చలసాని జగన్నాధరావు
విశాలాంధ్ర పత్రిక ప్రారంభించిన 1952 జూన్ 22 నుంచి ఈరోజు వరకు నేను విశాలాంధ్ర పాఠకుడ్ని. ఇప్పుడు నా వయసు 98 ఏళ్లు. విశాలాంధ్రకు ముందు ప్రజాశక్తి పత్రిక ఉండేది. అది కూడా నేను చదివేవాడిని. రహస్య దినాలలో స్వతంత్ర భారత్ పత్రికను రహస్యంగా నూజివీడు తాలూకా తూర్పు దిగవల్లిలో సైక్లోస్టెల్ తీసి జిల్లా అన్ని ప్రాంతాలకు పంపేవారం. పార్టీ పత్రికలతో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. జై ఆంధ్ర ఉద్యమంలో ఏజంట్లు లేకపోతే నేను ఏజంటుగా ఉండి నూజివీడులో పత్రిక నడిపాను. మా అబ్బాయి రామారావు పత్రికను పంపిణీ చేసేవాడు. చాలాకాలం విశాలాంధ్రకు నూజివీడు విలేకరిగా పనిచేశాను. నాకు విశాలాంధ్ర అక్రిడేషన్ కార్డు కూడా ఉండేది. నూజివీడు తాలూకాలో పార్టీ నిర్వహించిన భూపోరాటాల సందర్భంగా, సత్యాగ్రహాల సందర్భంగా ప్రతిరోజు నూజివీడు నుంచి వార్తలు ప్రెస్ టెలిగ్రాం ద్వారా పంపేవాడిని. ఏరోజు వార్తలు ఆరోజు పత్రికలో వచ్చేవి. విశాలాంధ్ర పత్రిక మేము జరిపిన ఉద్యమాలకు ఎంతో ఊతంగా ఉండేది. ఇప్పటికి నేను ప్రతిరోజు ఉదయం విశాలాంధ్ర పత్రిక వచ్చిన దగ్గర నుండి రాత్రి వరకు అ నుండి క్ష వరకు చదువుతాను. విశాలాంధ్ర పత్రికే నాకు చివరి రోజుల్లో కాలక్షేపం. పత్రిక 72 వ వార్షికోత్సవం జరుపుకోవటం, ఈ 72 ఏళ్ల నుంచి ఈ పత్రిక పాఠకునిగా నేను ఉండటం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది. భవిష్యత్తులో విశాలాంధ్ర సామాజిక విప్లవంగా కీలక పాత్ర వహించాలని, సోషలిజం నిర్మాణ లక్ష్యంతో పురోగమించాలని ఆశిస్తాను.
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, నూజివీడు