శభాష్. ఇదీ చంద్రబాబు మార్కు రాజకీయం. చంద్రబాబు చాణక్యం. యుద్ధంలో అస్త్రశస్త్రాలను వాడిన తర్వాత, విజయం వరించినవేళ తన వారికోసం రాజ్యస్ధాపన, విస్తరణ వంటివే రాజు చేయాల్సిన అతి ముఖ్యమైన రాజనీతి. చంద్రబాబు నాయుడు అదే పనిచేశారు. తన కుమారుడు నారా లోకేశ్కు భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తొలిరోజే వారసత్వ ఫైలుపై ఎవరికీ కనిపించని, ఊహించని, విజయోత్సవాల సందడిలో కానరాని సంతకం చేశారు చంద్రబాబు. అవును, ఈ సంతకం ఎవరికీ కనిపించదు. ఈ సంతకం వల్ల తమకు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని ఎరుకలోకి వచ్చిన సీనియర్ తమ్ముళ్లకు మాత్రమే ఇది కని పిస్తుంది. ఇది తెలిసినా, అర్ధం అయినా మౌనమే నీ భాష ఓ మూగ మనసా అనే పాటనే వాళ్లంతా పాడుకోవాల్సిన స్థితిలోకి నెట్టేశారు చంద్రబాబు నాయుడు. కొత్త క్యాబినెట్లో పాత విధేయులు లేరు. సీనియర్లు లేరు. కొత్త చంద్రబాబు ఎలా ఉంటారో ప్రజలకు కాదు, ముందుగా తెలుగుదేశం నాయకశ్రేణికి చూపించారు ఆయన. తప్పు లేదు. తప్పూ కాదు. తన వారసుడిగా లోకేశ్కి వ్యాపార, కుటుంబ వారసత్వాలతోపాటు తనది మాత్రమే అయిన స్వార్జిత ఆస్తి రాజకీయాలను కూడా ప్రమాణస్వీకార వేదికపై ధారాదత్తం చేశారు. ఏ తండ్రైనా ఇలాగే చేస్తారు. ఇలాగే చేయాలి అనుకుంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు. అనేకానేక వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఇబ్బందులు పెడతారు. కేవలం సీనియర్లు అనే ఒకే ఒక్క మాటతో మోకాలడ్డుతారు. అమెరికా నుంచి సరాసరి తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేశ్కు వైరి పక్షాల రాజకీయాలను ఎదుర్కోవడం కంటే స్వపక్షంలో సవాళ్లను ఎదుర్కోవడమే కష్టతరమైంది. ప్రజల నుంచి ఎన్నిక కాకుండా దొడ్డిదారిన శాసనాలయంలోకి, ఆపై మంత్రి మండలిలోకి ప్రవేశించి తమపై ఆధిపత్యం చూపుతున్నారని సీనియర్ తమ్ముళ్లు ఐదేళ్లక్రితమే నొక్కిన సన్నాయ నొక్కుళ్లు ఆనాటి పసికూన లోకేశ్ మరచిపోతారేమో కాని కాకలు తీరిన చంద్రబాబు నాయుడు ఎలా మరచిపోతారు. ఎందుకు మరచిపోతారు. అలా మరచిపోలేదు అని చెప్పడమే కొత్త ప్రభుత్వంలో కొత్త క్యాబినెట్ కూర్పు. శాసనసభల నియమ నిబంధనల భగవద్గీత ‘‘కౌల్ అండ్ షర్దర్ రూల్ నంబర్ ఫలానాలో ఇలా ఉంది అధ్యక్షా’’ అంటూ గతంలో అనేకసార్లు చెప్పిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు శాసనసభలో మంత్రిగా కానరారు. ఆయన స్థానంలో కుమార్తెను చూస్తాం. ఆమెకు తండ్రి రామకృష్ణుడు రూల్స్ నేర్పించే అవకాశమే తప్ప రూల్ చెప్పే వీలు కాదు. రూల్స్ పుస్తకం మొత్తం తెలియకపోయినా తన శాఖకు సంబంధించిన అంశాన్ని అధికారుల నుంచి తెలుసుకుని సభలో మాట్లాడిన అయ్యన పాత్రుడు ఇప్పుడు కౌల్ అండ్ షర్దర్ పూర్తిగా చదివి బట్టీయం పట్టినా ఆయనకే తప్ప నర్సీపట్నం ప్రజలకి కాని, ఉత్తరాంధ్ర సమాజానికి కాని ఎలాంటి ఉపకారంలేదు. తన సన్నిహితుల దగ్గర ‘‘మరింకేటి సేత్తాం. మన టైం అయిపోయింది గదేటి. కొత్త వారికి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తాం’’ అని చెప్పుకోవడమే మిగిలింది. గులకరాయి బూటకమని ప్రజలు తేల్చేశారు కానీ, సీనియర్ నాయకుడు బొండా ఉమకు ఆ గులకరాయి పెద్ద బండరాయిగా మారిందని తెలీదనుకుంటామా. విజయ పరంపరలో చంద్రబాబు నాయుడికి బ్రూ కాఫీలా ఇంచుమించు సరిసాటి అయిన గోరంట్ల వారి అబ్బాయి బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి మళయాళ సినిమా తెలుగులో డబ్చేసి విడుదల చేసినప్పుడు పెట్టిన పేరులా ఓ తీరని కల. గత ఎన్నికలవరకూ, ఆపై ఏర్పడ్డ మంత్రివర్గ కూర్పునకు నిమ్మకాయల చినరాజప్ప విధేయతకు కలిసొచ్చిన కాలం. అలాగని, చంద్రబాబు నాయుడికి విధేయతను మరచిపోయే గుణం లేదని కాదు. ఉంది. పుష్కలంగా ఉంది. కాకపోతే చినరాజప్ప విధేయతకు ఎక్స్పేయిరీ డేట్ ఇచ్చారాయన. కొత్తగా వైసీపీ నుంచి వచ్చి తమ విధేయతను చాటుకున్న ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధికి ఈ సారి అవకాశం ఇచ్చారు విధేయుల కోటాలో. ఇదే ఆధునిక రాజకీయమంటే. ఇలాగే ఉండాలి కూడా. ఇలాగే ఉంటుందని చెప్పాలి కూడా. చంద్రబాబు నాయుడు అదే పని చేశారు. కొత్తగా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడిన వారి సిలబస్లో చంద్రబాబునాయుడు రూపంలో దొరికిన ఒకే ఒక్క పుస్తకం చంద్రబాబే. రెండు వైపులా పదునున్న కత్తి, చట్టం తన పని తాను చేసుకుపోతుందనే మాటలకు వివిధ అర్ధాలు చెప్తారు. కాని నిజమైన అర్ధం చంద్రబాబు నాయుడుకే తెలసు. యుద్ధంలో సీనియర్ కత్తులకు మెరుగుపెట్టి వాడారు చంద్రబాబు. అయితే, అవి మెరుగు పెట్టినవే తప్ప సహజ మెరుపులు ముగిసిపోయాయని గ్రహించారు. అందుకే, యుద్ధానంతర సభలో ఆ మెరుగులు కానరాకుండా చేశారు. ఇక రెండోమాట గురించి అయితే, విపక్షం సరే, స్వపక్షంలో కూడా తన వారసుడ్ని ఎద్దేవా చేసిన వారి కళ్లు తిరిగేలా లోకేశ్ కాళ్లు తిప్పారు. అదే పాదయాత్ర పేరుతో. పప్పు అన్న వారికి దాని వెనుక నిప్పు ఉంది అని చూపించారు. ఇదీ చంద్రబాబు నాయుడు అంటే. ఆయనే చేసిన చాణక్యం. ఆయనే చేయదగిన చాణక్యం. ఇక తెలుగుదేశంలో సీనియర్ల పప్పులు ఉడకవు. వారి దగ్గర నిప్పులు లేవు. వయోభారంతో వచ్చిన అనుభవాన్ని తలచుకోవడం, వారి వారసత్వానికి దాన్ని నేర్పించడమే వారి ముందున్న కర్తవ్యం. చివరిగా కాదు కానీ, ఓ డౌట్ అనుమానం వెంటాడుతోంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని, గవర్నర్లతో కలిసి క్యాబినెట్ సభ్యులు దిగిన ఫొటోచూస్తేనే అనుమానం వస్తోంది. ప్రధాని, గవర్నర్, చంద్రబాబునాయుడితో సహా కూర్చున్న వారు, వారి వెనుక నిలుచున్న మంత్రులు ఒద్దికగా, వినయంగా నవ్వులు చిందిస్తున్నారు. ఒక్క జన సేనాని, నూతన మంత్రి పవన్కల్యాణ్ మాత్రం తన సహజ నిర్లక్ష్యాన్ని చూపిస్తూ కెమెరా వైపు కాకుండా మరోవైపు చూస్తున్నారు. ఈ చూపుని చంద్రబాబు నాయుడు గమనిస్తారా… లేదా. ఏమో… చాణుక్యుడు కదా… ఏదైనా జరగవచ్చు.
సీనియర్ జర్నలిస్ట్,
సెల్: 99120 19929