ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు గత పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ, ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఏమీ గుణపాఠం నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. హిందుస్థాన్లో హిందూయేతర ప్రజలు హిందూ సంస్కృతిని, భాషను అనుసరించాలి. అంతేకాదు, హిందూజాతి, సంస్కృతుల గొప్పతనాన్ని పొగడాలి. అలా పొగిడేవాళ్లే ఈ దేశంలో ఉండాలి, హిందూ జాతికింద అణిగిమణిగి ఉండాలి, ఎలాంటి హక్కులను, సౌకర్యాలను కోరరాదు. పౌరహక్కులు కూడా ఉండవు. ఎలాంటి ఆదరణ, ప్రత్యేకత వారికి ఉండవు’’ ఆర్ఎస్ఎస్ నేత ఎంఎస్ గొల్వాల్కర్ రచించిన ‘ఉయ్ ఎండ్ అవర్ నేషన్ హుడ్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపకులలో ప్రముఖ వ్యక్తి గోల్వాల్కర్. హిట్లర్ను, నాజీయిజాన్ని అనుసరించిన వ్యక్తి. దేశం స్వాతంత్య్రం పొందినతర్వాత కూడా దేశం స్వాతంత్య్రం పొందవలసి ఉందని అన్నారు. హిందూ రాష్ట్రం ఏర్పడితేనే దేశం విముక్తి పొందినట్లు అవుతుందని అన్నారు. హిట్లర్, గోల్వాల్కర్ చరిత్రలో కలిసిపోయారు. సమాజంలో తిరోగమనవాద స్వార్థపర శక్తులది పైచేయి అయినప్పుడు వారిరువురు మళ్లీ పుట్టుకొస్తారు. వారు ఏనాడు ఆర్థిక సమస్యలను చర్చించలేదు, అలాగే గుత్త పెట్టుబడి దారులకు, భూ స్వాములకు వ్యతిరేకంగా లేదు. వారికి అనుకూలంగానే వ్యవహరించారు. గోల్వాల్కర్ తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేతగా 1973లో బాధ్యతలు బాబాసాహెబ్ దేవరస్ తీసుకున్న తర్వాత తన వారసులు రూపొందించిన లక్ష్యాలను సాధించేందుకు చేయవలసినవన్నీ చేశారు. కుతంత్రాలన్నింటినీ కొనసాగించారు. 2014 తర్వాత కుట్రలు, కుతంత్రాలను వేగిరం చేశారు.
2014 లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీజేపీ పదేళ్ల పాలనలో హిందూమత అజెండాను అనుసరించడం మూలంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తరచుగా ముస్లిం మైనారిటీలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ముస్లింలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆకస్మికంగా వివిధ చోట్ల ముస్లింలపై దాడులు పెరిగాయి. మధ్యప్రదేశ్, చత్తీస్ఘర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, దిల్లీలలో అధికంగా దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. చత్తీస్ఘర్ రాజధానిలో ఎద్దులను రవాణా చేస్తున్న ముగ్గురు ముస్లింలు ఆవులను రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ ‘గో రక్షకులు’ చంపివేశారు. అలీఘర్లో దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ముస్లిం మతస్థుడిని కొట్టి చంపేశారు. మధ్యప్రదేశ్లో మండలలో పదకొండుమంది ముస్లింల ఇళ్లను కూల్చివేశారు. వీరి ఇళ్లల్లో బీఫ్ ఉందని ఆరోపిస్తూ బుల్డోజర్లతో కూలగొట్టారు. 24గంటల్లో ఈ దారుణ కృత్యాలను చేశారు. లక్నో నగరంలోని అక్బర్ నగర్లో అత్యధికంగా ముస్లింలు నివసిస్తున్నారు. నది ఒడ్డును నిర్మించేపేరుతో వేయికిపైగా ముస్లింల ఇళ్లను బుల్డోజర్తో నేలమట్టం చేశారు. గుజరాత్లో వదోదరలో ఈ పై ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి గృహనిర్మాణం పథకం కింద హిందువులకు కేటాయించిన ప్రాంతంలో ముస్లిం మహిళకు ఒక ఫ్లాట్ను కేటాయించారు. ఫలితంగా వేయి ముస్లింల ఇళ్లను కూలగొట్టారు. హిమాచల ప్రదేశ్లో నహాన్ప్రాంతంలో ముస్లింలకు చెందిన షాపును లూటీ చేశారు. ఈద్అల్
అధా రోజున ఆవును కోశాడని ఆరోపిస్తూ షాపును ద్వంసం చేశారు.
గోవును చంపేశారని ఆ ముస్లింపైన కేసు నమోదుచేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత 16మంది ముస్లిం షాపు యజమానులను ఆ పట్టణంలో లేకుండా తరిమివేశారు. దిల్లీ సంగమ్ విహార్ హిందుత్వ ప్రచారకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఆప్రాంతంలోని ముస్లిం నివాసులంతా అక్కడినుంచి మరొకచోటకు వెళ్లిపోయారు. ఒకచోట ఆవుల కళేబరాలను స్వాధీనం చేసుకుని ముస్లింలే చంపేశారని ఆరోపించారు. ఇంత తీవ్రంగా మత దాడులను చేయడానికి కారణం ఆ ప్రాంతంలో బీజేపీకి ఓట్లు వేయలేదన్న దుగ్ధతోనే ఈ పనిచేశారు. హిందుత్వ మతశక్తుల సమీకరణకోసమే పగతో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు.
జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో మతోన్మాద వాతావరణం మరింత దారుణంగా తయారైందని తెలిపారు. సామాజికస్థాయిలో ఈ హింస తీవ్రతరమైందని, కొన్నిసార్లు పూజలు జరిగేప్రాంతంలో మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మత స్వేచ్ఛను పరిశీలించే అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ ఇలా చెప్పారు. భారతదేశంలో స్థానిక పోలీసులు పూజలు చేసేప్రాంతాల్లో పూజలు జరగకుండా మతోన్మాద సమూహాలు క్రైస్తవులపైన దాడులు సాగించారు. అయితే దాడులకు గురైన వారంతా ఇతర మతాలనుంచి క్రైస్తవంలో చేరారని ఆరోపిస్తూ దాడులు సాగించిన గుంపులకు సహకరించారు. ప్రతీకారంతో ఇతరుల స్వేచ్ఛను హరిస్తున్నారు. మత స్వేచ్ఛ నివేదికను ప్రతిసంవత్సరం రూపొందిస్తారు. అమెరికా ప్రభుత్వ విభాగం ఈ నివేదికను ప్రచురిస్తుంది. అన్నిదేశాల మత స్వేచ్ఛ పరిస్థితిని నివేదికలో ప్రధానంగా పేర్కొన్నారు. గత సంవత్సరం జనవరి 1వ తేదీనుంచి డిసెంబరు 31వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, ఆయా దేశాల్లో మత స్వేచ్ఛ సమాచారం ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, మత విశ్వాసాలు, మత ఆధిపత్యం వ్యక్తులకుగల స్వేచ్ఛ లాంటివి ప్రచురిస్తారు. అమెరికా విదేశాంగ శాఖమంత్రి ఆంధోని బ్లింకెన్ ఇండియాలో విద్వేష ప్రసంగాలు, మత మార్పిడి చట్టాలు, ఇళ్ల కూల్చివేతలు, మత మైనారిటీలపై దాడులు తదితర అంశాలు ఆందోళనకర స్థాయిలో పెరిగాయని అన్నారు. 2023 అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదికను విడుదలచేస్తూ బ్లింకెన్ చేసిన ప్రసంగంలోని మాటలివి. 2022లో 272 మత హింస ఘటనలు జరిగాయి. మత మైనారిటీ గ్రూపులపైన దాడులు చేయడమేకాదు, కొన్ని చోట్ల చంపివేశారు. కొన్నిచోట్ల బెదిరించి ఆయా చోట్లనుండి తరిమివేశారు.
గత సంవత్సరం క్రైస్తవులపైన 731 దాడులు జరిగాయని ఐక్య క్రైస్తవ ఫోరం నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. హింసను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కోర్టు పేర్కొంది. ఈ ఘటనలపై దర్యాప్తునకు అధికారులను నియమించారు. అలాగే మానవీయసహాయం తప్పక అందే చర్యలు తీసుకోవాలని, కూల్చివేసిన ఇళ్లను, ఆలయాలను తిరిగి నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్నిసార్లు హిందూ పండగల సందర్బంగా ఉత్సవాలను నిర్వహించినప్పుడు కూడా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మెజారిటీ ముస్లింలు ఉన్నప్రాంతాల్లో హిందు పండుగలకు జరిగే ఊరేగింపులు సందర్భంగా అల్లర్లు జరుగుతున్నాయి.
గత డిసెంబరులో పార్లమెంటు కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించింది. ఈ చట్టాలను ప్రజలను మరింతగా ఇబ్బందులు పెట్టడానికే చేశారన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ముస్లిమేతర మహిళలను హిందువులు వివాహం చేసుకున్నప్పుడు ముస్లింలనే శిక్షించేందుకు ఈ చట్టాలను ఉపయోగిస్తారని మీడియా వ్యాఖ్యాతలు అంచనావేస్తున్నారు. ప్రత్యర్థిపక్షాలు ఈ చట్టాలు అనవసరమైనవని, ప్రత్యర్థులను శిక్షించడానికే ఇవి ఉపయోగిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఒకే విధమైన పౌరస్మృతి(యుసిసి) చట్టాన్ని తీసుకురావాలని ఇది దేశవ్యాప్తంగా అమలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. వివిధ మతస్థులకు ఈ చట్టాలను అమలు చేస్తున్నారు. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, గిరిజనులు తదితర మతాలకు భిన్న చట్టాలున్నాయని దేశం మొత్తానికి ఒకే చట్టం ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. దేశాన్ని ‘‘హిందు రాష్ట్రం’’గా మలిచేందుకే కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అనేక రాష్ట్రాలు ఒకే పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నారు.