డాక్టర్ అరుణ్మిత్ర
ఇజ్రాయిల్ ఏర్పడిన నాటినుండి అమెరికా ఆ దేశానికి అండగానే నిలిచి ఆయుధాలు విక్రయించడం, ఆర్థిక సహాయం చేయడం ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. దాదాపు ఏడు నెలలుగా ఇజ్రాయిల్ పలస్తీనాపై దాడులుచేసి అక్కడి ప్రజలను హింసించడాన్ని నిరసిస్తూ అనేక దేశాలు ప్రదర్శనలు చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఫిర్యాదుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తక్షణం కాల్పుల విరమణ జరపాలని ఇజ్రాయిల్ను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ పలస్తీనాపై దాడులు సాగిస్తూనే ఉంది. అమెరికా ఒకవైపు ఇజ్రాయిల్కు అవసరమైనన్ని ఆయుధాలను విక్రయిస్తూ, ఆర్థికసహాయం కూడా అందిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును అరెస్టు చేసేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం వారెంటు జారీచేయాలని ఆ కోర్టు ప్రాసిక్యూటర్ డిమాండ్ చేస్తున్నారు. యుద్ధ నేరస్థులుగా పరిగణించి నెతన్యాహును అలాగే హమాస్ నాయకులను అరెస్టు చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ సందర్భంలో బైడెన్ నెతన్యాహును అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల్లో ప్రసంగించడానికి ఆహ్వానించడం ఆయన ద్వంద్వ విధానమే. కేవలం మాటవరసకు మాత్రమే కాల్పుల విరమణ జరపాలని ఇజ్రాయిల్ను కోరారు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున ఈ సూచన చేశారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయిల్ దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ పలస్తీనాకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నెతన్యాహును తమ దేశానికి బైడెన్ ఆహ్వానించడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే నెతన్యాహుకు ఇది పెద్ద గౌరవంగా భావిస్తున్నారు. ఇంతవరకు పలస్తీనా మహిళలు, పిల్లలతో సహా 40వేల మందికిపైగా హతమార్చిన దుర్మార్గం నెతన్యాహుకు దక్కింది. ఈ విధంగా మారణకాండ జరపడం అమెరికాకు అలవాటైన విద్య. ఇరాక్పైన దాడిచేసి కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర అమెరికాదే. హమాస్నుంచి రక్షణకోసం అంటూ ఇజ్రాయిల్ విజ్ఞప్తిపై అమెరికా అనేక వందల డాలర్ల విలువైన భయంకరమైన ఆయుధాలను సరఫరా చేసింది.
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును ఇజ్రాయిల్ ఖండిరచడం దాని అహంకారానికి ప్రతీక. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ నెతన్యాహును, ఇతరయుద్ద నేరస్థులను అరెస్టు చేయాలని అందుకు వారెంట్లు జారీ చేయాలని దరఖాస్తు చేశారు. ఇజ్రాయిల్ భద్రతకు ముప్పు ఉందనే సాకుతో అమెరికా ఎల్లవేళలా ఆయుధాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ నెతన్యాహును అరెస్టుకు వారెంటు చేయాలని దరఖాస్తు పెట్టడం దారుణమని అమెరికా వ్యాఖ్యానించడం దాని పెత్తనానికి తార్కాణం. అమెరికా విదేశాంగమంత్రి ఆంథోని బ్లింకెన్ మాట్లాడుతూ, ఇజ్రాయిల్ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు తాము అండగా నిలుస్తామని అన్నారు. పైగా ఇజ్రాయిల్, హమాస్లను ఒకే విధంగా చూడడం సరికాదనికూడా అన్నారు. పైగా అంతర్జాతీయ కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కులేదని బ్లింకెన్ మరింత దారుణంగా మాట్లాడారు. మానవహక్కుల అటార్నీ అమల్ క్లూని ఒక ప్రకటనలో ఇలా తెలిపారు. అరెస్టు వారెంటు జారీచేయాలని ప్రాసిక్యూటర్కు కూడా సూచించారు. ఒక దేశ పౌరుల ప్రాణాలను రక్షించేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు జోక్యం చేసుకోవలసిందేనని నేనుఅభిప్రాయపడుతున్నాను. 100 సంవత్సరాలకుపైగా శాంతిభద్రతలను కాపాడి, పౌరులను రక్షించాలనే విధానం కొనసాగుతున్నది. ఏకారణం చేతనైనా ఘర్షణ జరిగినప్పటికీ ఈ విధానం పాటించవలసిందేనని క్లూని తెలిపారు. క్లూని భార్య జార్జిక్లూని కూడా న్యాయాన్ని పరిరక్షించవలసిందేనని తమ ఫౌండేషన్ తరఫున లేఖ రాశారు.
వామపక్షవాది, వెర్మాంట్ నుంచి ఎన్నికైన అమెరికా సెనేటర్ ప్రముఖ రాజకీయవేత్త శాండర్స్ నెతన్యాహును అహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శించారు. అయన యూదుజాతికి చెందిన వాడైనప్పటికీ ఇజ్రాయిల్ దాష్టీకాన్ని ఖండిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ కోర్టు తీర్పును శాండర్స్ సమర్థించారు. నెతన్యాహు యుద్ధ నేరస్థుడని విమర్శించారు.
నెతన్యాహు సంయుక్త సభలో మాట్లాడేటట్లయితే తానుహాజరు కాబోనని అన్నారు. పలస్తీనా నాయకత్వాన్ని, పలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్లకు వ్యతిరేకంగా హమాస్ను నెతన్యాహు ప్రోత్సహించని విషయం అందరికీ తెలుసునని శాండర్స్ అన్నారు. హమాస్ను ప్రోత్సహించిన విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పత్రికలో 2023 అక్టోబరు 8వ తేదీన రాజకీయ విలేకరి తాల్ ష్నీడెర్ వ్యాసం రాశారు. హమాస్ ఒక టెర్రర్ గ్రూపుగా ప్రకటించడం దారుణమని ఆయన తమ వ్యాసంలో పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లోనూ, వెస్ట్బ్యాంకును పాలిస్తున్న నాయకత్వంపై హమాస్ను రెచ్చగొట్టిన మాట వాస్తవమని ఆ వ్యాసంలో ష్నీడెర్ పేర్కొన్నారు. కాల్పుల విరమణకు, గాజాపై యుద్ధానికి అంతం పలకాలని అమెరికా చేసిన ప్రతిపాదనను ఇజ్రాయిల్ తిరస్కరించింది. కాల్పుల విరమణకు చర్చలద్వారా ఒప్పందం కుదుర్చుకునేందుకు హమాస్ సిద్ధంగానే ఉంది. రెండుసార్లు చర్చలు జరిపి కాల్పుల విరమణకు తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయిల్ ఉల్లంఘించి దాడులు చేస్తూనేఉంది. హమాస్ను పూర్తిగా నిర్మూలించేవరకు తాము యుద్ధం కొనసాగిస్తామని నెతన్యాహు అనేకసార్లు ప్రకటించాడు. నియంత హిట్లర్ కంటే నెతన్యాహు ఏమాత్రం తగ్గడని నిరూపించుకుంటున్నాడు. చిత్తశుద్ధితో చర్చలకు నెతన్యాహు ముందుకు వచ్చినట్లయితే హమాస్ అధీనంలో ఉన్నబందీలను ఎప్పుడో విడుదల చేసేవారు. తాజాగా రఫా ప్రాంతంపై దాడులు సాగించి విధ్వంసం సృష్టించవద్దని అంతర్జాతీయంగా అనేక విజ్ఞప్తులు, సూచనలు వచ్చినప్పటికీ నెతన్యాహు ఏమాత్రం వినిపించుకోవడంలేదు. పలస్తీనా ప్రజలు ఆకలి, దప్పులకు, వ్యాధులకు లోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదిసరైనదికాదని ఐక్యరాజ్యసమితి అనేకసార్లు తీవ్రంగా హెచ్చరించినప్పటికీ నెతన్యాహు ఏమాత్రం పట్టించుకోలేదు. అనేక ఆసుపత్రులను నాశనంచేసి ప్రజలకు వైద్యసహాయం కూడా అందకుండా చేస్తున్నాడు. చివరికి గాజా ప్రాంతంనుంచి దూరంగా తరలిపోయి శిబిరాలు నిర్మించుకుని ఉంటున్న పిల్లలు, మహిళలపై కూడా కనికరం లేకుండా బాంబు దాడులు సాగించిన దుర్మార్గం చూస్తూనే ఉన్నాం. చివరకు ఐక్యరాజ్యసమితి సహాయ కార్మిక ఏజన్సీకి చెందిన 189 మంది సిబ్బందిని కూడా హతమార్చారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి శాశ్వత పరిష్కారం చేయవలసిన సందర్భం ఇది.