రా బావ ఏంటి నేను మారాను అంటూ వస్తున్నావు. అవును యథారాజా తథాప్రజా అన్నారు. రాష్ట్రాన్ని పాలించె ముఖ్యమంత్రి మారితె తదనుగుణంగా ప్రజలంతా మారాలి కదా. అందుకె నేను మారాను అంటున్నా. ఆయన పరిపాలన విషయంలోనె మారాను అంటున్నాడు. మొన్న క్యాబినెట్ మంత్రివర్గ కూర్పు అందుకు నిదర్శనం. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలో బుచ్చయ్య చౌదరి లాంటి వారిని సైతం దూరంపెట్టి మార్పు ప్రజలకు అర్థమయ్యేలా చూపాడు. సరె ఈ మార్పు అయిదేళ్లు నిలవాలి కదా. ఎన్నికల మానిఫెస్టో అమలు చెయ్యాలి. పెన్షను పెంపు, స్త్రీలకు ఉచిత బస్సు లాంటి వన్ని అమలు చెయ్యాలి. నిజమె ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఒక రకంగా చంద్రబాబును అదృష్టం వరించింది. అదేమిటంటే బీజేపీకి పూర్తి మెజారిటీరాక బాబుపైన ఆధారపడటం. గతంలో జగన్ అవసరం బీజేపీకి లేదు. అయినా సొమ్ముల కోసం మోదీని అంటకాగవలసి వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. మోదీయే బాబుపై ఆధారపడవలసి వచ్చింది. నిజమె ప్రస్తుతం రాఫ్ట్ర అవసరాల కోసం జగన్ బతిమాలితె ఇప్పుడు బాబు డిమాండ్ చేయవచ్చు. అందుకె ప్రత్యేక హోదా డిమాండుకు యిది సరైన సమయం. గతంలో ప్యాకేజి అడిగిన చంద్రబాబు ఈసారైనా హోదా కోసం డిమాండు చేయాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. రాజకీయ మేధావిగా చంద్రబాబు గణుతికెక్కారు. ఆ మేధావితనం ఉపయోగించి హోదా సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఆయన వారసుడుకు, భవిష్యత్తుకు ఢోకా ఉండదు. బాబు తెలివిగలవాడు కనుక ఈ అయిదేళ్లు నిర్విరామ కృషితో అభివృద్ధిచేసి కుమారునికి పూలబాట ఏర్పాటు చేయవచ్చు. వచ్చే 2029 ఎన్నికల నాటికి 80 ఏళ్ల వయసులో తిరగలేకపోయినా ఈ అయిదేళ్ల అభివృద్ధి మరల అందలం ఎక్కించగలదు. ఆ విధంగా తనయునికి పూలబాట ఏర్పాటుచేసి విశ్రాంతి తీసుకోవచ్చు. వీటన్నింటికి మూలం ఈ అయిదేళ్ల అభివృద్ధే అనే సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. నిజమె బావ కొడుకు భవిష్యత్తు కోసమైనా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం నాకుంది. అది సరె ముఖ్యమంత్రుల స్లోగన్లు గమ్మత్తుగా ఉన్నాయి. నేను వున్నాను విన్నాను అని జగన్ అంటె నేను మారాను నన్ను నమ్మండి అని చంద్రబాబు అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు తెలివిగ ఆలోచించి ఓటు వేస్తున్నారు. జగన్కు ముందు చంద్రబాబు పాలన నచ్చక జగన్కు ఓటు వేశారు. ప్రస్తుతం నేను మారాను అన్న బాబును, ఆయన మానిఫెస్టో నమ్మి బాబుకు ఓటు వేశారు. గతంలో కంటె ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ఉన్నవాడు, లేనివాడు అని రెండు వర్గాలుగా సమాజాన్ని విభజించారు. లేనివాళ్ల కోసం కమ్యూనిస్టులు పాటుబడ్డారనేది నిర్వివాదాంశం. కాని ప్రస్తుతం సమాజాన్ని అనేక వర్గాలుగా విభజించారు. సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఆలోచించడం మానివేశారు. ప్రతివాడు నాకేంటి, నాకేం చేసింది ఈ ప్రభుత్వం అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ స్వార్థం బలపడుతున్న కొద్ది వర్గ దృక్పథం పెరుగుతూ వస్తోంది. ఒక వర్గానికి ప్రభుత్వం మేలు చేస్తె మిగతా వర్గాలకు కోపం. ప్రస్తుతం జగన్ చేసిన తప్పు అదేననిపిస్తోంది. అభివృద్ధిని పక్కనపెట్టి పేదల గురించి మాత్రమె ఆలోచించాడు. దాంతో మిగతా వర్గాలన్నీ దూరమయ్యాయి. అటెండరు దగ్గర నుంచి ఐఎఎస్ వరకు, టీచర్లు, పోలీసులతో పాటు అందరు జగన్కు దూరమయినట్లు ఎన్నికల ఫలితాలు చెప్పకనె చెప్పాయి. రెండు కోట్ల ప్రజలకు మంచి చేశానని ఎందుకు ఓటేయలేదని జగన్ బాధపడ్డాడు. దానిపై ఒక ఉద్యోగి స్పందిస్తూ అది నిజమె కాని యింకా మూడు కోట్ల జనాభా వ్యతిరేకించారని వ్యాఖ్యానించాడు. పథకాలు పొందిన కుటుంబాలలో కూడ స్త్రీలు వేసినా పురుషులు వేయలేదని అక్కడక్కడా వినిపిస్తోంది. అందుకు కారణం నిత్యావసర వస్తువుల ధరలతో పాటు రోజంతా కష్టపడి కష్టాన్ని మర్చిపోవడానికి తీసుకునే లిక్కరు 50 రూపాయల నుండి 200 వరకు పెరగడంతో పథకాలందుకున్న కుటుంబాలలో కూడ మగవారు వేయలేదనె వినిపిస్తోంది. ఏది ఏమైనా సంక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉంటేనె అందరి మన్ననలు పొందగలడు. లక్షల జీతం తీసుకునేవారైనా సరె వారికి రావలసిన బకాయిలు చెల్లించకపోతె నిరసన తప్పదనె విషయం కూడ తేటతెల్లమయింది. అందుకె వర్గ విభజనతో ఉన్న సమాజంలో అన్ని వర్గాల వారి గురించి ఆలోచించి అందరిని తృప్తిపరచకపోతె స్వార్థంతో నిండిన ఈ సమాజంలో జరిగేది యిలాగె ఉంటుంది. ప్రతి మనిషి నాకేంటి అని కాక సమాజ శ్రేయస్సు ముఖ్యమని భావించే రోజు వచ్చే వరకు అన్ని వర్గాలను తృప్తి పరిస్తేనె నిలబడగలరు.