వేల్పుల నారాయణ
సింగరేణిని ప్రైవేటీకరించడంలేదని కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం చెపుతోంది. బయటి ప్రపంచానికి ఇది వాస్తవమే అనిపించవచ్చు. కాని అదేసమయంలో దేశంలోని ఇతర బొగ్గుగనులతో పాటు సింగరేణి కొత్త బొగ్గుగనులను కూడా కేంద్రం వేలం వేస్త్తోంది. ఆ వేలం ద్వారా కార్పొరేట్లకు సింగరేణి కొత్త బ్లాకులను అప్పగించాలని చూస్తోంది. ఆ వేలంలో సింగరేణి ఇతర ప్రైవేటు కంపెనీలతో పాల్గొని ప్రైవేట్ వారికంటే ఎక్కవ మొత్తంలో బిడ్డింగు వేస్తేనే కొత్త గనులు దక్కించుకునేె అవకాశం ఉంది. లేకుంటే సింగరేణికన్నా ఎక్కవ మొత్తం వేసిన ప్రైవేటు యజమానులకు సింగరేణి గనులు దక్కించుకోవచ్చు.ఇప్పటి వరకు సింగరేణి ప్రాంతంలో ఎక్కడైనా ఏ కొత్త గనినైనా ప్రారంభించే అధికారం హక్కు సింగరేణికి, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. 1920లో దక్కన్ కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీగా మారినప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలపై హక్కులన్ని సింగరేణికి కల్పించారని అప్పటినుంచి సింగరేణికి మాత్రమే ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు చేసుకునే హక్కు ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి. అందువల్లనే సింగరేణిలో ప్రైవేట్ గనుల తవ్వకాలకు అవకాశం ఇప్పటివరకు లేదు. సింగరేణికి నైజాం కాలం నుంచి వస్తున్న ఈ హక్కును కాలరాసి వేలం ద్వారా ప్రైవేట్ వారికి దారదత్తం చేస్తున్నదెవరు? దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నదెవరు? 51శాతం రాష్ట్రం, 49శాతం కేంద్రం వాటాతో జాయింట్వెంచర్ ప్రభుత్వరంగ పరిశ్రమగా 39 గనులతో, 40 వేల ఉద్యోగులు, కార్మికులతో బొగ్గు తవ్వకాల్లో ఆధునిక సాంకేతికతతో, ప్రతి ఏడు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ, వేలకోట్ల లాభాలను ఆర్జిస్తూ ప్రగతి పురోగమనంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణికి భవిష్యత్తులో కొత్తగనులు రాకుండా, ఎలాంటి విస్తరణకు అవకాశం లేకుండా తనకు తానే కుంచించుకు పోయేవిధంగా కుట్రపన్నుతున్నదెవరు?ఎవరి పాత్ర ఎంతున్నదనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది.
దేశంలో వివిధ ప్రైవేట్ యాజమానుల ఆధీనంలో నడుస్తున్న బొగ్గు కంపెనీలను జాతీయ ప్రయోజనాల, ప్రజా ప్రయోజనం దృష్ట్యా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సాహాసోపేతంగా 1973 మే 1న బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం ద్వారా బొగ్గు పరిశ్రమను జాతీయం చేశారు. 1975లో కోల్ ఇండియా సంస్థ(సీిఐఎల్)ను ఏర్పాటుచేసి ఆయా రాష్ట్రాల్లో దేశ వ్యాపితంగా ఉన్న బొగ్గు కంపెనీలన్నింటిని దాని అజమాయిషీలోకి తీసుకువచ్చారు. అప్పటికే సింగరేణిసంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉండడం వల్ల కోల్ఇండియాతో సంబంధం లేకుండానే ఇప్పటివరకు స్వతంత్రంగా కొనసాగుతోంది. ఆ తర్వాత దేశంలో విద్యుత్తు, సిమెంటు, ఇనుము తదితర మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోను, ప్రైవేట్ రంగంలోనూ రావడంవల్ల ఆయాసంస్థలు తాము సొంతంగా తమ పరిశ్రమలకు అవసరమైన బొగ్గు గనులను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కావాలనే డిమాండ్తో 1976లో, 1993లో, 1996లో 1973 బొగ్గుగనుల జాతీయకరణ చట్టానికి సవరణలుచేసి సొంత పరిశ్రమలకు అనుబంధంగా బొగ్గు గనులు తవ్వుకోవడానికి క్యాప్టివ్ మైన్సుగా అనుమతి కల్పించింది. కాని దీని ద్వారా సొంతంగా బొగ్గు వాడుకోవాలి తప్ప అమ్ముకొని వ్యాపారం చేయడానికి వీలు లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి బొగ్గు తీయడం కష్టంగా ఉన్నదని, తీస్తే లాభదాయకం కాదనే నెపంతో అనిశెట్టి పల్లి, పెనుగడప, శ్రావణ పల్లి, పునుకుల చెలుక, గుండాల గనులను ప్రైవేట్కు క్యాప్టివ్ గనులుగా ప్రైవేట్ వారికి ఇవ్వడానికి కేంద్రం ప్రకటించింది. అప్పుడు సింగరేణి వ్యాపితంగా ఏఐటీయుసితో పాటు ఇతర కార్మిక సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2005లో క్యాప్టివ్ మైనింగ్ క్రింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బొగ్గు బ్లాకును రాష్ట్ర విద్యుత్సంస్థ జెన్కోకు కేటాయించింది. జెన్కోకు కేటాయించిన గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పీఎల్ఆర్ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. బొగ్గు తీసేందుకు ఆ గనిని అపార అనుభవమున్న సింగరేణికి అప్పగించాలని, ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ 2011లో సింగరేణి కార్మికసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకించింది. ఉద్యమానికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పీఎల్ఆర్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేసి తాడిచర్ల బొగ్గు తవ్వకాలు సింగరేణి చేపట్టాలనీ, సింగరేణి సీ అండ్ ఎండీకి లేఖ రాశారు. కార్మికులకు ఉపాధితో పాటు సింగరేణి కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న తాడిచెర్ల బ్లాక్ ను తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ ఎస్ అధినేత, నాటి సీఎం కేసీఆర్ స్వయంగా 2015లో జెన్కో ద్వారా ఏఎంఆర్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. కార్మిక సంఘాలు ఆందోళనచేసినా వినలేదు. అప్పటికే లాభాలు వచ్చే ప్రభుత్వరంగ పరిశ్రమలను తన కార్పొరేట్ మిత్రులకు దారాదత్తం చేసేందుకు వాటిని ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న బీజేపీి ప్రభుత్వం కోల్ ఇండియా పరిధిలో, సింగరేణి పరిధిలో గల బొగ్గుగనులను కూడా మెల్లమెల్లగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందువల్లనే దీనికి అడ్డంకిగా ఉన్న చట్టాలను మార్చడానికి పూనుకుంది. అప్పటి వరకు దేశవ్యాపితంగా ఉన్న సహజవనరులు, ఖనిజాలు తవ్వితీసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మైన్స్ మినరల్ అండ్ డెవలప్మెంటు చట్టం 1957 ప్రకారం గనులు తవ్వడానికి అనుమతులిచ్చేవారు. దీనితోపాటు 1973లో తీసుకువచ్చిన బొగ్గుగనుల జాతీయీకరణ చట్టం ప్రకారం బొగ్గుగనులు నడిచేవి. ఈ రెండు చట్టాలను సవరించి ప్రైవేటీకరణకు అనుకూలంగా మార్చేందుకు ‘బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనలు’ బిల్లు 2014ను అప్పటి బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2014 డిసెంబర్ 10న లోక్సభలో ప్రవేశపెట్టారు. బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం 1973లో, గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం 1957(ఎంఎండీఆర్)లో అనేక ప్రైవేటీకరణ అనుకూల సవరణలతో ఈ బిల్లు 2014 అక్టోబర్ 21న పార్లమెంటులో ఆమోదంపొందింది. ఆ తర్వాత 2015 లో చట్టంగా వచ్చింది. జాతీయీకరణ చట్టం ప్రకారం క్యాప్టీవ్ మైన్సుగా అనుమతి పొంది తమ సొంత అవసరాలకు మాత్రమే బొగ్గును వినయోగించుకోవాల్సి ఉండే విధానం మార్చి బొగ్గును బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ప్రైవేట్ కంపెనీలను అనుమతించేలా ఈ బిల్లు వీలు కల్పించింది.అదేవిధంగా దేశంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను పబ్లిక్వేలం లేదా ప్రభుత్వం అవసరమనుకుంటే వేలం లేకుండా నామినేషన్ ద్వారా కేటాయించే వీలు కల్పించింది. అంటే అప్పటివరకు తెలంగాణ సింగరేణి హక్కుగా ఉన్న కొత్త గనులన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తెలంగాణలోని సింగరేణి ఉనికికి ప్రమాదంగా ఉన్న ఈ బిల్లును 2014లో పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన ఎంతో ఖర్చు చేసి బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరిపి తవ్వకానికి సిద్దంగా ఉన్న గనులు కూడా వేలంవేసి ప్రైవేటీకరించే ఆస్కారముందని తెలిసి కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు వారి ఎంపీలు బీజేపీ తో ఎలాంటి అవగాహన చేసుకున్నారో కాని దీన్ని వ్యతిరేకించలేదు. మౌనంగా బిల్లుకు మద్దతు తెలిపారు. తెలంగాణకు, సింగరేణి భవిష్యత్తుకు అన్యాయం చేశారు.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2020 జూన్లో బొగ్గుగనులను వ్యాపార పద్దతిలో వేలంవేసే ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2020 నుంచి 2023 వరకు కేంద్ర బొగ్గుశాఖ తొమ్మిది సార్లు వేలం నిర్వహించి 107 గనులు అమ్మివేసింది. 2021లో వేలం ప్రక్రియలో సింగరేణికి చెందిన బొగ్గు గనులు కూడా వేలంలో పెట్టడంవల్ల రాష్ట్ర వ్యాపితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో, కార్మికుల్లో పెద్ద ఎత్తున నిరసన రావడంతో దిద్దుబాటుచర్యగా వేలం వ్యతిరేకిస్తున్నామని నిరసన తెలుపుతూ, వేలం లేకుండానే సింగరేణి గనులు నామినేషన్ పద్దతిలో సింగరేణికే కేటాయించాలని కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తీసుకువచ్చినా వేలం ప్రక్రియ ఆగలేదు. ఒకదిక్కు సింగరేణి కంపెనీ ఇక్కడ గనుల వేలంలో పాల్గొనవద్దని ఆదేశించి మరో దిక్కు సింగరేణి కంపెనీ ఒడిశా బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనేందుకు ఆదేశించి ద్వంద్వనీతిని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసింది. వేలం పాటలో పాల్గొని సింగరేణి ఒడిశాలోని నైనీ ఓపెన్ కాస్టు బొగ్గుగనిని దక్కిచుకుంది. సింగరేణి వేలం పాటలో అప్పుడు కోయగూడెం-3,సత్తుపల్లి-3, రెండు కొత్త బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు దక్కించుకున్నాయి. కారణాలు ఏమైనా ఇంకా ప్రైవేట్ వ్యక్తులు పనులు ప్రారంభించలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీి అధికారంలోకి వచ్చింది. తిరిగి దేశవ్యాప్తంగా కేంద్రం 61 బొగ్గుగనుల వేలం ప్రక్రియ జూన్ 21 న ప్రారంభించింది. వేలంలో సింగరేణికి చెందిన శ్రావణ పల్లి బొగ్గు గనిని కూడా చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే సింగరేణి బావులను వేలం వేస్తున్నారని, బీజేపి కాంగ్రెస్ కుమ్మక్కై సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నాయని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తీసుకువచ్చిన బొగ్గు గనుల ప్రైవేటీకరణ,వేలం పాటల ఏఎండీఆర్ బిల్లుకు మద్దతు పలికిన బీఆర్ఎస్ చేసిన తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
కాంగ్రెసు మాత్రం ఈ పాపం బీజేపీ,బీఆర్ఎస్లదేనని ఎదురు దాడి చేస్తూ బిల్లులోని సెక్షన్ 17 ఏ ప్రకారం వేలం లేకుండా నామినేషన్ పద్దతిలో సింగరేణి గనులు సింగరేణికే కెేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్త్తోంది. మరోవంక సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన ఏఐటీయుసి సింగరేణి కొత్తగనుల వేలంపాట ఆపాలని, నామినేషన్ పద్దతిలో సింగరేణికి గనులు కేటాయించాలని పోరాట కార్యక్రమం తీసుకుంది. జులై 5 న సింగరేణి బంద్తో పాటు 15రోజుల పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన పోరాట కార్యక్రమం తీసుకుంది. ఎన్నికల సమయంలో సింగరేణిని ప్రైవేటీకరించబోమని, సింగరేణి అభివృద్ధికి కృషిచేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అనైతికంగా సింగరేణిలో కొత్తగనుల వేలం ప్రక్రియ ప్రారంభించి లాభాలు ఆర్జిస్తూ ప్రతి సంవత్సరం వేల కోట్లు రాయాల్టీ పేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న సింగరేణిని ప్రైవేట్ పరంచేయడానికి పూనుకుంటోంది. దీనిని ప్రజలందరూ, అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడి సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.