టి.వి.సుబ్బయ్య
ఉత్తరప్రదేశ్లో ప్రజల అభిప్రాయాలలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 80 లోక్సభ నియోజకవర్గాలుండగా 2014 నుంచి బీజేపీ అత్యధికంగా సీట్లు (2019లో 62 సీట్లు) గెలుచుకుని కేంద్రంలో అధికారం చేపడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంకుశపోకడలతో అధికారం చెలాయిస్తున్నారు. ఈ సారి మోదీ అహంకారం, ద్వేషం, అణచివేతల చర్యలపై ప్రజల ఆగ్రహంతో బీజేపీ అతి తక్కువ సీట్లలో గెలిచింది. ఇండియాకూటమి (కాంగ్రెస్, సమాజ్వాది) 43 సీట్లు గెలిచింది. యూపీ రాజకీయ రంగంలో పెద్దమార్పు వచ్చింది. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయి దళితఅభ్యర్థి అవదేశ్ ప్రసాద్ గెలుపొందారు. ఆయన విజయానికి మోదీ తీసుకున్న పేదల వ్యతిరేక చర్యలు, తొలినుంచి అనుసరిస్తున్న పంధా కారణాలు. రామాలయ నిర్మాణానికి ఈ ప్రాంతంలో దాదాపు ఐదారు వేలమంది గుడిశలు, ఇతర కట్టడాలు, చిన్నచిన్న వ్యాపారుల షాపులు, ఇళ్లు కూలగొట్టడం ఈ ఎన్నికల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతకు ప్రధాన కారణం. ఈ ప్రాంతంలో అత్యధికులు రామాలయాన్ని సందర్శించారు. వీరు రాముడిని ఆరాధించే వారే. ఇళ్లు ఖాళీ చేసిన వారికి కనీసం నష్టపరిహారం చెల్లించలేదు.
రాష్ట్రంలో తమకు గిట్టని మైనారిటీల ఇళ్లపైన బీభత్సచేసి సృష్టించారు. బుల్డోజర్లతో దాడిచేయించి ఇళ్లను కూలగొట్టారు. బుల్డోజింగ్ను దిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితరచోట్ల చేశారు. బాల రాముడి విగ్రహప్రతిష్ట అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు ఉపయోగించడంపైన వ్యతిరేకత ఏర్పడిరది. రామాలయం నిర్మాణంపై మోదీ ఆశలు వమ్ముఅయ్యాయి. అంతేకాదు, మోదీ తాను దైవదూతనని ప్రచారం చేసుకోవడంపై వ్యతిరేకత వచ్చింది. సామాన్య ప్రజల్లో 80శాతం హిందువులే. అయినప్పటికీ దైవభక్తిని రాజకీయాలతో ముడివేసి ప్రయోజనం పొందాలని మోదీ ఆశించారు. ప్రజలు దీన్ని తిరస్కరించారు. ఫైజాబాద్లో బీజేపీ అభ్యర్థి లల్లసింగ్ ఎన్నికల ప్రచారసభల్లో తమ పార్టీ 400 స్థానాలలో గెలిచినట్లయితే, రాజ్యాంగాన్ని మార్చి వేస్తామని చెప్పడంతో ప్రజలు వ్యతిరేకించారు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని చూపిస్తూ దాని ప్రాధాన్యతను, ఇండియా కూటమి అధికారానికివస్తే రాజ్యాంగాన్ని రక్షిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే కులగణన చేయించి దాని ప్రకారం తగిన ప్రయోజనాలను కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు, ఇతర వనరులు దామాషా ప్రకారం పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు (పీడీఏ) సమీకరణ పథకాన్ని ఎస్పీ అధినేత అఖిలేష్యాదవ్ రూపొందించి అమలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కాన్షీరామ్ ప్రభావంఉంది. డా.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దుచేయడానికి అంగీకరించబోమన్న అభిప్రాయాన్ని దళితులు ఓటు ఆయుధం ద్వారా వ్యక్తం చేశారు.
యూపీలోని ఆరు ప్రాంతాల్లో ఓటర్లు భిన్నంగా ఓటు చేశారు. సంపన్నమైన పశ్చిమప్రాంతం, బ్రజ్ప్రాంతంలో ఎన్డీఏ ఎక్కువగా ఎంపీలను గెలిపించారు. పూర్వాంచల్, అవధ్ ప్రాంతాల్లో ఓటర్ల స్పందన మిశ్రమంగా ఉందని అంచనావేశారు. పేదలు ఎక్కువగా నివసించే బుందేల్ఖండ్, రోహిల్ఖండ్ ప్రాంతాల్లో ఇండియాకూటమి అభ్యర్థులు అత్యధికంగా గెలిచారు. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం చాలావరకు దారుణ పరిస్థితులను ఎదుర్కొని రైతులు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో లఖింపూర్వద్ద ఆందోళనచేస్తున్న రైతుల మీదనుంచి కేంద్రమంత్రి కొడుకు కారు నడిపి నలుగురు రైతుల మృతికి కారణమయ్యాడు. కొన్ని నెలల వరకు మంత్రి కొడుకును అరెస్టు చేయలేదు. అతనిపై కేసును ఏమిచేశారో తెలియదు. కేంద్రమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వారణాసిలో మోదీ గత ఎన్నికల్లో దాదాపు ఐదులక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందగా, ఈసారి లక్షన్నర ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. బీజేపీ పట్ల ప్రజల స్పందన ఎంత తక్కువగా ఉందో స్పష్టమైంది. నగరప్రాంతాల్లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా, గ్రామీణప్రాంతాల్లో వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ఎక్కువగా గెలిపించారు. ఎగువ, దిగువ, మధ్యతరగతి, ఒక మాదిరి సంపన్నులు, బిలియనీర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నారు. ఒకవైపు వస్తువుల ధరలు గత పదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న జీవనవ్యయంతో సమంగా వేతనాలు, శ్రమజీవుల కష్టార్జితం పెరగడంలేదు.
పదేళ్లుగా ముస్లింలపట్ల ద్వేషం, చర్చిల కూల్చివేత, వేయికిపైగా ఎన్కౌంటర్లు, బుల్డోజింగ్ ఘటనలు, దళిత మహిళలపై అత్యాచారాలు, ఇతర అరాచకాలు, అసహనం లాంటివన్నీ బీజేపీపై తీవ్రవ్యతిరేకతకు కారణమయ్యాయి. రామాలయం, హిందుమతం లాంటివి తమను గెలిపిస్తాయనుకున్న మోదీ ఆశలు తల్లకిందులయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సైతం నియంతలాగానే పాలించారు. అనేక పదుల నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు వందలు, వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారని అనధికార వార్తలు తెలియజేస్తున్నాయి. యూపీలో ముస్లిం ప్రాంతాల్లో ఓట్లు వేయడానికివచ్చిన వారిని పోలీసులు బెదిరించి తరిమికొట్టారు. అలాగే ముస్లింలు అధికంగా ఉన్న గ్రామాల్లోకి పోలీసులు వెళ్లి ఇళ్లల్లోకి దూరి హింసాకాండకు పాల్పడిన ఘటనలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆరాచకాలతో ప్రజాభిప్రాయం మారిపోయిందని విశ్లేషిస్తున్నారు.