కె.వి.వి. ప్రసాద్
ఆ రోజు రైతులు తమ పశువులను, వ్యవసాయ పనిముట్లను అలంకరించి నవధాన్యాలను విత్తుతారు. తమ భూములలో మంచి పంటలు పండాలని ప్రార్ధిస్తారు. భూమితో పాటు పశువులకు, వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహిస్తారు. తమ పొలాల్లో ఎద్దులతో నాగలికట్టి దుక్కి దున్నటాన్ని ‘‘ ఏరువాక’’ అంటారు. ఏరు అంటే ఎద్దులను అరక కట్టి దున్నడానికి ఆరంభమని పెద్దలు చెబుతారు. నాగలి సారించి పనులు ప్రారంభించడానికి ఏరువాక రోజు మంచిరోజుగా రైతాంగం భావిస్తారు.
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా…… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా…..
అంటూ వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యాతను ఒక కవి ఏనాడో వివరించారు. రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనందడోలికల్లో తేలియాడే ఓ మహోత్సవం ఏరువాక. పూర్వకాలం నుంచి మన వ్యవసాయం రుతువులు, నక్షత్రాల ఆధారంగా జరిగేది. ఏరువాక పూర్ణిమ రోజు రైతులు అరకలుకట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. వర్ష రుతువులో తొలకరి జల్లుల ఆగమనంతో మన రైతులు ఆనందోత్సహాల మధ్య పొలం దున్ని వ్యవసాయ పనులు తొలిసారిగా ప్రారంభించే పక్రియ ఈ ఏరువాక.
ఆ రోజు రైతులు తమ పశువులను, వ్యవసాయ పనిముట్లను అలంకరించి నవధాన్యాలను విత్తుతారు. తమ భూములలో మంచి పంటలు పండాలని ప్రార్ధిస్తారు. భూమితో పాటు పశువులకు, వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహిస్తారు. తమ పొలాల్లో ఎద్దులతో నాగలికట్టి దుక్కి దున్నటాన్ని ‘‘ ఏరువాక’’ అంటారు. ఏరు అంటే ఎద్దులను అరక కట్టి దున్నడానికి ఆరంభమని పెద్దలు చెబుతారు. నాగలి సారించి పనులు ప్రారంభించడానికి ఏరువాక రోజు మంచిరోజుగా రైతాంగం భావిస్తారు. రైతులు ఉదయాన్నే ఎద్దులను శుభ్రంచేసి వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కాడి, మేడి, నాగలిని పూజిస్తారు. ఎద్దులకు బొబ్బట్లు తినిపిస్తారు. సాయంకాలం ఎడ్లను అలంకరించి ఊరేగిస్తారు. పశువులు అంటువ్యాధుల బారిన పడకుండా ఆయుర్వేద మందులు, నూనెలను తాగిస్తారని చెప్తారు.
ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించి ప్రాధాన్యత కలిగిన పండుగగా ప్రాచీనకాలం నుంచి భావిస్తారు. ప్రకృతి పూజించే పండుగగా గ్రామీణ ప్రజలు ఏరువాకకు ప్రత్యేకతనిస్తారు. తొలకరి జల్లులు అసన్నమవగా పొలాలను దుక్కికి సిద్దంచేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పూర్ణిమ అంటారు. ఏరువాక పొంగి పొర్లటానికి చేసే పూజ అని కూడా అంటారు. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వటంగాని, దున్నడంగాని చేయరాదని నానుడి ఉన్నది. భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడంవల్ల భూమి నుంచి విషవాయవులు వెలువడి మనుషుల ఆరోగ్యంపై ప్రభావం కలుగచేస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. అందువల్ల భూమి పూజ నిర్వహించేందుకు మాత్రమే కొద్దిగా తవ్వటం లేదా అరకలతో కొండ్ర వేస్తారు. పూర్తిస్థాయిలో వర్షం పడిన అనంతరం తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు. ఆరోజు వ్యవసాయానికి వినియోగించే పశువులన్నింటిని పరిశుభ్రంగా కడుగుతారు. గిట్టలకు పసుపు వగైరా పూస్తారు. నాగళ్లతో దుక్కిదున్నేందుకు బండ్లు కట్టి వాటిని కష్టపెడుతున్నందుకు క్షమించి కరుణించమని అన్నదాతలు వాటికి పూజలు నిర్వహిస్తారు. ఆహార ధాన్యాలు పండిరచటంలో సహకరించాలని కష్టజీవులైన మూగజీవాలను వేడుకొంటారు.
బెల్లం, బియ్యం, పాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. గ్రామంలో పెద్దలు, పిల్లలు అందరూ చేరి వినోదంగా పాటలు పాడతారు. సేద్యానికి అవసరమైన పనిముట్లయిన నాగలి, కర్రు, గుంటక, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటిని శుభ్రపర్చి పూజ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి సీత యజ్ఞమని, సంస్కృత భాషలో వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని ఉత్సవాలుగా జరుపుతారు. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగా చేసేవారు. అధర్వణ వేదం ఏరువాకను ‘‘ అనడుత్సవం’’గా చెప్పింది. నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడంవంటి పద్దతులను అనాడు ఆచరించేవారు. ఆ తరువాత కాలంలో పరాసరుడు, బోదాయనుడు మొదలైన మహర్షులు కూడా ఈ పండుగ గురించి ప్రస్తావించారు.
విష్ణుపురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించారు. సీత అంటే నాగలి అని అర్థం. వప్ప మంగళదివసం, బీజవాహన మంగళదివసం, వాహనపునా: మంగళం, కర్షణ పుణా: మంగళం అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా వివిధ ప్రాంతాల వారు జరుపుకునేవారు. శుద్దోదన మహారాజు అనాడు కపిలలో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు శాస్త్రాలలో వివరించబడిరది. హలుడు వ్రాసిన గాధసప్తసతిలో ఏరువాక గురించి వివిధ కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగువారు నిర్వహించే పండుగలలో సాహిత్య అధారాలున్నా వేల సంవత్సరాలుగా ప్రాచుర్యం పొందినది ఏరువాక పండుగ. శ్రీ కృష్ణదేవరాయుల కాలంలో కూడా ఏరువాక గురించిన ప్రస్తావన ఉన్నది. ఇంత ప్రాచుర్యం ఉన్న ఏరువాకను మన రైతు సోదరులందరూ ఉత్సుకతో మహోత్సవంగా సాగించాలి. సంప్రదాయ వ్యవసాయ పద్దతులు కొనసాగిస్తూనే ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. ట్రాక్టర్లు ఇతర సాంకేతిక, యాంత్రీకరణలను వినియోగించుకోవాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న వ్యవసాయ పరిస్థితులలో రైతాంగాన్ని, కౌలు రైతులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఏరువాక మహోత్సవంలో రైతాంగాన్ని భాగస్వాములను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో ఏరువాక మహోత్సవాన్ని నిర్వహించాలి. అదేవిధంగా గ్రామీణ రైతాంగాన్ని వ్యవసాయంలో నిలబెట్టేందుకు సాంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగించి రైతులకు ఎద్దులు, ఎడ్లబండ్లు, ఇతర పనిముట్లు 50శాతం సబ్సిడీపై అందించాలి. వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్ల రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 50శాతం సబ్సిడీపై డీజిల్ అందించాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన సబ్సిడీ పథకాలను అందించాలి.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
సెల్: 9490952737