించాలి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం, నియమనిబంధనలు అనుసరించి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలి. ప్రకృతి వనరులు దోపిడిపై నిఘా పెంచాలి. వ్యర్ధాలు నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. వలసలు నియంత్రణ చేయగలిగితే చాలావరకూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో, సహకారంతో పనిచేయుట ద్వారానే నీటి సమస్యలను అధిగమించగలం. అదే విధంగా రాష్ట్రాలమధ్య నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగాలి. సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. నదులు కాలుష్యం తగ్గించాలి. పూడికలు తీయాలి. కాలువలు చెరువుల నిర్వహణకోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్ని ప్రాంతాల్లో లభించే విధంగా పరిశ్రమలు, వ్యవస్థలు నెలకొల్పటం ద్వారా, ఒకేచోట జనాభా కేంద్రీకరణ తగ్గించటం తద్వారా మెట్రో నగరాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.